పవర్ లో ఉండగానే పెరట్లో కట్టేసుకోవాలనేగా?

ప్రాంతీయ పార్టీల్లో అన్ని రకాలైన జాడ్యాలతో పాటు, బంధు ప్రీతి కూడా జబర్దస్తుగా ఉంటుంది. అది ఒక బలమైన ప్రాంతీయ పార్టీ టీడీపీ ఎపుడో నిరూపించింది. టీడీపీ [more]

Update: 2020-04-07 02:00 GMT

ప్రాంతీయ పార్టీల్లో అన్ని రకాలైన జాడ్యాలతో పాటు, బంధు ప్రీతి కూడా జబర్దస్తుగా ఉంటుంది. అది ఒక బలమైన ప్రాంతీయ పార్టీ టీడీపీ ఎపుడో నిరూపించింది. టీడీపీ విషయానికి వస్తే దాదాపుగా సగానికి పైగా బంధువులతోనే నిండిపోయి ఉన్నారు. ఇపుడు అదే జబ్బు వైసీపీకి కూడా పాకుతోంది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు ఇపుడు తాము పవర్ లో ఉండగానే దాన్ని ఇంటి పెరట్లో కట్టేసుకోవాలన్న కొత్త దుగ్దతో ముందుకుపోతున్నారు. ఫలితంగా పార్టీ కోసం జెండాలు మోసిన వారు దారుణంగా అన్యాయం అయిపోతున్నారు.

ఏమీ కాకుండా….

జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వేళ ఆయన ఒంటరివాడు. ఆయన రాజకీయ‌ భవిష్యత్తు మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేని రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు అప్పటికి బంగారం లాంటి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి జగన్ వెంట నడిచారు. దానికి ఒకే ఒక కారణం. వైఎస్సార్ తో ఉన్న బ్యాండేజ్. జగన్ పట్ల ఉన్న అభిమానం. ఇలా పదేళ్ళ పాటు తమ ఇల్లూ, ఒళ్ళూ గుల్ల చేసుకున్న వారు జగస్ సీఎం చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో వైసీపీ కార్యకర్తలు పనిచేసారు. అందుకోసం తాము ఏమైపోయినా ఫరవాలేదు అనుకున్నారు. చివరికి ఆ టార్గెట్ సాధించారు. తరువాత చూసుకుంటే తాము ఏమీ కాకుండా ఉత్త చేతులతో మిగిలిపోయారు.

అన్నీ అటేనా…?

జగన్ స్థానిక ఎన్నికల్లో బంధువులకు టికెట్లు ఇవ్వవద్దు, దగ్గర వారు అని అసలు చూడవద్దు, పనిచేసే కార్యకర్తలకు టికెట్ ఇచ్చి గెలిపించాలని, తద్వారా వారిని కూడా అధికారంలో భాస్వాములను చేయాలని గట్టిగానే సూచించారు. అయితే జరిగింది వేరు. విశాఖ మహానగర‌ కార్పొరేషన్ ఎన్నికల్లో చూసుకుంటే తమ బంధువులు, రక్తసంబంధీకులకే టికెట్లు ఇచ్చేసుకున్నారు. గాజువాక ఎమెల్యే తిప్పల నాగిరెడ్డి అయితే తన వారసుడిగా కొడుకుని బరిలోకి దించేశారు. దేవాన్ష్ రెడ్డికి కార్పోరేటర్ టికెట్ ఇచ్చారు. ఇక వైసీపీలో గత సార్వత్రిక ఎన్నికల వేళ చేరిన మరో కీలక నేత బెహరా భాస్కర రావు తన భార్యకు, కోడలికి కూడా టికెట్లు ఇప్పించుకున్నారు. ఏకంగా మంత్రి అవంతి శ్రీనివాస్ తన కుమార్తె శ్రావణికి ఆరవ వార్డు టికెట్ ఇప్పించేసారు. ఇదే రూట్లో టోటల్ గా 98 వార్డుల్లో మెజారిటీ టికెట్లు వారసుల కోటాలో కొట్టేశారు.

అందుకే అలా….

సరిగ్గా సమయానికి స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు ఎలా వచ్చేవో తెలియదు కానీ ఇపుడు వాయిదా పడడంతో వైసీపీ క్యాడర్ పెద్ద లీడర్ల మీద గుస్సా అవుతోంది. అందుకే వారంతా ఇపుడు ఫుల్ సైలెంట్ అయ్యారు. కరోనా వైరస్ విషయంలో జనంలోకి వచ్చి పనిచేయడానికి వైసీపీ కార్యకర్తలు సిధ్ధంగా లేరు. జగన్ పార్టీ అధ్యక్షుడిగా పిలుపు ఇచ్చినా ఎక్కడా ఎవరూ కనిపించడంలేదు. దాంతో ఇపుడు వైసీపీ పెద్దలే రంగంలోకి దిగాల్సివస్తోంది. మరి పార్టీ అంటే కుటుంబం మాత్రమే కాదన్న సంగతి ఇప్పటికైనా అర్ధం చేసుకుంటే రాబోయే రోజుల్లో అయినా అసలైన కార్యకర్తలకు న్యాయం చేస్తారు. లేకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో క్యాడర్ ఇదే తీరున చేతులెత్తేస్తే ఎంతటి బలమైన వారసుడు అయినా ఓడి ఇంటికెళ్ళాల్సిందే. వైసీపీలో ఇప్పటికైనా మధనం జరగాలి. టీడీపీకి జెరాక్స్ కాపీగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే పతనం పక్కనే ఉంటుంది.

Tags:    

Similar News