విశాఖ నువ్వంటే…? మంగళగిరి నేనంటా?

విశాఖపట్నం అనగానే టీడీపీ నేతలు విజయమ్మను గుర్తుకు తెస్తున్నారు. జగన్ తల్లి విజయమ్మ 2014 ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. [more]

Update: 2020-03-06 14:30 GMT

విశాఖపట్నం అనగానే టీడీపీ నేతలు విజయమ్మను గుర్తుకు తెస్తున్నారు. జగన్ తల్లి విజయమ్మ 2014 ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని విశాఖ వైపు రానివ్వకుండా ఉండేందుకే విజయమ్మను విశాఖ ప్రజలు ఓడించారన్నది టీడీపీ నేతలు చెబుతున్న మాట. ఇటీవల విశాఖ ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబును అడ్డుకున్న సమయంలోనూ టీడీపీ నేతలు విజయమ్మ ఓటమి ప్రస్తావనే తేవడం గమనార్హం.

విజయమ్మ ఓటమితో…..

2014 ఎన్నికల్లో నిజానికి రాష్ట్రమంతటా టీడీపీ గాలులు వీచాయి. నరేంద్ర మోదీ ప్రభావం కూడా రాష్ట్రంపై చూపింది. కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేయడంతో ఆ పార్టీ పట్ల పూర్తి నెగిటివ్ థాట్ లో ఉన్న ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇందులో విద్యావంతులు, యువకులు ఎక్కువగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు కూడా టీడీపీ, బీజేపీ కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా లాభించింది. ఈ పరిణామాలు కూడా విజయమ్మ ఓటమికి కారణమని అప్పట్లో విశ్లేషణలు విన్పించాయి.

అనేక కారణాలు…..

ఆరేళ్లు దాటుతున్నా ఇప్పటికీ విజయమ్మ ఓటమిని ఎత్తి చూపుతున్నారు టీడీపీ నేతలు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత విజయమ్మ ఓటమి వార్తలు సోషల్ మీడియాలోనూ ఎక్కువగా కన్పిస్తున్నాయి. అయితే వైసీపీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. విజయమ్మ ఓటమిని పక్కన పెడితే నారా లోకేష్ మాటేమిటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మంగళగిరిలో 2019 ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి వైైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓటమి పాలయిన సంగతి తెలిసిందే.

మంగళగిర మాటేమిటి?

రాజధాని ప్రాంత ప్రజలు కూడా నారా కుటుంబాన్ని తిరస్కరించారని వైసీపీ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రాజధానిగా ప్రకటించిన తర్వాత కూడా నారా లోకేష్ ఓటమి పాలయ్యారంటే ప్రజలు నారా పాలనను వద్దనుకుంటున్నారని వైసీపీ కొత్త భాష్యం చెబుతోంది. విశాఖలో విజయమ్మ అంటే మంగళగిరిలో లోకేష్ అని మేమనలేమా? అని ప్రశ్నిస్తుంది. మొత్తం మీద విశాఖ, మంగళగిరిలో ఓటములు పార్టీకి అస్త్రాలుగా ఉపయోగపడుతున్నాయి.

Tags:    

Similar News