రెండు పార్టీల్లోనూ అదే అస్థిరత ?

ఏ దేశమైనా ఏమున్నది గర్వకారణం అని మహా కవి శ్రీశ్రీ అంటాడు. అలాగే ఉంది ఏపీలో రెండు ప్రధాన పార్టీల పరిస్థితి అన్నది రాజకీయ జీవుల భావన. [more]

Update: 2021-05-12 11:00 GMT

ఏ దేశమైనా ఏమున్నది గర్వకారణం అని మహా కవి శ్రీశ్రీ అంటాడు. అలాగే ఉంది ఏపీలో రెండు ప్రధాన పార్టీల పరిస్థితి అన్నది రాజకీయ జీవుల భావన. ఏపీలో విపక్షంలో ఉన్న టీడీపీకి నాయకత్వ సమస్య ఉందనే ఇపుడు తమ్ముళ్లు సైలెంట్ అవుతున్నారు. చంద్రబాబుని చూసుకుని రెచ్చిపోతే రేపటి రోజున తమను కష్టకాలంలో ఆదుకునే నాధుడు ఉండడన్నదే వారి ఆందోళన. అందుకే గమ్మున ఉండిపోతున్నారు. ఇన్నాళ్ళూ టీడీపీలో ఉన్న ఈ అస్థిరతను మెల్లగా వైసీపీకి కూడా అంటించాలని పసుపు పార్టీ పన్నిన వ్యూహం మెల్లగా విజయవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బేఫికర్ అనుకున్న వేళ…

ఏపీలో జగన్ పాలనకు రెండేళ్లు గడచాయి. వరసగా అన్ని ఎన్నికలూ పూర్తి అయ్యాయి. అన్నింటా ఏకపక్ష విజయాలు వైసీపీకి దక్కాయి. ఇక ఏముంది హాయిగా మిగిలిన మూడేళ్ల కాలానికి తాపీఫా సాఫీగా పాలన సాగించవచ్చు అని తలచిన సమయానికి జగన్ బెయిల్ రద్దు వార్తలు వైసీపీలో కొత్త అలజడిని రేపుతున్నాయి. ఏపీలో జగన్ రూపంలో వైసీపీకి పటిష్టమైన నాయకత్వం ఉందని, మరో మూడు దశాబ్దాల పాటు తమకు తిరుగులేదని భావించిన పార్టీ పెద్దలకు ఇపుడు బెయిల్ రద్దు వార్తలు తీవ్ర కలవరమే రేపుతున్నాయిట.

అదే వ్యూహమా…?

టీడీపీ పని అయిపోయిందని, చంద్రబాబు వయసు రిత్యా పెద్దవారు అయిపోయారని, లోకేష్ ఏమీ తెలియని మాలోకమని ఇంతకాలం వైసీపీ అంటూ వచ్చేది. అందువల్ల ఎవరు వచ్చినా తమ పార్టీలోకేనని కూడా గట్టిగా జబ్బలు చరచేది. ఏపీలో మరిన్ని ఎన్నికల దాకా కొత్త నాయకత్వానికి చాన్సే లేదని, జగన్ వయసు రిత్యా చూసినా ఆయన హవాయే కొనసాగుతుందని ధీమాగా చెప్పుకునే వారు. అటువంటి వైసీపీలో ఇపుడు అలజడి రేపి మళ్లీ జగన్ కి జైలే ప్రాప్తం అన్నట్లుగా టీడీపీ చేస్తున్న ప్రచారం ప్రకంపనలే సృష్టిస్తోంది. దాంతో ఇపుడు వైసీపీలో కూడా నాయకత్వ సమస్య ఉందనే మాటను అన్ని పార్టీలూ అంటున్న సీన్ ఉంది.

ఏ క్షణమైనా…?

నిజానికి రాజకీయాల్లో ఏదీ జరగదు అని కచ్చితంగా చెప్పడానికి లేదు. ఇపుడు టీడీపీ పాడుతున్న పాట కూడా అదే. జగన్ ఏ క్షణమైనా జైలుకు వెళ్తాడు అంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న లాబీ గట్టిగానే తెర వెనక ప్రయత్నాలూ చేస్తోంది. అదే కనుక జరిగితే జగన్ లేని వైసీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ నీటి బుడగ మాత్రమేనని కూడా అంటున్నారు. మరి జగన్ జైలుకి వెళ్తాడో లేదో కాలం చెప్పాలి కానీ టీడీపీ సాగిస్తున్న ఈ ప్రచారంతో వైసీపీ నేతలకూ చమటలు పడుతున్నారు. అయిదేళ్ళయినా తాము ఏ టెన్షన్ లేకుండా పదవుల్లో ఉంటామా అన్న బెంగ కూడా వైసీపీలో చాలా మందికి పట్టుకుందిట. మొత్తానికి దొందూ దొందే అన్న సామెత మాత్రం టీడీపీ వైసీపీ నాయకత్వాలకు చక్కగా సరిపోతుంది అని మిగిలిన పార్టీలు అంటున్నాయి.

Tags:    

Similar News