జగన్ టార్చర్ పెడుతున్నారుగా

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మౌనంగానే ఉంటున్నారు. ఆయన ఎటువంటి కీలక అంశాలపై బహిరంగంగా మాట్లాడింది లేదు. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూ, వీధికెక్కిన అంశాలను [more]

Update: 2019-09-15 13:30 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మౌనంగానే ఉంటున్నారు. ఆయన ఎటువంటి కీలక అంశాలపై బహిరంగంగా మాట్లాడింది లేదు. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూ, వీధికెక్కిన అంశాలను కూడా జగన్ పట్టించుకోలేదు. దీంతో విపక్షాలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ ఏడాది మే 30వ తేదీన బాధ్యతలను స్పీకరించారు. ఇటీవలే తన వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ వంద రోజుల్లో జగన్ కేవలం మూడు బహిరంగ సభల్లోనే మాట్లాడారు. అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తున్నారు తప్ప మీడియా సమావేశం పెట్టలేదు.

వ్యూహాత్మకంగానే…..

వైఎస్ జగన్ వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారనిపిస్తోంది. ముఖ్యంగా అమరావతి రాజధాని అంశంపై తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఆందోళనకు దిగాయి. రైతుల పక్షాన నిలబడ్డాయి. అయినా జగన్ రాజధాని అమరావతి గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. అసలు రాజధాని అమరావతి విషయం జరగనట్లే రోజూ సెక్రటేరియట్ కు వచ్చి వెళుతున్నారు. కానీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం రాజధాని అమరావతిపై పదే పదే లీకులు వదులుతున్నారు. తాజాగా జగన్ అమరావతి, అర్బన్ డెవెలెప్ మెంట్ పై కమిటీని నియమించడం కూడా విపక్షాలకు చిర్రెత్తుకొచ్చేలా ఉంది. తాము రాజధానిపై స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరితే ఆయన కమిటీని నియమించడమేంటని టీడీపీ ధ్వజమెత్తుతోంది.

కీలక అంశాలపైనా…..

ఇసుక కొరత విషయంలోనూ అంతే జరిగింది. ఎంత రాద్ధాంతం చేసినా జగన్ తాను అనుకున్నట్లుగానే కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తెచ్చారు. కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చేంత వరకూ దానిపై ఒక్క మాట కూడా జగన్ మాట్లాడ లేదు. ఇక ఇటీవల వైసీపీ తమ కార్యకర్తలపై దాడులు చేస్తుందంటూ చలో ఆత్మకూరు కార్యక్రమానికి చంద్రబాబు పిలుపు నిచ్చారు. చంద్రబాబుతో పాటు సీనియర్ నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. అయినా జగన్ ఒక్క మాట మాట్లాడలేదు. హోంమంత్రి, డీజీపీతో సమీక్ష మాత్రం చేశారు. చలో ఆత్మకూరు అంశం జాతీయ మీడియాలో హైలెట్ అయినా జగన్ ఏమాత్రం పట్టించుకోనట్లే వ్యవహరించారు.

సెలెంట్ గా టార్చర్…..

అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టేవారు. ఒక్కసారి కీలక విషయాలుంటే అర్థరాత్రి సమయంలోనూ ప్రెస్ మీట్లుపెట్టిన సందర్భాలు కోకొల్లలు. ఐదేళ్లలో చంద్రబాబు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లకు లెక్కేలేదు. రెండుగంటలకు పైగా సాగే ఈ మీడియా సమావేశాల్లో తన పాలనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై చంద్రబాబు స్పందించే వారు. కానీ వైఎస్ జగన్ విషయానికొచ్చేసరికి పూర్తిగా విరుద్ధంగా మారుతుంది. మంత్రులే కీలక విషయాలను బయటపెడుతున్నారు. మంత్రులు చెప్పిన దానిని పట్టుకుని చంద్రబాబు ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఇలా జగన్ తన సైలెన్స్ తో విపక్షాలను టార్చర్ పెడుతున్నారన్న టాక్ ఏపీలో నడుస్తుంది.

Tags:    

Similar News