మరీ అతికిపోతే జగన్ కి డేంజరేనా…!!

వ్యవస్థను మొత్తం కడిగేయాలని వై.ఎస్.జగన్ కలెక్టర్లతో తాజాగా చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అవినీతిని కట్టడి చేయడం మంచిదే కానీ అది ఓ రకంగా దేశంలోనే దశాబ్దాలుగా పాతుకుపోయిన [more]

Update: 2019-07-13 02:00 GMT

వ్యవస్థను మొత్తం కడిగేయాలని వై.ఎస్.జగన్ కలెక్టర్లతో తాజాగా చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అవినీతిని కట్టడి చేయడం మంచిదే కానీ అది ఓ రకంగా దేశంలోనే దశాబ్దాలుగా పాతుకుపోయిన భయంకరమైన జబ్బుగా ఉంది. వై.ఎస్.జగన్ లాంటి వారు వచ్చి రాత్రికి రాత్రే దాన్ని మార్చేయలేరు. బల్ల కింద చేతులు, ఆమ్యామ్యాలు అన్నది పై నుంచి దిగువ స్థాయి వరకూ ఉన్నాయి. వై.ఎస్.జగన్ ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దు అంటున్నారు. తన పార్టీ వారైనా కూడా చర్యలు తీసుకోండని చెబుతున్నారు. అయితే ఆచరణలో ఇది అంత సులువుగా జరిగే పని కానేకాదని అంటున్నారు. వై.ఎస్.జగన్ ఎంత ఆవేశపడినా మొత్తం వ్యవస్థలోనే ఆ పెద్ద రోగం ఉంది. ఇక మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలోనూ వై.ఎస్.జగన్ కఠినంగా ఉంటున్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడినా పైరవీలు చేసినా ఊరుకోనని గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఇది శ్రుతి మించి రాగాన పడితే అసలుకే ఎసరు వస్తుందేమోనన్న కంగారు ఇపుడు వైసీపీ నేతల్లో పట్టుకుంది.

మంత్రుల మీద గుస్సా….

వై.ఎస్.జగన్ అవినీతికి దూరంగా మంత్రులు ఉండాలని చెప్పిన మాట వాస్తవం. రెండున్నరేళ్ళ పాటు మంత్రులుగా తీసుకున్నా అవినీతి విషయంలో రాజీపడనని, తన దగ్గరకు ఆ రకమైన సమాచారం వస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని కూడా వై.ఎస్.జగన్ తొలి క్యాబినెట్ మీటింగులోనే కుండ బద్దలుకొట్టారు. ఇపుడు బదిలీలు, ఇతర వ్యవహారల్లో మంత్రులు కొందరు చేతి వాటం చూపించారన్నది వై.ఎస్.జగన్ ద్రుష్టికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆ మంత్రులకు ఇప్పటికే ఒకటికి రెండు మార్లు వార్నింగులు ఇచ్చిన వై.ఎస్.జగన్ ఇక వారిని తొలగించాల్సిందేనని డిసైడ్ అయినట్లుగా కూడా ప్రచారంలో ఉంది. ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటే వై.ఎస్.జగన్ సర్కార్ జనాలకు ఏ రకమైన సంకేతాలు ఇస్తుందో తెలియదు కానీ పార్టీ, ప్రభుత్వం మాత్రం ఇబ్బందుల్లో పడడం ఖాయమని అంటున్నారు.

అప్పట్లో అన్న గారు అలా….

ఇక ప్రజానాయకులకు ప్రభుత్వ పగ్గాలు అప్పచెప్పినపుడు వారిలో ఆవేశం ఇలాగే ఉంటుందనడానికి గతంలో అన్న నందమూరి తారక రామారావు ఓ ఉదాహరణ. ఆయన సైతం అవినీతిని సహించను అంటూ తన మంత్రి మీద నిఘా పెట్టి మరీ తొలగించారు. అదే ఎన్టీయార్ మీద తరువాత రోజుల్లో వంద అవినీతి ఆరోపణలతో విశాఖకు చెందిన ద్రోణం రాజు సత్యనారాయణ కేసు వేసి ఏడింటికి ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని నిరూపించగలిగారు. అంటే ఆవేశం వల్ల అన్న గారికి మిగిలింది ఏంటి అంటే వేదన మాత్రమేనని జవాబు వస్తుంది. నాటి టీడీపీ. ప్రభుత్వంలో ఎన్టీయార్ ఏ తప్పు చేయకపోవచ్చు. కానీ ఆ అవినీతి వ్యవస్థ మాత్రం పక్కనే ఉంటుంది. వై.ఎస్.జగన్ విషయంలోనూ ఆవేశంతో దూకుడుగా వెళ్తున్నారు. అయితే ఆయన మీద ఉన్న మోజు వల్ల ఇప్పట్లో పార్టీలో ఎవరూ మాట్లాడకపోయినా రానున్న రోజుల్లో ఇదే దూకుడు కొనసాగిస్తే చిక్కులు తప్పవన్నా వారూ ఉన్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News