ఆది జంకుతున్నారెందుకు?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించాలని స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. వైఎస్ వివేకా హత్య జరిగి దాదాపు ఎనిమిది నెలలు కావస్తున్నా [more]

Update: 2019-12-11 03:30 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించాలని స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. వైఎస్ వివేకా హత్య జరిగి దాదాపు ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ హత్యకు గల కారణాలు, హంతకులు ఎవరో పసిగట్టలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జరిగిన ఈ హత్యకేసు జగన్ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకు కూడా ఒక కొలిక్కి రాకపోవడం వైసీపీ సర్కార్ కు తలనొప్పిగా మారింది. విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తోంది.

కొత్త సిట్ ఏర్పాటుతో…..

వైఎస్ వివేకా హత్య జరిగి నెలలు గడుస్తున్నా ఆయన హత్య కేసును పోలీసులు ఛేదించలేక పోయారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ స్థానంలో కొత్త సిట్ ను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు హత్య కేసును ఛేదించాలని న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వమే ఏపీలో ఉండటంతో వివేకా కుటుంబ సభ్యులు సయితం బయటకు రావడం లేదు. జగన్ ను కలసి హత్య కేసును ఛేదించాలని మాత్రమే కోరుతున్నారు.

ఎంపీ తండ్రిని కూడా…..

ఈ నేపథ్యంలో ఇటీవల వైఎస్ వివేకాహత్య కేసును సిట్ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. గతంలో సేకరించిన వివిధ రకాల ఆధారాలను అనుసరించి విచారణ జరుపుతున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సయితం అధికారులు రహస్యంగా విచారించారు. అలాగే వైఎస్ మనోహర్ రెడ్డి కూడా విచారణను ఎదుర్కొన్నారు. వీరితో పాటు టీడీపీ నేతలను సయితం విచారించారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా విచారణకు హాజరయ్యరు.

ఆది మాత్రం అందుబాటులో…..

కానీ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మాత్రం సిట్ నోటీసులు పంపినా హాజరుకాలేదు. ఆయన అందుబాటులో లేరని అధికారులు చెబుతున్నారు. ఆదినారాయణరెడ్డి కారు డ్రైవర్ ను మాత్రం ఇప్పటికే పోలీసులు విచారించినా ఆదినారాయణరెడ్డి మాత్రం విచారణకు సహకరించడం లేదని చెబుతున్నారు. ఆయన కడప జిల్లాలోనే లేకపోవడంతో ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకుని నోటీసు మరోసారి పంపాలని నిర్ణయించుకున్నారు. ఆదినారాయణరెడ్డి విచారణకు ఎందుకు జంకుతున్నారన్నది అర్థంకాని ప్రశ్నగా ఉంది. మొత్తం మీద ఈ కేసులో కీలక ఆధారాలను ఇప్పటికే సేకరించిన సిట్ అధికారులు త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది.

Tags:    

Similar News