Ys viveka : హత్య చేశారు సరే… కారణాలేంటి?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడలేదు. హత్య జరిగి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆయన హత్యకు గల కారణాలు తెలియ రాలేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య [more]

Update: 2021-10-28 05:00 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడలేదు. హత్య జరిగి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆయన హత్యకు గల కారణాలు తెలియ రాలేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనేక అనుమానాలున్నాయి. వాటన్నింటికి సిబీఐ ఎలాంటి సమాధానాలు ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. సీబీఐ అధికారులు తూతూ మంత్రంగా విచారణ చేపట్టి నిందితులపై ఛార్జి షీటును దాఖలు చేశారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

రెండేళ్లు గడుస్తున్నా….

2019 మార్చి 15వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. అతి దారుణంగా కిరాతకులు ఆయనను హత్య చేశారు. ఒక మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి సోదరుడు హత్య నాడు కలకలం రేపింది. హత్యకు రాజకీయ కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్న రీతిలో దర్యాప్తు సాగింది. చివరకు చిన్న స్థాయి వ్యక్తులు గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి ఛార్జిషీటు దాఖలు చేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలున్నాయి.

చిన్న స్థాయి నేతలే…

ఈ నలుగురు పెద్దగా ఎలాంటి ప్రభావం చూపే వ్యక్తులు కాదు. వైఎస్ వివేకానందరెడ్డి వారిని హత్య చేసే ధైర్యం వీరికి ఉండదనే అనుకోవాలి. గజ్జల ఉమాశంకర్ రెడ్డి వివేకా వద్ద పీఏగా పనిచేసే జగదీశ్వర్ రెడ్డి సోదరుడు. పాలడెయిరీని నిర్వహిస్తుంటాడు. సునీల్ కుమార్ యాదవ్ కూడా సాధారణ వ్యక్తి. ఈయన ఉమాశంకర్ రెడ్డితో కలిసి హత్యకు ప్రణాళిక రచించారని సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఒక్క గంగిరెడ్డి మాత్రమే వైఎస్ వివేకానందెరడ్డికి అత్యంత సన్నిహితుడు. నలభై ఏళ్ల అనుబంధం. ఈయన హత్య జరిగిన రోజు ఆధారాలన్నీ తుడిచివేశారు. డ్రైవర్ దస్తగిరి కూడా హత్యకు రెండేళ్లు ముందు వివేకా వద్ద పని చేసి మానేశారు.

కారణాలేంటి?

ఈ నలుగురిలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేసేంత కసి ఎందుకుంటుంది? అందుకు గల బలమైన కారణాలేంటి? అన్న సందేహాలు సహజంగానే వస్తాయి. ఈ కేసులో మొత్తం 60 మంది వరకూ విచారించిన సీబీఐ అధికారులు నిందితులు ఎవరో గుర్తించారు తప్పించి హత్యకు గల కారణాలను మాత్రం చెప్పలేకపోయారు. ఆస్తి వివాదాలు వీరిమధ్య ఉండే అవకాశాలు లేవు. ఆర్థిక లావాదేవీలేమైనా కారణమని అంటున్నా దానికి తగ్గ ఆధారాలు లేవు. దీంతో వైఎస్ వివేకా హత్య ఎందుకు జరిగిందన్న మిస్టరీ మాత్రం ఇంకా వీడకపోవడం విశేషం. దీనిపై వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం తెలుపుతున్నారు.

Tags:    

Similar News