ఒంటరినైపోయానూ…?

నాయకుడు ఎపుడూ ఒంటరే. ఒకరు ఉంటేనే నాయకత్వం వికసిస్తుంది. మరి అలాంటిది ఒంటరిని అయ్యాను అని ఎవరూ బేలగా దీనాలాపనలు చేయరు. అది కూడా వైఎస్సార్ లాంటి [more]

Update: 2021-09-03 08:00 GMT

నాయకుడు ఎపుడూ ఒంటరే. ఒకరు ఉంటేనే నాయకత్వం వికసిస్తుంది. మరి అలాంటిది ఒంటరిని అయ్యాను అని ఎవరూ బేలగా దీనాలాపనలు చేయరు. అది కూడా వైఎస్సార్ లాంటి పులి కడుపున పుట్టిన బిడ్డలు ఎపుడూ అలాంటి మాటలు కలలో అయినా మాట్లాడరు. కానీ వైఎస్సార్ ముద్దుల తనయ షర్మిల మాత్రం తాను ఒంటరిని అయ్యాను అంటున్నారు. తన కంట నీరు ఒలిగితే తుడిచే వారే లేరు అన్నట్లుగా ఆమె భావోద్వేగమవుతోంది. వైఎస్సార్ పోయిన పన్నెండేళ్ళ తరువాత ఆమె బాగా ఒంటరిని అన్న ఫీలింగ్ తో తొలిసారి ఇలా ఉద్వేగపడుతున్నారు. దాని వెనక కారణాలు ఏంటి అన్నది కనుక ఆలోచిస్తే రాజకీయాలే అనిపిస్తాయి.

అన్న మద్దతు లేక…

జగన్ రాజకీయం అంతా ఏపీకే పరిమితం అయింది. షర్మిలకు ఏపీలోనూ వైసీపీ రాజకీయాల్లోనూ చోటు లేదు అన్న తరువాతనే తెలంగాణాలో తేల్చుకుందామనుకున్నారు. ఇది అందరికీ తెలిసిందే. అక్కడ ఆమె పార్టీ పెట్టినా కూడా అనుకున్న స్పందన ఏదీ రాలేదు. పైగా అక్కడ ఆమె పార్టీకి సరైన నాయకులు కూడా లేకుండా పోయారు. ఈ నేపధ్యంలో షర్మిల ఏటికి ఎదురీదుతున్నారు. ఈ రోజుకు ఆశావహంగా రాజకీయం లేకపోయినా ఫరవాలేదు, రేపటికో మరో రోజుకో సర్దుకోవచ్చు. కానీ తెలంగాణాలో చూస్తే షర్మిల పార్టీ ఎప్పటికీ ఎదిగే సీన్ లేదని తొలి అడుగే చెబుతున్న వేళ ఆమె నిజంగా ఒంటరి అయ్యారనే అనుకోవాలి.

అంత పెద్ద కుటుంబంతో ….

వైఎస్సార్ ఉమ్మడి ఏపీని పాలించిన నేత. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న నాయకుడు. అలాంటి వైఎస్సార్ మరణించి దేవుడు అయ్యారు. ఆయనది పెద్ద కుటుంబం. తెలంగాణాలోనూ ఆ కుటుంబం ఉంది. మరి అంతటి కుటుంబాన్ని ఇచ్చినా కూడా ఒంటరిని అని షర్మిలమ్మ బాధ పడుతున్నారు అంటే ఆ ఫ్యామిలీ ఇపుడు దూరం పెట్టింది అనుకోవాలి. లేకపోతే వారిని కలుపుకుని రాజకీయం పండించుకునే చాకచక్యం షర్మిలకు లేదు అని కూడా భావించాలి. మరో వైపు కుటుంబంలో తండ్రి తరువాత తండ్రి లాంటి అన్న అండ లేదని కూడా బాధ అయి ఉండాలి. ఏది ఏమైనా షర్మిల ఒంటరి పోరు మాత్రం వైఎస్సార్ అభిమానులకు కలత తెప్పించేదే.

ఈయన కూడా…

సరే షర్మిల మాత్రమే ఒంటరి అనుకోవడానికి వీలు లేదు. ఏపీ సీఎం జగన్ కూడా అలాగే ఉన్నారు కదా. ఆయన చుట్టూ అధికారం ఉంది కాబట్టే అంతా చేరుతున్నారు. ఒకవేళ అది దూరమైతే ఆయన బాధ కూడా చెల్లెమ్మలాగానే ఉంటుంది కదా. ఇక 2014లో ఓడిన తరువాత వైఎస్ జగన్ చుట్టూ ఉన్న వారు ఎంతో మంది వీడిపోయారు కదా. ఈ రోజుకీ వైఎస్సార్ సన్నిహితులు అనుకున్న వారు జగన్ చెంత లేరు కదా. మరి జగన్ ఎలా నెట్టుకువచ్చారు అంటే తన నాయకత్వ నైపుణ్యంతోనే. సమస్యలు ఎదురైనపుడు ఎదురీది ముందుకు సాగడం ద్వారానే జగన్ విజేత అయ్యారు. షర్మిల కూడా అదే నిబ్బరంతో అడుగులు వేయాలి. ఒంటరిని అనుకుంటే ఎప్పటికీ అలాగే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News