టీడీపీ కాంగ్రెస్ లను కలిపేస్తే ?

రాజకీయాలు అంటే పక్కా లెక్కలే. అక్కడ ప్లసులను, మైనస్సులను జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగడమే. అలాగే గుణింతాలు, భాగించడాలూ కూడా రావాలి. అన్న చాటు చెల్లెలిగా ఉంటూ [more]

Update: 2021-05-10 12:30 GMT

రాజకీయాలు అంటే పక్కా లెక్కలే. అక్కడ ప్లసులను, మైనస్సులను జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగడమే. అలాగే గుణింతాలు, భాగించడాలూ కూడా రావాలి. అన్న చాటు చెల్లెలిగా ఉంటూ రాజన్న తన‌యగా తెలంగాణా గడ్డ మీద సొంత పార్టీ ప్రారంభిస్తున్న వైఎస్ షర్మిల ఇపుడు ఈ రాజకీయ గణితాన్ని బాగా బట్టీ పడుతున్నారుట. రాజకీయాల్లో ఎపుడూ వన్ ప్లస్ వన్ రెండు కావచ్చు, కాకనూ పోవచ్చు, అలాగే 22 కూడా కావచ్చు ఇక జీరో కూడా అయినా ఆశ్చర్యం లేదు. అందువల్ల వైఎస్ షర్మిల తెలివిగానే మేధమెటిక్స్ లో పాలిట్రిక్స్ ని కలిపి చదువుతున్నారుట.

ఒక అంతర్ధానంతో …?

వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన సమయం సందర్భం చూస్తే యాధృచ్చికంగా జరిగిందా అనిపించకమానదు. తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే వెళ్ళి టీయారెస్ లో కలసిపోవడం ఆ పార్టీ శాసనసభా పక్షం విలీనం కావడంతో తెలంగాణాలో ఒక అంకం ముగిసింది. సరిగ్గా ఆ ప్రకటన వచ్చిన సమయంలోనే వైఎస్ షర్మిల ఖమ్మం గుమ్మంలో కొత్త పార్టీని ప్రకటించారు. దీంతో ఒక చరత్ర సృష్టించిన పార్టీగా టీడీపీ తెలంగాణా రాజకీయ తెర మీద నుంచి అంతర్ధానం అయింది. అదే టైమ్ కి మరో కొత్త పార్టీ పుట్టింది అన్న చర్చ అయితే వచ్చింది.

క్యాడర్ ఎటు…?

సాధారణంగా పార్టీలు పుడతాయి, గిడతాయి కానీ వాటిని నమ్ముకుని అభిమానం పెంచుకుని ఏళ్లకు ఏళ్ళుగా పనిచేసిన క్యాడర్ సంగతి ఏంటి అని ఎవరూ భూతద్ధంతో వెతకరు. పార్టీకి జీవగర్ర లాంటి కార్యకర్త గురించి ఎవరూ కనీసంగా ఆలోచన చేయరు. ఇపుడు తెలుగుదేశం పరిస్థితి అలాగే ఉంది. ఆ పార్టీకి తెలంగాణాలో అద్భుతమైన క్యాడర్ ఉంది. వారిలో చాలా మంది టీయారెస్ వైపు వెళ్లవచ్చు, కొందరు ఇతర పార్టీల వైపు చూడవచ్చు, కానీ కాంగ్రెస్ కి బద్ధ వ్యతిరేకంగా పుట్టిన టీడీపీలో మిగిలి ఉన్న వారు ఉంటారు. ఏ పార్టీలో చేరకుండా పార్టీయే ప్రాణం అని విశ్వసించేవారు కూడా ఉంటారు ఇపుడు వారంతా ప్రస్తుతం ఉన్న పార్టీలకు ఆల్టర్నేషన్ గా కొత్త పార్టీ వస్తే చేరేందుకు సిద్ధపడతారు అన్న చర్చ కూడా ఉంది. వైఎస్ షర్మిల కనుక ఆ దిశగా ఆలోచన చేస్తే కచ్చితంగా తెలుగుదేశానికి మిగిలిపోయి ఎటూ కాకుండా ఉన్న పసుపు తమ్ముళ్ళు ఆమె పార్టీకి పెట్టని కోటలే అవుతారు అంటున్నారు.

పటిష్టమైన శక్తిగా….

ఇక తెలుగుదేశం పార్టీలో మిగిలిన వారు ఈ వైపుగా వస్తే కాంగ్రెస్ నానాటికీ దిగనారుతుంది అని భావించే వారు, ఆ పార్టీకి చరిష్మాటిక్ లీడర్ లేక అల్లాడుతున్న వారు కనుక వైఎస్ షర్మిల వైపు వస్తే తెలంగాణాలో టీయారెస్ కి ధీటుగా కొత్త పార్టీకి స్ట్రాంగ్ బేస్ ఏర్పడుతుంది అంటున్నారు. ముఖ్యంగా జంట నగరాల్లో ఈ రకమైన మిశ్రమ క్యాడర్ ఎక్కువగా ఉంది. పైగా వీరిలో సీమాంధ్రులే ఎక్కువ. అలాగే కొన్ని తెలంగాణా జిల్లాల్లో ఇదే రకమైన రాజకీయ సమీకరణలు ఉన్నాయి. వైఎస్ షర్మిల కనుక ఒడుపుగా వేటిని ఆకర్షిస్తే మాత్రం తెలంగాణాలో ఆమె రాజకీయ పయనం సజావుగా సాగేందుకు ఆస్కారం ఉంటుంది అన్నది ఒక విశ్లేషణ. మరి ఇదంతా జరగాలంటే వైఎస్ షర్మిల తన లీడర్ షిప్ క్వాలిటీస్ ని ముందు నిరూపించుకోవాలి.

Tags:    

Similar News