బాణం వేగం మామూలుగా ఉండదట…?

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏ మేరకు విజయం సాధిస్తుందో ఇప్పుడు తెలియదు కాని రాజకీయ పార్టీల్లో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పాలి. వైఎస్ షర్మిల ఇంతవరకూ [more]

Update: 2021-02-28 06:30 GMT

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏ మేరకు విజయం సాధిస్తుందో ఇప్పుడు తెలియదు కాని రాజకీయ పార్టీల్లో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పాలి. వైఎస్ షర్మిల ఇంతవరకూ పార్టీని ప్రకటించలేదు. పార్టీ పెట్టడం కోసం షర్మిల క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుంటున్నారు. ఏప్రిల్ నెలలో పార్టీని ప్రకటించే అవకాశముంది. తనకు నమ్మకమైన వారిని సలహాదారులుగా కూడా వైఎస్ షర్మిల నియమించుకున్నారు.

ఏ ముద్ర లేకుండా….?

తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి ఉదయసింహలను సలహాదారులుగా నియమించుకున్నారు. పార్టీ పెట్టి ఆషామాషీగా పోటీ చేసి వెళ్లిపావాలన్నది వైఎస్ షర్మిల ఉద్దేశ్యం కాదన్నది స్పష్టమవుతుంది. తనపై ఆంధ్ర ముద్ర పడకుండా తాను తెలంగాణ కోడలినంటూ వైఎస్ షర్మిల ఇప్పటి నుంచే ఇక్కడి ప్రజలను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రాజకీయ పార్టీల్లో కలవరం….

అయితే వైఎస్ షర్మిల పార్టీపై అన్ని రాజకీయ పార్టీల్లో కంగారు మొదలయింది. కేసీఆర్ షర్మిల చేత పార్టీ పెట్టిస్తున్నారని బీజేపీ ప్రచారం చేస్తుంది. బీజేపీయే వదిలిన బాణం షర్మిల అంటూ కాంగ్రెస్ కయ్యిమంటుంది. ఇక టీఆర్ఎస్ మాత్రం బీసీ వర్గానికి చెందిన నేతలే వైఎస్ షర్మిలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. గంగుల కమలాకర్, ఈటల రాజేందర్ లు తప్పించి వైఎస్ షర్మిల పార్టీపై ఎవరూ పెద్దగా స్పందించలేదు.

వారికే పార్టీలో పెద్దపీట….

రెడ్డి సామాజికవర్గం ఓట్లను చీల్చడానికే వైఎస్ షర్మిల పార్టీ పెట్టారని బలంగా విమర్శలు విన్పిస్తున్న నేపథ్యంలో ఆమె ఎక్కువగా బీసీ నేతలను చేర్చుకునేందుకే సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. పార్టీ పై రెడ్డి సామాజికవర్గం ముద్రపడకుండా పార్టీ పదవులు ఎక్కువగా బీసీ, ఎస్సీలకు ఇవ్వాలన్నది వైఎస్ షర్మిల వ్యూహంగా ఉందంటున్నారు. బీసీ, ఎస్సీ ఓట్లపైనే ఎక్కువగా దృష్టి పెడితే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం పెద్ద కష్టమేదీ కాదని వైఎస్ షర్మిల భావిస్తున్నారు. మొత్తం మీద వైఎస్ షర్మిల అందరూ అనుకున్నట్లు లేరు. అత్యంత వేగంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

Tags:    

Similar News