వైఎస్సార్… పులిలా బతికి… ఈరోజు బతికుంటే?

వైఎస్సార్..ఈ మూడు అక్షరాలు కొన్నాళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలను అపరిమితంగా ప్రభావితం చేశాయి. ఇపుడు కూడా పరోక్షంగా ఏపీ సర్కార్ ని నడిపిస్తూ రాజకీయాల్లో వైఎస్ జీవించే [more]

Update: 2020-07-08 06:30 GMT

వైఎస్సార్..ఈ మూడు అక్షరాలు కొన్నాళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలను అపరిమితంగా ప్రభావితం చేశాయి. ఇపుడు కూడా పరోక్షంగా ఏపీ సర్కార్ ని నడిపిస్తూ రాజకీయాల్లో వైఎస్ జీవించే ఉన్నారు. ఇక వైఎస్సార్ అరవయ్యేళ్ళు మాత్రమే బతికారు. అందులో రెండు మూడేళ్ళు మంత్రిగా, అయిదుంపావు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్సార్ తన జీవిత పర్యంతం అధికారంలో లేకుండానే రాజకీయం చేశారు. చేతికి చమురు వదిలించుకుంటూ రాజకీయాల్లో ప్రతీ రోజూ పోరాటమే చేశారు. తన పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆయనకు సుఖం లేకుండా పోయేది. ఆయనదంతా ఎపుడూ విపక్ష పాత్రే. మొత్తం మీద ఆయన ఎన్నో ఆటు పోట్లు తిని కూడా తన బలాన్ని, బలగాన్ని నిలబెట్టుకోవడం అంటే మాటలు కాదు,

అరుదైన రికార్డు….

నిజానికి వర్తమాన రాజకీయాలు చూస్తే ఎవరైనా అధికారం ఉన్న చోటనే ఉంటారు. పదవి పోగానే ఇంటి గుమ్మం కూడా చూడరు. అటువంటిది మూడు దశాబ్దాల పాటు చేతిలో ఏ అధికారం లేకున్నా కూడా వైఎస్సార్ పులిలా బతికారు. ఆయనకు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 23 జిల్లాల్లోనూ అనుచరులు, అభిమానులు దండీగా ఉండేవారు. ఆయన మాస్ ఫాలోయింగ్ చాలా గ్రేట్ అని చెప్పాలి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సైతం ఆయన జనాదరణ ముందు వెలవెలబోయేవారు. నిజానికి భారత రాజకీయాల్లో చూసుకుంటే అన్నేళ్ల పాటు తన మనుషులను కాపాడుకుని, ఏ పదవీ లేకుండా ప్రజాదరణను అంతకంతకు పెంచుకోవడం అంటే అది గొప్ప రికార్డ్. అది ఒక్క వైఎస్సార్ కే సొంతం.

వాడుకున్నారు…

ఇక వైఎస్సార్ పొలిటికల్ గ్లామర్, చరిష్మా ఆయన కంటే కూడా ఆయన అనుచరులే ఎక్కువగా వాడుకున్నారని చెప్పాలి. మాట ఇస్తే తప్పని గుణం వైఎస్సార్ కు ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని పంచాయతీ వార్డ్ మెంబర్ కి కూడా నెగ్గలేని వారు పార్లమెంట్ సభ్యులైపోయారు. ఆయన చేతి చలువతో ఎంతో మంత్రులుగానూ, మహా మహా పదవుల్లోనూ కుదురుకున్నారు. ఇక వైఎస్సార్ ని నాటి కాంగ్రెస్ హై కమాండ్ కూడా బాగానే ఉపయోగించుకుంది. 2004, 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ నుంచి వచ్చిన భారీ ఎంపీల మద్దతే కేంద్రంలోని యూపీయేకు ఊపిరి. ఇక 2008 లో వామపక్షాలు యూపీయేకు మద్దతు ఉపసంహరించుకున్న వేళ వైఎస్సార్ తన రాజకీయ చాణక్యంతో ఏపీ నుంచి కొత్త మద్దతు కూడగట్టడమూ అందరికీ తెలిసిందే.

వెలగాల్సిన వేళ …..

కాంగ్రెస్ లో ప్రజాదరణ కలిగిన నేతల కంటే భజన నేతలే ఎక్కువ. అలాంటి చోట స్వయంప్రకాశం కలిగిన వైఎస్సార్ లాంటి వారికి అవకాశాలు రాజకీయంగా అనుకున్నంతగా దక్కలేదనే చెప్పాలి. నిజానికి వైఎస్సార్ కి ఉన్న పొలిటికల్ గ్లామర్ కి ఆయన ఎన్నో సార్లు ముఖ్యమంత్రి కావాలి. అలాగే కేంద్రంలోనూ కీలక పదవులు దక్కించుకోవాలి. కానీ ఆయన అధికారంలో ఇలా కుదురుకున్నారో లేదో అలా ఆయువు తీరిపోయింది. మరో వైపు ఆయన ప్రజాదరణ కూడా శత్రువు అయింది. అందుకే ఆయన దాదాపుగా అరవయ్యేళ్ళు వచ్చేంత వరకూ అధికారాన్ని అందుకోలేకపోయారు. ఇక మాట ఇస్తే తప్పని వైఎస్ మంచితనం, బోళాతనం కూడా చాలా మందికి వరమైంది. వైఎస్సార్ ఈ రోజు కనుక బతికి ఉంటే తాను ఎంత మందికి అపాత్రాదానం చేశానో తెలుసుకుని కుమిలిపోయేవారేమో. ఆయన మరణించాక వైఎస్ కుటుంబం ఒంటరి పోరాటం చేస్తున్న వేళ ఆయన ఆత్మలూ, పరమాత్మలూ, తోడూ నీడలూ అన్నీ కూడా వైఎస్ కుటుంబాన్ని వదిలివేసిన తీరుని చూసిన వారికి వైఎస్ భోళాతనంతో ఎంత నష్టపోయారో అర్ధమవుతుంది.

Tags:    

Similar News