సొంత వారినే మరిచిపోయి?

మార్పు కాలం ఇచ్చే తీర్పు. గతంలో శాసనమండలి ఉత్తి దండగ అంటూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా దాన్ని రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత చెన్నారెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా [more]

Update: 2020-01-28 11:00 GMT

మార్పు కాలం ఇచ్చే తీర్పు. గతంలో శాసనమండలి ఉత్తి దండగ అంటూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా దాన్ని రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత చెన్నారెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మండలి పునరుద్ధరణకు ప్రయత్నం చేసినా పని కాలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2004 లో శాసనమండలి తిరిగి పురుడుపోసుకుంది. అయితే మండలి పునరుద్ధరణపై వైఎస్ తెచ్చిన తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. అదే తీరులో టిడిపి ఎమ్యెల్సీ లు వైఎస్ జపం మొదలు పెట్టారు.

ఎన్టీఆర్, బాబు మాటలే …

మండలి రద్దుకు గతంలో నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ కు జై కొట్టేస్తుంది వైసిపి. అలాగే 2004 లో మండలి వద్దే వద్దంటూ చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా నాడు విపక్ష నేత హోదాలో చేసిన ప్రసంగాలు అధికారపార్టీ అస్త్రంగా మార్చుకుంది. అసెంబ్లీలో బాబు గత ప్రసంగం తెరపై వేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికలపై పెట్టి రచ్చ రచ్చ చేస్తుంది వైసిపి. ఇప్పుడు అధికారపార్టీ నేతలు ఎవరు మాట్లాడినా ఎన్టీఆర్ మండలి రద్దుపై చెప్పిన అంశాలను పదేపదే ముందు చెబుతూ ఉండటం విశేషం.

నాడు-నేడు….

అయితే నాడు ఏ పరిస్థితుల్లో వారు నిర్ణయం తీసుకున్నారనేది పక్కన పెట్టాయి రెండు పార్టీలు. వైఎస్ ను టీడీపీ పొగుడుతుంటే, వైసీపీ ఎన్టీఆర్ నామస్మరణం చేస్తుంది. కొత్త తరానికి ఇది తెలియకపోయినా తెలిసిన వారు బుగ్గలు నొక్కుుంటున్నారు. నాడు నేడు టిడిపి, నాటి వైఎస్ నేటి జగన్ అంటూ తాజాగా సోషల్ మీడియా లో ఆయా పార్టీలు వీడియో లు పేపర్ క్లిప్ లు పోస్ట్ చేస్తూ పెద్ద చర్చకే తెరతీయడం గమనార్హం.

Tags:    

Similar News