జగన్ చెబుతున్నట్లే జరుగుతుందిగా

తెలుగుదేశం పార్టీ ఇంకా కుట్ర రాజకీయాలు అంటూ ఆరోపణలనుంచి బయటకు రావడం లేదు. కృష్ణా వరదలు అమరావతిలో పోటెత్తడం వెనుక జగన్ సర్కార్ కుట్ర చేస్తుందని తాజాగా [more]

Update: 2019-08-16 12:30 GMT

తెలుగుదేశం పార్టీ ఇంకా కుట్ర రాజకీయాలు అంటూ ఆరోపణలనుంచి బయటకు రావడం లేదు. కృష్ణా వరదలు అమరావతిలో పోటెత్తడం వెనుక జగన్ సర్కార్ కుట్ర చేస్తుందని తాజాగా చేస్తున్న రాజకీయ యుద్ధం బురదగా మారింది. హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న చంద్రబాబు గృహాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారన్న అంశాన్ని తెరపైకి తెచ్చి విపక్ష అనుకూల మీడియా లో హడావిడి మొదలు పెట్టింది టిడిపి. దానికోసమే కాచుకుని కూర్చున్న వైసిపి మీడియా బాబు అక్రమ కట్టడంలో వున్నారు చూడండి అంటూ హల్చల్ మళ్ళీ మొదలు పెట్టింది. ఇక ఖాళీగా వున్న టిడిపి నేతలు, కౌంటర్ కోసం వేచిచూస్తున్న వైసిపి నాయకుల చేతికి ఇప్పుడు చేతినిండా పని దొరికింది.

మ్యాన్ మేడ్ ఫ్లడ్ ట …

ఆయన ఇరిగేషన్ మంత్రిగా గతంలో పనిచేశారు. జలవనరులపై పూర్తి అవగాహన ఉంటుంది. కానీ తమ అధినేత చంద్రబాబును కాపాడేందుకు రంగంలోకి దిగారు. కృష్ణా వరద అంతా ప్రభుత్వం సృష్టే అని ఆరోపించి వివాదానికి తెరతీశారు. చంద్రబాబు ఇల్లు మునగడం కోసమే శ్రీశైలం వరదను నిల్వ ఉంచి ఆలస్యంగా వదిలారని హాట్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల పూర్తి స్థాయి నీటిమట్టానికి దగ్గరగా వచ్చాక కిందకి వదులుతారు. అలా చేయకపోతే వచ్చిన నీరంతా వృధాగా పోతే డ్యామ్ లు నిర్మాణానికి అర్ధం ఉండదు. కానీ చంద్రబాబు కోసమే వరదను పులిచింతలలో ఎక్కువ నిల్వ చేశారనడాన్ని అంతా తప్పు పడుతున్నారు.

అల్మట్టి, నారాయణపూర్, జూరాలలో …

కర్ణాటక లో నిర్మించిన ప్రాజెక్ట్ ల అంశాన్నే పరిశీలిద్దాం. అక్కడ అల్మెట్టి జలాశయం పూర్తిగా నిండితే కానీ నారాయణపూర్ కి నీరు వదలలేదు. అలాగే నారాయణపూర్ కూడా. అదీ పూర్తి అయ్యాకా జూరాలకు అది కూడా తన పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాకా శ్రీశైలానికి వరదను వదులుతారు. ముందే భారీ వర్షాలు కురిశాయని కర్ణాటక నీరు కిందకు విడుదల చేయలేదు. వారి జలాశయాలు పూర్తిగా కళకళ లాడిన తరువాతే కిందకు నీటి చుక్క వదులుతున్నారు. అందుకే పదేళ్ళ తరువాత మాత్రమే తెలుగు రాష్ట్రాల ప్రాజెక్ట్ లకు జలసిరి వచ్చింది.

రచ్చను మరింత రచ్చ చేస్తున్న వైసిపి …

వైసిపి పన్నిన వ్యూహంలో చక్కగా చిక్కిపోయింది టిడిపి. కృష్ణా వరదలను ప్రభుత్వం ముందే అంచనా వేసింది. ఎప్పుడు అధిక వరద వచ్చినా చంద్రబాబు నివాసం ముంపు కి గురౌతుందన్న జగన్ లెక్క తప్పలేదు. అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ నేరుగా చంద్రబాబు అక్రమ కట్టడంలో నదికి అడ్డం గా నిర్మించిన చోట ఉన్నారని ప్రజల దృష్టికి తెచ్చే ప్రయత్నం అటు అసెంబ్లీలోనూ ఇటు మీడియా సమావేశాల్లో పదేపదే చెప్పుకుంటూ వచ్చారు. ముందుగా ప్రజావేదికను కూల్చి చంద్రబాబు తనఅంత తానుగా ఇల్లు ఖాళీచేసేలా కార్యాచరణ మొదలు పెట్టారు. అయితే విపక్ష నేత చంద్రబాబు దీన్ని లైట్ తీసుకున్నారు. అక్రమాన్ని లింగమనేని ద్వారా సక్రమం చేసుకునేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈలోగా కృష్ణాకు వచ్చిన వరద బాబు వాదన తప్పు జగన్ చెప్పిందే రైట్ అనేలా చేసింది. ఈ అంశాన్ని ఇప్పుడు టిడిపి ఎంత రాద్ధాంతం చేస్తే అంతా తమకే ప్రయోజనమని బాబు అక్రమ కట్టడంలో వున్న దానిపై చర్చ కొనసాగుతూనే ఉంటుందని వైసిపి భావిస్తుంది.

Tags:    

Similar News