కెమిస్ట్రీ కుదిరినట్లుందే?

అప్పుడు తెలుగుదేశం పార్టీ, భారతీయజనతా పార్టీ రెండు మిత్రపక్షాలే. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ రెండు పార్టీలూ మంత్రివర్గంలో చేరిపోయాయి. అప్పట్లో చంద్రబాబునాయుడికి ప్రధానిగా ఉన్న నరేంద్ర [more]

Update: 2019-10-05 12:30 GMT

అప్పుడు తెలుగుదేశం పార్టీ, భారతీయజనతా పార్టీ రెండు మిత్రపక్షాలే. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ రెండు పార్టీలూ మంత్రివర్గంలో చేరిపోయాయి. అప్పట్లో చంద్రబాబునాయుడికి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఏపీ విభజన సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయంపై చర్చించేందుకు చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజుల్లో అపాయింట్ మెంట్ ఇచ్చిన మోదీ ఆ తర్వాత మొహం చాటేశారు. ఏడాది కాలం ప్రధాని నరేంద్ర మోడీని కలవాలన్న చంద్రబాబు ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. అప్పట్లో అది చర్చనీయాంశమైంది.

వరసగా కలుస్తూ…..

ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలను స్వీకరించారు. బీజేపీ, వైసీపీలో మిత్రపక్షాలు కాదు. రెండు పార్టీలూ విడివిడిగానే ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ సులువుగా దొరుకుతుంది. ఇప్పటికి మూడుసార్లు జగన్ ఢిల్లీ వెళితే మూడు దఫాలూ ప్రధాని నరేంద్రమోడీని వైఎస్ జగన్ కలవడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ ఆ భేటీ తర్వాత రాష్ట్రానికి ఏంచేశారన్నది పక్కన పెడితే మోడీ అపాయింట్ మెంట్ జగన్ కు సులువుగా దొరుకుతుంది.

రాష్ట్రంలో శత్రువుగా ఉన్నా…..

గతంలో చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరితే పీఎంవో కూడా సరిగా స్పందించలేదని టీడీపీ నేతలు చెప్పేవారు. కానీ జగన్ అపాయింట్ మెంట్ కోరగానే పీఎంవో ఆఘమేఘాల మీద భేటీకి సన్నాహాలు చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ జగన్ కు అనుకూలంగా లేదనే చెప్పాలి. బీజేపీ వైసీపీని శత్రువుగానే చూస్తోంది. ముఖ్యంగా సుజనాచౌదరి బ్యాచ్ బీజేపీలో చేరిన తర్వాత ఏపీలో బీజేపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల జోరు మరింత పెంచింది. టీడీపీ కంటే ఎక్కువ విమర్శలు చేస్తోంది.

రాష్ట్రాభివృద్ధి కోసమేనంటూ….

అయితే ముఖ్యమంత్రి హోదాలో అపాయింట్ మెంట్ కోరితే ప్రధాని తప్పకుండా కలుస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. తమ పార్టీకి బద్ధ శత్రువుగా ఉన్న మమత బెనర్జీకి కూడా మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చిన విషయాన్ని కమలనాధులు గుర్తు చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రధాని కలుస్తున్నారని, ఇందులో రాజకీయపరమైన చర్చలేమీ ఉండవని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇటు మోడీతో సంబంధాలు మెరుగుపర్చుకుంటూనే, జగన్ తాను బీజేపీకి ఎలాంటి మిత్రుడిని కాదని చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద జగన్ కు మోడీ అపాయింట్ మెంట్ అతి సులువుగా దొరుకుతుండటం వైసీపీ నేతల్లో ఉత్సాహం నింపుతుంటే, టీడీపీకి మాత్రం ఆగ్రహం తెప్పిస్తుంది.

Tags:    

Similar News