డ్రీం క్యాబినెట్ ఇలానా…?

వైసీపీ అధికారంలోకి వస్తే ఫలనా వారు మంత్రులు అవుతారని సోషల్ మీడియాలో వైసీపీ ఫ్యాన్స్ పెద్ద లిస్ట్ తయారు చేశారు. అంతటితో ఆగకుండా వారికి శాఖలు కూడా [more]

Update: 2019-08-09 15:30 GMT

వైసీపీ అధికారంలోకి వస్తే ఫలనా వారు మంత్రులు అవుతారని సోషల్ మీడియాలో వైసీపీ ఫ్యాన్స్ పెద్ద లిస్ట్ తయారు చేశారు. అంతటితో ఆగకుండా వారికి శాఖలు కూడా కేటాయించేశారు. చాలామంది కూడా అలాగే జరుగుతుందనుకున్నారు. కానీ అన్నింటినీ తల్లకిందులు చేస్తూ వై.ఎస్.జగన్ తనదైన మంత్రివర్గం ఏర్పాటు చేసుకున్నారు. పాతిక మంది మంత్రులు ఉంటే అందులో జనం అనుకున్న వారు ముగ్గురు నలుగురు మించి లేరు. అంటే జగన్ డ్రీం క్యాబినెట్ అలా నిర్మించుకున్నారన్నమాట. మంత్రుల్లో చాలా మంది కొత్త వారు, పేరున్న, నోరున్న వారు ఎవరూ లేరు కూడా. నిజం చెప్పాలంటే సీఎం సీటుకు వై.ఎస్.జగన్ కొత్త, దాంతో వైసీపీ సర్కార్ రెండున్న నెలల పాలనలో అనేక తడబాట్లు పొరపాట్లు చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే తమకు అప్పగించిన శాఖ పట్ల ఎంత మంది మంత్రులకు అవగాహన ఉంది అన్న ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. మంత్రులు తమకు తాముగా నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతమందికి చొరవ, ధైర్యం ఉన్నాయన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది.

వారితోనే జగన్….

ఇక వై.ఎస్.జగన్ ఢిల్లీ టూర్లో కీలకమైన మంత్రులు ఎవరూ కనిపించలేదు. వై.ఎస్.జగన్ తనకు సన్నిహితంగా ఉండే ఎంపీలను వెంటబెట్టుకునే కేంద్ర మంత్రులను కలిశారు. వై.ఎస్.జగన్ ఢిల్లీ వెళ్ళినపుడు పోలవరం తో పాటు, విద్యుత్ కొనుగోళ్ల పై రివర్స్ టెండరింగ్ వంటివి కేంద్రానికి వివరించారు. అయితే ప్రధానంగా ఉన్న ఆర్ధిక, జలవనరుల శాఖలకు చెందిన మంత్రులు కనిపించలేదు. పోలవరం గురించి వై.ఎస్.జగన్ ప్రధానికి వివరించే సమయంలో అనిల్ కుమార్ పక్కన లేకపోవడాన్ని గమనించాలి. ముఖ్యమంత్రి అధికారుల సాయంతో తయారు చేయించిన నోట్ ని కేంద్ర మంత్రులకు ఇస్తున్నారు. అయితే పూర్తి వివరాలు మౌఖికంగా చెప్పేందుకైనా కీలక శాఖల మంత్రులు వెంట లేరన్న విమర్శలు అయితే వస్తున్నాయి. వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కానీ మంత్రులకు ఏ మాత్రం తెలుసు అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

బాబు వెంట మంత్రులు….

ఆనాడు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినా, ఇతర దేశాలకు వెళ్లినా కచ్చితంగా కొందరు మంత్రులు వెంట వుండేవారు. వారిని తీసుకుని నోట్ పుటప్ చేయించి మరీ బాబు కదిలేవారు. ముఖ్యంగా యనమల రామక్రిష్ణుడు, నారాయణ వంటి వారు బాబు వెన్నంటి ఉండేవారు. వారే కేంద్ర అధికారులకు, మీడియాకు కూడా బ్రీఫింగ్ ఇచ్చేవారు. మరి వై.ఎస్.జగన్ తో మంత్రులు లేకపోవడం అంటే వారికి విషయం తక్కువగా ఉందా లేక వై.ఎస్.జగన్ తీసుకువెళ్లలేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇక చాలా మంది మంత్రుల విషయంలో ఒక విమర్శ కూడా ప్రచారంలో ఉంది. వారంతా డమ్మీలు అని కూడా అంటున్నారు. అసలు విషయలు, కీలక నిర్ణయాలు అన్నీ కూడా నేరుగా సీఎం పేషీ నుంచే వెళ్ళిపోతున్నాయని కూడా చెబుతున్నారు. మరి వీటి కారణంగా చూస్తే నలుగురైదురుగు తప్ప మెజారిటీ మంత్రులకు నిజమైన పవర్ లేదని కూడా కామెంట్స్ వస్తున్నాయి. చూడాలి ఈ గ్యాప్ ను జగన్ ఎలా భర్తీ చేసుకుంటారో.

Tags:    

Similar News