ముట్టుకుంటే షాకేనా?

అమరావతి రాజధాని సమస్య ఇపుడు ఏపీని పూర్తిగా వ్యాపించి ఉంది. అమరావతి రాజధానిని తరలించవద్దు అని సహజంగానే అక్కడ ప్రాంతీయులు కోరుకుంటారు. అదే సమయంలో తమ ప్రాంతాలకు [more]

Update: 2019-09-02 06:30 GMT

అమరావతి రాజధాని సమస్య ఇపుడు ఏపీని పూర్తిగా వ్యాపించి ఉంది. అమరావతి రాజధానిని తరలించవద్దు అని సహజంగానే అక్కడ ప్రాంతీయులు కోరుకుంటారు. అదే సమయంలో తమ ప్రాంతాలకు న్యాయం చేయాలని అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర ప్రజానీకం అడగడంలోనూ అర్ధం ఉంది. అయితే ప్రాంతాల‌ మధ్య సమన్యాయం, పాలనాపరమైన వికేంద్రీకరణ వంటివి దృష్టిలో పెట్టుకున్నపుడు అమరావతి రాజధాని ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతుంది. ప్రస్తుతం వైసీపీ సర్కార్ అమరావతిలో కొత్త నిర్మాణాలకు వేచి చూసే ధోరణిలోనే కనిపిస్తోంది. అక్కడ కొత్తగా పెట్టుబడి పెట్టి భవనాలు కట్టడం కంటే ఇతర ప్రాంతాలకు అభివృధ్ధిని పంచిపెట్టాలనుకుంటోంది. ఇది ఒకందుకు మంచిదే అయినా ఏపీ దీర్ఘకాలిక అభివృధ్ధి దృష్ట్యా అమరావతి రాజధానిని అలా ఉంచేయడం వల్ల అనేక ఇబ్బదులు తలెత్తుతాయన్న మరో వాదన కూడా ముందుకు వస్తోంది.

రాజధానిని చూసి….

ఏ రాష్ట్రానికైనా రాజధాని దిక్సూచిగా ఉంటుంది. ఎవరైనా డెవలప్మెంట్ కి కెరాఫ్ గా రాజధానినే చూస్తారు. ఇతర రాష్ట్రాల వారు అయినా, ఇతర దేశాల వారు అయినా రాజధానికే ముందు వస్తారు. అక్కడ జరుగుతున్న అభివృధ్ధిని చూసి తాము తలో చేయి వేయాలనుకుంటారు. అటువంటపుడు అమరావతిలో సరైన ప్రగతి కనిపించకపోతే పెట్టుబడులకు అవకాశాలు ఎంతమేరకు ఉంటాయన్న చర్చ కూడా వస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాలకు చెన్నై, బెంగుళూరు, హైదారాబాద్ వంటివి రాజధానులుగా ఉన్నాయి. అలాగే ఏపీ విషయంలో కూడా అమరావతి రాజధానిగా చూపిస్తేనే పారిశ్రామికంగా కానీ ఇతరత్రా కానీ పెట్టుబడులకు ఆస్కారం ఉంటుందని మేధావులు అంటున్నారు. వికేంద్రీకరణ చేయడం మంచిదే కానీ దానికి ముందు అమరావతిని మరీ స్కెలిటన్ బాడీలా ఉంచడం వల్ల ఇబ్బందులేనని కూడా అంటున్నారు.

ఆపడమూ కరెక్ట్ కాదు….

అయితే అమరావతి అన్న సినిమాను ఇంటర్నేషనల్ కాన్వాస్ మీద చూపించి గత ప్రభుత్వం తప్పు చేసింది. దాని వల్ల ఇపుడు ముట్టుకుంటే షాక్ తగిలేలా అక్కడ పరిస్థితి ఉంది. వేలాది ఎకరాలు సేకరించడం వరకూ బాగానే ఉన్నా భారీ నిర్మాణాలు తలకెత్తుకోవడం తడిసి మోపెడు ఖర్ఛుగా ఉంది. మరో వైపు కేంద్ర సాయం చూస్తే లేదు, ఏపీ చూస్తే అప్పుల కుప్పలా ఉంది. దానికి తోడు అన్నట్లుగా మరిన్ని అప్పులు చేసి అంతా అమరావతిలోనే కుప్ప పోస్తే మిగిలిన జిల్లాలు, ప్రగతి ఏం కావాలన్నది వైసీపీ సర్కార్ ఆలోచనగా ఉంది మరి ఈ రెండిటికీ ఎక్కడా పొత్తు కుదరడంలేదు. అమరావతిని ఇపుడున్న స్థితిలో ఆపడమూ కరెక్ట్ కాదు, అదే సమయంలో భారీ ఎత్తున లక్షల కోట్ల ప్రాజెక్టులు బుర్ర మీద పెట్టుకోవడమూ కరెక్ట్ కాదు, కానీ మధ్యేమార్గంగా అమరావతిలో కొంతైనా అభివృధ్ధి చూపించి ఆ మీదట వికేంద్రీకరణ మంత్రం పఠిస్తే రెండు విధాలుగా మేలు జరుగుతుందని అంటున్నారు. మరి వైసీపీ సర్కార్ ఏ దిశగా అడుగులు వేస్తుందో అన్నది చూడాలి.

Tags:    

Similar News