తెగని తగవు

ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలలోనూ కార్పొరేషన్లు వచ్చేశాయి. విభజన ముందు వరకూ విశాఖ మాత్రమే మహా నగర పాలక సంస్థగా ఉండగా, చంద్రబాబు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కూడా [more]

Update: 2019-08-12 06:30 GMT

ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలలోనూ కార్పొరేషన్లు వచ్చేశాయి. విభజన ముందు వరకూ విశాఖ మాత్రమే మహా నగర పాలక సంస్థగా ఉండగా, చంద్రబాబు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కూడా కార్పొరేషన్ హోదా ఇచ్చేశారు. చంద్రబాబు టైంలో వీటికి ఎన్నికలు జరగలేదు, ఇపుడు కొత్తగా వై.ఎస్.జగన్ సర్కార్ ఏర్ప‌డింది. అన్ని ఎన్నికలను ఈ ఏడాది డిసెంబర్లోగా పూర్తి చేయాలని వైసీపీ ఆలోచిస్తోంది. ముందు పంచాయతీలు, తరువాత మండలాల‌ను, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు నిర్వహించి డిసెంబర్ నాటికి కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చినపుడు అంతవరకూ మనుగడలో ఉన్న మండలాలు, పంచాయతీలు కార్పొరేషన్లో విలీనం కావాల్సివుంటోంది. దాంతో ఇపుడు కొత్త పేచీ మొదలవుతోంది.

జీవీఎంసీలో అదే గొడవ…

విశాఖ కార్పొరేషన్ని 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ మహా విశాఖగా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో నగర శివార్లలో ఉండే గాజువాక మున్సిపాలిటీతో పాటుగా చాలా కొన్ని గ్రామ పంచాయతీలు విలీనం అయిపోయాయి. ఇక ఆ తరువాత జీవీఎంసీ పరిధిని మరింతగా విస్తరించాలనుకుని భీమునిపట్నం మునిసిపాలిటీ, అనకాపల్లిని కూడా విలీనం చేశారు. దీంతో కొందరు కోర్టుకు వెళ్లారు. కొన్ని పంచాయతీలు విలీనం కాలేదు. ఆ గొడవ ఎటూ తేలక వార్డులు సంఖ్య పైనా కూడా వివాదం రేగుతోంది. ఇదిలా ఉండగా వై.ఎస్.జగన్ సర్కార్ అధికారంలోకి వస్తూనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో మరో వివాదం ముందుకువచ్చింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే అనకాపల్లి మునిసిపాలిటి రూరల్ జిల్లాలోకి వెళ్తుంది. దాంతో దాన్ని జీవీఎంసీలో ఉంచాలా కొనసాగించాలా అన్నది పెద్ద చిక్కుముడిగా మారింది. ఇప్పటికే అనకాపల్లి మునిసిపాలిటీని జీవీఎంసీలో విలీనం చేసినా వార్డుల కధ అలాగే ఉంది. రేపు రూరల్ జిల్లా వస్తే అనకాపల్లి మునిసిపాలిటీ అవుతుందా, వేరేగా కార్పొరేషన్ చేస్తారా అన్నది కూడా మరో చర్చగా ఉంది.

అక్కడా కొత్త పేచీలు….

విజయనగరం మునిసిపాలిటీగా ఉన్నపుడు రూరల్ ప్రాంతమంతా విజయనగరం మండలంగా ఉండేది. దాంతో అక్కడ అనేక పంచాయతీలు ఉండడం, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీలు ఇలా అధికార పదవులే పదవులుగా ఉండేవి. వై.ఎస్.జగన్ అధికారంలోకి రావడంతో అపుడే మండల పదవులపై నేతలు కన్నేసి గట్టిగా పనిచేసుకుంటున్నారు. ఇపుడు కార్పొరేషన్లో విజయనగరం మండలంతో పాటు ఇతర ప్రాంతాలను విలీనం చేస్తామని అధికారులు ముందుకు రావడంతో గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. తమకు రాక రాక వచ్చిన పదవులను విలీనం పేరు మీద గండి కొడతారా అని గుస్సా అవుతున్నారు. కార్పొరేషన్లో మండలాల‌ను విలీనం చేస్తే ఒకటో రెండో కార్పొరేటర్ పదవులు మాత్రమే వస్తాయి. మిగిలిన వారి సంగతి ఏం కాను అని ఆవేదన చెందుతున్నారు. జిల్లాకే చెందిన మునిసిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ ముందే ఈ పంచాయతీ పెట్టి విలీనం చేయవద్దని కోరుతున్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్ కధ కూడా అచ్చం ఇలాగే ఉంది. అక్కడ కూడా పదవుల గోల ఎక్కువైపోతోంది. మొత్తానికి కార్పొరేషన్ అంటే రాజకీయ నేతలు కస్సుమంటున్న పరిస్థితి ఉంది.

Tags:    

Similar News