రోశయ్య కు జగన్ బంపర్ ఆఫర్… అంగీకరిస్తారా?

జగన్ కి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ఓ రకమైన అనుబంధం ఉంది. కేవలం మూడున్నర‌ పదుల వయసున్న జగన్ అప్పటికి డెబ్బయి ఏళ్ళు పైదాటి సీనియర్ [more]

Update: 2020-02-29 06:30 GMT

జగన్ కి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ఓ రకమైన అనుబంధం ఉంది. కేవలం మూడున్నర‌ పదుల వయసున్న జగన్ అప్పటికి డెబ్బయి ఏళ్ళు పైదాటి సీనియర్ నేతగా ఉన్న రోశయ్యని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రతిపాదించారు. కాంగ్రెస్ లో జగన్ ఉన్నప్పటి రోజుల్లో జగన్ని రోశయ్య పదే పదే తలచుకునేవారు. జగన్ ఓదార్పు యాత్రలు, అనుమతించకుండా రోశయ్య అడ్డుకోవడాలు, పెద్దాయన్ని జగన్ బాధపెడుతున్నరని మరో వైపు కాంగ్రెస్ లో సీనియర్లు రుసరుసలు ఇలా పదకొండు నెలల రోశయ్య ముఖ్యమంత్రిత్వంలో జగన్ ప్రత్యక్షంగా పరోక్షంగా కీలకమైన పాత్ర పోషించారు. పదేళ్ళ తరువాత తన కోరిక నెరవేర్చుకున్న జగన్ సీఎం అయిన కొత్తల్లో రోశయ్యని ఇంటికి వెళ్ళి కలుసుకున్నారట. ఆ విషయం రోశయ్యే ఆ మధ్య ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అల్లుడు ఆస్తులపైన…

విశాఖను పరిపాలనా రాజధానిగా చేద్దామని జగన్ చాలా ఉత్సాహపడుతున్నారు. దాని కోసం తెరవెనక కసరత్తు పెద్ద ఎత్తున సాగుతోంది. అనేక భవనాలను కూడా ప్రభుత్వం విశాఖలో పరిశీలిస్తోంది. అందులో రోశయ్య పేరు మరో మారు బయటకు వచ్చింది. రోశయ్య ఏకైక కుమార్తె విశాఖలో నివాశం ఉంటున్నారు. అల్లుడు పైడా క్రిష్ణ ప్రసాద్ విశాఖలో విద్యాలయాల అధిపతిగా ఉంటున్నారు. ఆయనకు భీమిలీకి దగ్గరలో బ్రహ్మాండమైన వసతులతో భవనాలు ఉన్నాయి. వాటిని ఇపుడు తీసుకోవడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అంటున్నారు.

కేంద్ర బిందువుగా…..

విశాఖలో పాలనా రాజధాని వస్తే పెద్ద ఎత్తున కార్యకలాపాలు మొదలవుతాయి. అలాగే వందల సంఖ్యలో భవనాలు కూడా అవసరం అవుతాయి. అందుకోసం ఇప్పటి నుంచే ప్రభుత్వం ప్రైవేటు భవనాలతో పాటు, ప్రభుత్వ భవనాలు కూడా పెద్ద ఎత్తున పరిశీలిస్తోంది. ఇపుడు అధికారుల చూపు రోశయ్య అల్లుడి భవనాల మీద పడిందని అంటున్నారు. ఆయన ఇంజనీరింగ్ కళాశాల‌లను గతంలో నడిపారు. అత్యాధునిక సాంకేతిక సంపత్తి అక్కడ ఉంది. దాంతో పాటు సిటీకి బాగా దగ్గరలో ఉండడంతో వాటిని తీసుకునేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని అంటున్నారు. దానికి రోశయ్య అల్లుడు అంగీకరిస్తారా అన్నది చూడాలి.

పెద్దాయన ఓకేనా….?

పదేళ్ళ క్రితం నాటి రాజకీయాలు ఎలా ఉన్నా రోశయ్యతో జగన్ కి ఇపుడు మంచి సంబంధాలే ఉన్నాయని అంటున్నారు. రోశయ్య ద్వారా అల్లుడుకి చెప్పించి అయినా ఈ భవనాలు తీసుకోవాలన్నది ప్రభుత్వం ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. మరో వైపు రోశయ్య కూడా విశాఖకు తరచుగా వస్తూంటారు. విశాఖ రాజధాని పట్ల ఆయన సానుకూలంగా స్పందిస్తారని, ప్రభుత్వానికి తన తరఫున సహాయ సహకారాలు అందిస్తారని అంటున్నారు. ఇక రోశయ్య అల్లుడు కూడా రాజకీయాలకు అతీతంగా అందరితో మంచి రిలేష‌న్లు కొనసాగిస్తున్నారు. దాంతో ఆయన కూడా ఓకే అంటారని చెబుతున్నారు. మొత్తానికి అల్లుడు ద్వారా రోశయ్య జగన్ ల బంధం మరో మారు బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News