జగన్ సినిమా అయిపోయిందంటున్నారుగా…?

పదేళ్ళ పోరాటం తరువాత జగన్ ముఖ్యమంత్రి సీటును పట్టారు. నిజానికి జగన్ నాడే లౌక్యం చూపి ఉంటే 23 జిల్లాల ఉమ్మడి ఏపీకే సీఎం గా కుదురుకునేవారు. [more]

Update: 2020-11-25 15:30 GMT

పదేళ్ళ పోరాటం తరువాత జగన్ ముఖ్యమంత్రి సీటును పట్టారు. నిజానికి జగన్ నాడే లౌక్యం చూపి ఉంటే 23 జిల్లాల ఉమ్మడి ఏపీకే సీఎం గా కుదురుకునేవారు. అంటే కేసీయార్ కంటే సీనియర్ గా ఉండేవారు అన్నమాట. సరే గతం అలా గడచింది కాబట్టే పడి లేచిన తరంగంలా జగన్ విభజన‌ ఏపీకి సీఎం అయ్యారు. ఇక జగన్ కుర్చీ ఎక్కి ఏడాదిన్నర కూడా కాలేదు కానీ దిగిపో అంటున్నారు. వారూ వీరూ తేడా లేకుండా విపక్షంలోని అత్యధికులు ఇదే స్లోగన్ అందుకుంటున్నారు.

బాబుది మహా బాధ….

జగన్ దిగిపోవాలి అన్నది తెలుగుదేశం అధినేత పాడుతున్న పాట. ఆయనకు జగన్ ని సీఎం అని గుర్తించేందుకు కూడా మనస్కరించిండంలేదు. కానీ అది అలా జరిగిపోయింది. దాంతో తీవ్ర అసహనంతో ఆయన ఉన్నారు. జగన్ ప్రమాణం చేసిన నాటి నుంచే చంద్రబాబు గట్టిగా తగులుకుంటున్నారు. అయిన దానికీ కానిదానికీ జగన్ ని రాజీనామా చేయాంటున్నారు. అసెంబ్లీ రద్దు చేయమంటున్నారు. ఇక జగన్ కేసుల కారణంగా జైలుకు పోతారని తన అనుకూల మీడియా ద్వారా రాతలు రాయిస్తున్నారు. వైసీపీ ఏపీలో ఇక కనిపించదు అంటూ రాజకీయ జోస్యాలు కూడా బాబు చెబుతున్నారు. అంటే ఆయనకు జగన్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని ఎంతటి మనో వేదన కలిగించాడో అర్ధమవుతోందిగా.

పవన్ దీ అదే పాట…

కొత్త రాజకీయం తెస్తాను, వ్యవస్థలను బాగు చేస్తాను, రొడ్డ కొట్టుడు రొటీన్ పాలిటిక్స్ నాది కాదు అంటూ జబ్బలు చరచిన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇపుడు జగన్ దిగిపోతాడు అంటున్నారు. జగన్ ని సీఎంగా ఆయన కూడా అంగీకరించలేకపోతున్నారు అన్నది తెలిసిందే. జగన్ ని సీఎం కాకుండా చూస్తాను అని గత ఎన్నికల ముందు శపధాలు చేసిన పవన్ ఇపుడు జగన్ ని కుర్చీలో ఎలా చూడగలరు అన్నది కూడా ఆలోచించాలి కదా. జమిలి ఎన్నికలు రేపో మాపో వస్తాయి కాబట్టి జగన్ దిగిపోవడం ఖాయమని పవన్ చెప్పేస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చేది కచ్చితంగా జనసేన ప్రభుత్వమేనని కూడా ఆయన అంటున్నారు.

రాజు గారి నీతులివే….

రాజ్యాంగం నీతి సూత్రాలు అంటూ ప్రతీ రోజూ రచ్చ బండ పేరిట రచ్చ చేసే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు తాను గెలిచిన పార్టీ పతనాన్ని కోరడాన్ని ఏ రాజ్యాంగం చెప్పిందో మరి. ఏపీలో రాష్ట్రపతి పాలన విధిస్తారుట. జగన్ ఇక ఇంటికేనట. లేక కోర్టు ధిక్కార కేసులతో జైలు పాలవుతారుట. టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ అధినేత గురించి రాజు గారు ఇలా బాగు కోరుకుంటున్నారు మరి. వీరే కాదు, బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు వంటి వారు కూడా వైసీపీ మూసేసే పార్టీ అంటున్నారు. కేవలం ఏడాదిన్నరలోనే ఎందుకింత అసహనం వీరికి కలుగుతోందో మరి. ప్రజలు అయిదేళ్ళకు అధికారం ఇచ్చారు. రాజ్యాంగం ప్రకారం జగన్ కి ఇంకా మూడున్నరేళ్ళు పాలించే హక్కు ఉంది. ఒకవేళ జగన్ తీరు నచ్చకపోతే జనమే గద్దె దింపుతారు. కానీ ప్రజాస్వామ్య ప్రియులం అని చెప్పుకునే ఈ పార్టీల నాయకులు జగన్ని అర్ధాంతరంగా దిగిపోమని చెప్పడం ఏ రకమైన స్పూర్తి అన్నది అర్ధం కావడంలేదుగా.

Tags:    

Similar News