దుబ్బాక వయా తిరుపతి….సిగ్నల్స్ అవేనా?

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఆంధ్రప్రదేశ్ లోనూ హాట్ టాపిక్ అయింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అక్కడ దారుణ ఓటమి వైసీపీ నేతలను కూడా ఆలోచనలో పడేసింది. [more]

Update: 2020-11-11 13:30 GMT

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఆంధ్రప్రదేశ్ లోనూ హాట్ టాపిక్ అయింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అక్కడ దారుణ ఓటమి వైసీపీ నేతలను కూడా ఆలోచనలో పడేసింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. పార్లమెంటు ఉప ఎన్నికలో వైసీపీ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే తొలి ఉప ఎన్నిక కావడంతో జగన్ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయాన్ని తిరుపతి ఉప ఎన్నిక ప్రతిబింబించనుంది.

సానుభూతి పనిచేయదా?

దుబ్బాక ఉప ఎన్నికలో సానుభూతి పనిచేయదని అర్థమయింది. తిరుపతిలోనూ అంతే. ఇక్కడ కూడా బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో జరిగే ఎన్నికలు కావడంతో సానుభూతిపై వైసీపీ ఆశలు సన్నగిల్లాయనే చెప్పాలి. ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాల్సి ఉంటుంది. అంతేకాకుండా బీజేపీ ఇప్పటికే తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏపీలో బలమైన టీడీపీ కూడా తిరుపతి ఉప ఎన్నికలో అభ్యర్థిని దించేందుకు సిద్దమయింది.

సంక్షేమ పథకాలు కూడా….

మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలలో సంక్షేమ పథకాలు పనిచేయలేదని అర్ధమయింది. కేసీఆర్ ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా ప్రజలు పక్కన పెట్టారు. ఈ అంశం కూడా జగన్ పార్టీలో కలవరానికి కారణమని చెప్పక తప్పదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంటే కేవలం సంక్షేమ పథకాలపైనే జగన్ దృష్టి పెట్టారు. అభివృద్ధిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తిరుపతి ఉప ఎన్నికలో సంక్షేమ పథకాలు ఏమేరకు పనిచేస్తాయన్నది ఆలోచించాల్సిన విషయమే.

జగన్ నిర్ణయాలు కూడా….

దీనికితోడు జగన్ ప్రభుత్వ నిర్ణయాలు కూడా తిరుపతి ఉప ఎన్నికపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనను తిరుపతి ప్రాంత ప్రజలు ఏ మేరకు అంగీకరిస్తారన్నది చూడాల్సి ఉంటుంది. ఇక అక్రమ కేసులు, ఇసుక కొరత, పార్టీలో అంతర్గత విభేదాలు వంటివి జగన్ పార్టీకి తిరుపతి ఉప ఎన్నికలో ఇబ్బంది పెట్టే అంశాలే. ఇన్నాళ్లూ తనను చూసే ఓటేస్తారనుకున్న భ్రమల నుంచి జగన్ బయటకు రావాల్సి ఉంటుంది. లేకుంటే దుబ్బాక సీన్ తిరుపతిలో రిపీట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News