పూర్తి పేటెంట్ హక్కులు జగన్ కేనట ?

విశాఖ ఉమ్మడి ఏపీలోనే అతి పెద్ద నగరం. నాడు యూపీయే సర్కార్ కి వైఎస్సార్ హయాంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రాతిపాదనలు వెళ్లాయి. అపుడు హైదరాబాద్ తో [more]

Update: 2020-11-03 00:30 GMT

విశాఖ ఉమ్మడి ఏపీలోనే అతి పెద్ద నగరం. నాడు యూపీయే సర్కార్ కి వైఎస్సార్ హయాంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రాతిపాదనలు వెళ్లాయి. అపుడు హైదరాబాద్ తో పాటు విశాఖపట్నం పేరు కూడా పంపించారు. హైదరాబాద్ రాజధాని కాబట్టి తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక విశాఖ అప్పటికి ఇరవై లక్షలకు దగ్గరగా జనాభా ఉన్న సిటీ. దాంతో ఫీజిబిలిటీ వంటివి చూసి మెట్రో రైలు పట్టాలెక్కించాలని వైస్సార్ అధికారులను ఆదేశించారు. ఇక వైఎస్సార్ మరణించాకా ఈ ప్రాజెక్ట్ మూలకు చేరింది. విభజన తరువాత అమరావతిని రాజధానిని చేసిన చంద్రబాబు సర్కార్ విజయవాడను కొత్తగా మెట్రో రైల్ ప్రాజెక్ట్ జాబితాలో చేర్చింది. దాంతో విశాఖ ఫైల్ బుట్టదాఖలే అయింది.

విశాఖకే ఓటు …..

ఇపుడు జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఆయన మొదటి నుంచి విశాఖకు పెద్ద పీట వేయాలనే చూస్తూ వచ్చారు. విశాఖ ఎదుగుతున్న నగరమ‌ని అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతమని ఇప్పటికే జగన్ పదే పదే చెప్పారు. ఈ నేపధ్యంలో జగన్ విశాఖ అభివృద్ధి గురించి అనేక చర్యలను తీసుకుంటున్నారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అదే సమయంలో అక్కడ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ని కలుపుతూ 75 కిలోమీటర్ల మేర నాలుగు కారిడార్లతో మెట్రో రైల్ ప్రాజెక్ట్ కి జగన్ సర్కార్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

ఆఫీస్ తెచ్చేశారు……

ఇక విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రాంతీయ ఆఫీస్ నే జగన్ తరలించారు. విశాఖలో ప్రాజెక్ట్ కి అడుగులు పడాలంటే ఎక్కడో విజయవాడలో ఉండి మోనిటరింగ్ చేయడం కంటే విశాఖలో ఉండడం బెటర్ అని జగన్ సర్కార్ నిర్ణయించింది. అంతే కాదు, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కి సంబంధించి డీపీయార్ ని కూడా నవంబర్ నేలాఖరులోగా తయారు చేసి ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆ మీదట టెండర్లకు వెళ్లాల‌ని, సాధ్యమైనంత త్వరగా మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని ప్రారంభించాలని కూడా జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు.

పాజిటివ్ వేవ్….

విశాఖకు వైసీపీ వచ్చాక ఏం చేసింది అన్నదే టీడీపీ నుంచి వచ్చే ఫస్ట్ ప్రశ్న. అంతా మేమీ చేశామని ఇప్పటిదాకా తమ్ముళ్ళు చెప్పుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాలో హైదరాబాద్ తరువాత అత్యంత ప్రతిష్టాత్మకమైన మెట్రో రైల్ ని విశాఖకు జగన్ సర్కార్ తీసుకువస్తోందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇది కనుక పట్టాలెక్కితే విశాఖకే కాదు, ఉత్తరాంధ్రాకే అతి పెద్ద మేలు అని మంత్రి బొత్స సత్యనారాయాణ అంటున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ విషయంలో కూడా జగన్ సర్కార్ కేంద్ర నిధుల మీద ఆధారపడకుండా పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేయలనుకుంటోంది. అలా అయితేనే అనుకున్న టైంకి పూర్తి చేయగలమని కూడా భావిస్తోంది 2023 నాటికి తొలి దశ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని కూడా పట్టుదల మీద ఉంది. అదే జరిగితే విశాఖ మీద పూర్తి పేటెంట్ హక్కులు జగన్ కే దఖలు పడతాయనడంలో సందేహమే లేదు.

Tags:    

Similar News