జగన్ నుంచి వారిని విడదీయాలి… వేరు చేయాలి… అదే టార్గెట్

దళిత వ్యతిరేకి., హిందూ వ్యతిరేకి., అభివృద్ధి నిరోధక., అమరావతి వ్యతిరేకి… ఇంతేగా ఇంకేమైనా ఉన్నాయా….. రోజు ఇవేగా వార్తలు….. అర్జంటుగా జగన్మోహన్‌ రెడ్డిని దళితులకు దూరం చేయాలి….. [more]

Update: 2020-09-12 12:30 GMT

దళిత వ్యతిరేకి., హిందూ వ్యతిరేకి., అభివృద్ధి నిరోధక., అమరావతి వ్యతిరేకి… ఇంతేగా ఇంకేమైనా ఉన్నాయా….. రోజు ఇవేగా వార్తలు….. అర్జంటుగా జగన్మోహన్‌ రెడ్డిని దళితులకు దూరం చేయాలి….. హిందువులకు దూరం చేయాలి….. ఓటర్లకు దూరం చేయాలి….. అసలివన్నీ కాదు… వెంటనే ముఖ్యమంత్రి పీఠం నుంచి కిందకు లాగి పారేయాలి…. అందుకోసం ఏమైనా చేయాలి…… పత్రికల్లో ఎటూ ప్రకటనలు లేవు కాబట్టి దట్టంగా మసాలా నింపి వార్తలు రాయాలి….. జనం నిజమే అనుకోవాలి….. రాయగా రాయగా ఒక్కసారైనా నమ్మకపోతారా? అనుమానించకపోతారా? అదే కదా ఆశ.

మొన్నటి ఎన్నికల్లో బలమిదీ…..

2019 ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకున్న వైసీపీ., ప్రతిపక్ష టీడీపీల మధ్య వ్యత్యాసం 10.78శాతం. వైసీపీకి కోటి 56లక్షల 88వేల 569 ఓట్లు వస్తే టీడీపీకి కోటి 23లక్షల 4వేల 668ఓట్లు వచ్చాయి. అధికారమే లక్ష్యంగా 137స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో గెలిచిన జనసేన పార్టీకి 17లక్షల 36వేల 811 ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో మొత్తం పోలైన ఓట్లలో 5.53శాతం., పోటీ చేసిన స్థానాల్లో 7శాతం ఓట్లు పవన్‌ కళ్యాణ్‌కు దక్కాయి. ఇక జనసేన ప్రస్తుత రాజకీయ మార్గదర్శి బీజేపీ 173స్థానాల్లో పోటీ 2లక్షల 64వేల 437 ఓట్లును దక్కించుకుంది. రాష్ట్రంలో పోలైన ఓట్లలో బీజేపీకి దక్కిన ఓట్లు 0.84శాతం. అది పోటీ చేసిన స్థానాల లెక్కలో చూస్తే 0.85శాతం ఓట్లు ఆ పార్టీకి దక్కాయి. సీపిఎం., సీపీఐలు ఇప్పుడు జనసేనకు దూరం అయ్యాయి కాబట్టి వాటి ఓట్ల శాతాన్ని ఎవరి ఖాతాలో వేయాలన్నది ఇప్పుడు చెప్పలేం. సీపిఎంకు 0.32శాతం., సీపీఐకు 0.11శాతం ఓట్లు దక్కాయి. ఆ రెండు పార్టీలు జనసేనాని మాట విని చెరో 7 స్థానాలకు పరిమితం అయ్యాయి. వాటిలో కూడా ఆ పార్టీలకు డిపాజిట్లు దక్కించుకోలేదు.

“కులం-మతమే అసలు రాజకీయం…..”

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి వీలైనంత మసిపూయడమే లక్ష్యంగా ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఇందుకు ఎవరి వంతు పాత్ర వారు పోషిస్తున్నారు. నెల జీతాలు చెల్లించి ప్రతిపక్షాలను పోషించే నాయకుడు కాకపోవడంతో సహజంగానే జగన్మోహన్‌రెడ్డిపై ఆయా పార్టీలకు ఆగ్రహం ఉంటుంది. తమ ప్రచురణ సంస్థలకు భారీగా ప్రకటనలు., సిబ్బంది జీతాల కోసం చేబదులు అడిగే పరిస్థితి లేకపోవడంతో ఒంటికాలిపై విమర్శలు గుప్పిస్తుంటాయి.

మూడు నుంచి రెండులోకి రావడం ఎలా…?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మూడో., నాలుగో స్థానంలో ఉన్న జాతీయ పార్టీ వచ్చే నాలుగేళ్లలో మెరుగైన స్థానానికి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. బలమైన కుల నాయకత్వం బలం లేని ఆ పార్టీ ఎలాగైనా భవిష్యత్తులో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి స్థానంలోకి వెళ్లాలంటే ముందు రెండో స్థానంలోకి వెళ్లాలి. రెండో స్థానంలోకి వెళ్లాలంటే మూడు-నాలుగు స్థానాలను దాటుకుని వెళ్లాలి. అందుకు అయా స్థానాలు ఖాళ అవడమో., వాటిని కలుపుకుపోవడమో చేయాలి. మూడో స్థానంలో ఉన్న జనసేన ఇప్పటికే ఆ పార్టీతో జత కట్టింది. విలీనం అనే ఒక్క మాట చెప్పలేదు. కానీ పదేళ్ల క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలి ఇంటి ముందు చేతులు కట్టుకుని చెట్టు కింద., మండుటెండలో చెమటలు కక్కుతూ “ఎస్., వి ఆర్‌ మెర్జ్‌డ్” అని లేని నవ్వును ముఖాన పులుముకుని చిరంజీవి చెప్పిన దానికి ఆయన తమ్ముడు పవన్‌ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న దానికి పెద్దగా తేడా ఏమి లేదు. 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి కాపులకు రాజ్యాధికారం కోసం ఆ కుటుంబం పడుతున్న శ్రమ., కష్టం ఎవరికి రాకూడదు. ఇప్పుడు కమలానికి ప్రాణ ప్రతిష్ట చేయడానికి ఆ కుటుంబం నడుం బిగించింది. దానికి జనం ఎలా మద్దతిస్తారో చూడాలి.

ఈ ప్రచారాలు జనం నమ్మేవేనా…?

జగన్‌ హిందూ వ్యతిరేకి., క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తున్నారు…… దళితుల్ని వేధిస్తున్నారు….. ఇవే కదా రోజు పత్రికల్లో వచ్చే ప్రధాన కథనాలు….. రెండు పరస్పర విరుద్ధమైన ప్రచారాలను ప్రధాన స్రవంతి మాధ్యమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం వెనుక ఆ వర్గాలను ఏక కాలంలో దూరం చేయాలనేది లక్ష్యంగా ఉంది. జగన్‌ హిందూ వ్యతిరేకి అయితే దళితుల్ని ఎందుకు దూరం చేసుకుంటాడు…? క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసే వ్యక్తి అయితే తన అండగా ఉన్న ఓటు బ్యాంకుల్ని దూరం చేసుకుంటాడా….? ఈ రెండు సందేహాలు ప్రజలకు వస్తాయనే ఆలోచన లేకుండా బట్ట కాల్చి ముఖాన వేయడమే లక్ష్యంగా ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారాలకు నేరుగా ముఖ్యమంత్రి సమాధానం చెప్పరు కాబట్టి రాజకీయంగా లబ్ది పొందేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జగన్మోహన్‌ రెడ్డి., ఆయన తండ్రి రాజశేఖర్‌ రెడ్డి., ఆ కుటుంబం క్రైస్తవ మతాన్ని అనుసరిస్తుందనే విషయం అందరికి తెలిసిందే…. కొత్తగా మతం ముద్ర వేయడం ద్వారా ప్రజల్లో వచ్చే వ్యతిరేకత కూడా ఏమి ఉండదు. ఇక దళితులపై దాడులు., దళిత వ్యతిరేకత ప్రచారాలు పత్రికల్లో పతాక శీర్షికలకు పనికొస్తాయేమో కాని పెద్దగా ఓటర్లపై ప్రభావం చూపే అంశాలు కాబోవు. విధానపరమైన నిర్ణయాలు., కింది కులాల ప్రయోజనాలకు నష్టం వాటిల్లినపుడు మాత్రమే అవి బలంగా స్పందిస్తుంటాయి. టీడీపీ పాలనపై ఈ తరహా వ్యతిరేకతే ఎన్నికల్లో భారీ వ్యత్యాసానికి కారణమైంది. దళితుల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నా వాటి ప్రభావం ఎంత అన్నది ఇప్పుడే చెప్పలేం.

ఎవరి ప్రయోజనం వారిది…..

తెలుగు దేశం పార్టీకి కమ్మ-బీసీ కులాలు., వైఎస్సార్‌సీపీకి రెడ్డి., ఎస్సీ-ఎస్టీ., మైనార్టీలు., జనసేనకు కాపులు బలమైన ఓటు బ్యాంకులుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేసిన పవన్‌ కళ్యాణ్‌ సేనకు 121 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి ఒక్క స్థానంలో గెలిచారు. జనసేనకు 17లక్షల 36వేల 811 ఓట్లు దక్కాయి. మొత్తం పోలైన ఓట్లలో 5.53శాతం ఓట్లను పవన్ కళ్యాణ‌్ దక్కించుకున్నారు. పోటీ చేసిన స్థానాల్లో లెక్కిస్తే 7శాతం ఓట్లు జనసేనకు వచ్చాయి. ఇక భారతీయ జనతా పార్టీకి 173 స్థానాల్లో ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు. ఇప్పుడు బీజేపీ-సేన ఒక్కటై పోటీ చేస్తే వారి బలం 6.37శాతం అవుతుంది. తెలుగుదేశం పార్టీకి వచ్చిన 39.17 శాతం ఓట్లను కూడా పవన్‌ కళ్యాణ్‌ ఖాతాలో కలుపుకుంటే వారి బలం 45.54శాతం అవుతుంది. బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్లు నాలుగో స్థానంలో ఉన్న ఆ పార్టీ రెండో స్థానానికి వస్తేనే ఇది సాధ్యపడుతుంది. ఒకవేళ చంద్రబాబు మనసు మార్చుకుని చివరి నిమిషంలో కాంగ్రెస్‌ పార్టీతోనే కలిసి ఉండాలి అనుకుంటే ఆ రెండు పార్టీల బలం 2019 ఓటు షేరు ప్రకారం 40.34శాతానికి పరిమితం అవుతుంది. చంద్రబాబు బీజేపీ పక్షాన చేరితే అధికారాన్ని చేరుకోడానికి 4.5శాతం ఓట్లు., కాంగ్రెస్‌తో కలిస్తే 9.65 శాతం అవసరం అవుతాయి. ఈ లెక్కలో చూస్తే ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెడితే తప్ప ప్రభుత్వ వ్యతిరేకత పెంచి లాభపడటానికి ప్రధాన ప్రతిపక్షాలకు అవకాశం ఉండదు. పదిశాతం ఓటు బ్యాంకు లోటును పూడ్చుకోవడం కోసమే ఇప్పటి నుంచి మత రాజకీయం మొదలైంది. అంతర్వేది రథం దగ్ధమవ్వడం ప్రమాదమో., కుట్రో తెలీదు కానీ దాని వెనుక హిందుత్వ అజెండాను మాత్రం బీజేపీ-జనసేన., టీడీపీలు ఎత్తుకున్నాయి. అనూహ్యంగా ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడంతో అది తమ ఖాతాలో వేసుకుని ఆ పార్టీలు తృప్తి పడాల్సి వచ్చింది. ఇక ఏపీలో బీజేపీని అడుగుపెట్టనివ్వబోమన్న టీడీపీ ఎలా స్పందించాలో అర్ధం కాలేదు. కాకపోతే జగన్మోహన్‌ రెడ్డికి వీలైనంత మతం మరక అంటించడానికి మాత్రం ఆ పార్టీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. వైసీపీకి మతం మరక అంటించే క్రమంలో అయా వర్గాలకు తాము శాశ్వతంగా దూరం చేసుకుంటున్నామని మాత్రం మరచిపోతున్నారు. గోదావరి జిల్లాల్లో మాత్రమే ప్రభావం చూపగలిగిన క్షత్రియ, కాపు వర్గాలను బలంగా ఆకట్టుకోడానికి ఈ తరహా వ్యూహాలు అక్కరకొస్తాయేమో కాని మిగిలిన చోట్ల వికటించే ప్రమాదం లేకపోలేదు.

బీసీ ఓటు బ్యాంకు కీలకం…..

రాష్ట్రంలో పాలక పక్షాల గెలుపొటముల్ని నిర్ణయించే శక్తిగా బీసీలు ఉండటంతో., కులంతో పాటు మతాన్ని అస్త్రంగా ప్రయోగించేందుకు ప్రధాన ప్రతి పక్షాలు సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో రాష‌్రంలో 79.65శాతం పోలింగ్ నమోదైంది. ఐదు జాతీయ పార్టీలైన బీజేపీ., బిఎస్పీ., సిపిఐ., సిపిఎం., కాంగ్రెస్‌ పార్టీల తరపున 382 మంది పోటీ చేస్తే ఒక్కరికి కూడా డిపాజిట్‌ రాలేదు. ఐదు పార్టీల నుంచి పోటీ చేసిన 382 మంది అభ్యర్ధులకు 8క్షల 57వేల 427 ఓట్లు అంటే 2.73శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. అంటే ఏపీలో జాతీయ పార్టీలను చూసి అభ్యర్దులను గెలిపించే పరిస్థితి 2024లో కూడా ఉండకపోవచ్చు. బీజేపీ కోరుకుంటున్నట్లు కనీసం రెండో స్థానానికి రావాలంటే మెజార్టీ ఓటర్లైన హిందువుల్లో చీలిక తీసుకురావాలి. హిందూ ఓటర్లలో కులపరమైన చీలిక ఏపీలో సాధ్యపడదు కనుక., జనసేన సాయంతో బీసీ ఓటర్లలో చీలిక తీసుకురావాలన్నది దాని లక్ష్యం కావొచ్చు. అందుకోసం మూడున్నరేళ్ల ముందే సన్నాహాలు ప్రారంభించింది. దీనిని అధికార వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది., ఆసరా వంటి సంక్షేమ పథకాలు ఎంత వరకు ఓటర్లను చివరి వరకు వెన్నంటి ఉంచుతాయో చూడాలి.

 

 

Tags:    

Similar News