మూడు రాజధానుల్లో కొత్త ట్విస్ట్ అదేనా..?

మూడు రాజధానులు. దాదాపు ఏడాదిగా ఏపీని కట్టి కుదిపేస్తున్నాయి. నిజానికి రాష్ట్ర అభివృద్ధి కూడా దీంతోనే ముడిపడి ఉంది. ఈ సమస్య తీరితేనే ప్రగతి దారిన ఏపీ [more]

Update: 2020-09-11 08:00 GMT

మూడు రాజధానులు. దాదాపు ఏడాదిగా ఏపీని కట్టి కుదిపేస్తున్నాయి. నిజానికి రాష్ట్ర అభివృద్ధి కూడా దీంతోనే ముడిపడి ఉంది. ఈ సమస్య తీరితేనే ప్రగతి దారిన ఏపీ నడిచేది. అంత కీలకం అయిన మూడు రాజధానుల సమస్యకు చట్టపరమైన భరోసా లభించింది కానీ న్యాయ సమీక్ష ముందు అది నిలిచింది. దాంతో ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఊహకు అందడంలేదు. నిజానికి ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించజాలరు అని మేధావులు అంటారు. ఒక వేళ రాజ్యాంగపరమైన లోపాలు ఉంటే కోర్టుల్లో సమీక్ష జరుగుతుంది తప్ప మొత్తానికి మొత్తం ప్రభుత్వ నిర్ణయం అమలు కాకుండా పోదూ అనే న్యాయ నిపుణులూ ఉన్నారు.

మోడీ వరమిచ్చినా…?

ఎక్కడ బాధ వేస్తోంది అంటే మూడు రాజధానుల విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ జగన్ కి ఎపుడో అభయం ఇచ్చేసింది. సూది మొనంత మేర కూడా తాము జోక్యం చేసుకోమని కూడా తేల్చేసింది. పదే పదే హై కోర్టుకు సమర్పిస్తున్న అఫిడవిట్లలో కూడా ఇదే సంగతి తేటతెల్లం చేస్తూ వస్తోంది. విభజన చట్టంలో కూడా ఒక రాజధాని అని ఎక్కడా పేర్కొనలేదని కూడా క్లారిటీ ఇచ్చేసింది. అంటే మూడు పెట్టుకున్నా ముప్పై పెట్టుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమేనన్నమాట. మరి ఇంత చేసినా కూడా జగన్ సర్కార్ కి ఊరట మాత్రం దక్కడంలేదు. బిల్లు చట్టమైంది. మంచి రోజు చూసుకుని విశాఖ నుంచి పాలన మొదలుపెడదామన్న జగన్ ఆరాటానికి కోర్టు కేసులు అడ్డుకట్ట వేస్తున్నాయి.

అదే కీలకమా …?

ఇదిలా ఉండగా ఏపీ హైకోర్టు ని గుంటూరు లో ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్రపతి ఉత్తర్వులతోనే చేశారన్నది న్యాయ నిపుణుల మాటగా ఉంది. అంటే బహుశా ఇదే మూడు రాజధానులకు రాజ్యాంగపరంగా వచ్చే అతి పెద్ద చిక్కు అన్నది కూడా భావనగా ఉంది. జగన్ సర్కార్ ఇవేవీ చూడకుండా కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఆ విధంగానే చట్టాన్ని చేశారు. దాంతో ఇదిపుడు న్యాయ సమీక్షలో ఎంతవరకూ నిలబ‌డుతుంది అన్నది చర్చగా ఉందిట. ఈ విషయంలో మాత్రం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తే అక్కడ పార్లమెంట్ ఆమోదించి రాష్త్రపతికి పంపితే ఆ విధంగా గుంటూరు నుంచి కర్నూలుకి న్యాయ రాజధాని తరలివెళ్ళే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఇలా చేస్తే ఓకేనా…?

అయితే ఈ విషయంలో కూడా మరో మాట ఉంది. కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగపరమైన అవసరాలను తీర్చాల్సి ఉంది. పైగా బాగా కాలయాపన కూడా జరిగే అవకాశం ఉంది. అలా కాకుండా కర్నూలు కి శాసన రాజధానిని కనుక తరలించినట్లైతే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అంటున్నారు. అపుడు విశాఖ పాలనా రాజధానిగా యధాప్రకారం ఉంటుంది. ఇక గుంటూరులో హైకోర్టు ఉంటుంది. అలా అమరావతిని న్యాయ రాజధానిగా మార్చినట్లైతే మూడు ప్రాంతాలకు జగన్ అనుకున్నట్లుగా న్యాయం జరుగుతుంది అంటున్నారు. మరి జగన్ ఈ విషయంలో మొదట హమీ ఇచ్చినట్లుగానే కర్నూలుకి హైకోర్టు వచ్చేలా చూస్తారా లేక వేరే విధంగా ట్విస్ట్ ఇస్తారా అన్నది చూడాలి. అసలింతకీ మూడు రాజధానుల విషయంలో హై కోర్టు తీర్పు ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరమే.

Tags:    

Similar News