రాజీనామాల‌పై రాజీ.. జ‌గ‌న్ వ్యూహం వెనుక రీజ‌నేంటి..?

రాజ‌కీయాల్లో నాయ‌కులు వేసే ఎత్తులు పైఎత్తులు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రత్యర్థి పార్టీల‌ను బ‌ల‌హీన ప‌రిచేందుకు పార్టీలు వేసే వ్యూహాలు కూడా లోతుగా ఉంటాయి. ఇలాంటి వ్యూహ‌మే [more]

Update: 2020-08-02 02:00 GMT

రాజ‌కీయాల్లో నాయ‌కులు వేసే ఎత్తులు పైఎత్తులు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రత్యర్థి పార్టీల‌ను బ‌ల‌హీన ప‌రిచేందుకు పార్టీలు వేసే వ్యూహాలు కూడా లోతుగా ఉంటాయి. ఇలాంటి వ్యూహ‌మే ఇప్పుడు జ‌గ‌న్ అవ‌లంబిస్తున్నారు. అయితే, ఈ వ్యూహం బెడిసి కొడితే.. అసెంబ్లీలో తాను చెప్పిన మాట‌ల‌కే తాను నిల‌బ‌డ‌క‌పోతే.. ప‌రిస్థితి ఏంటి ? వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించాల్సిన అధికార పార్టీ అధినేత జ‌గ‌న్ గాడి త‌ప్పుతున్నార‌న్న, గాడి త‌ప్పార‌న్న అప‌వాదు రాదా ? ఇప్పుడు ఈ విష‌య‌మే వైఎస్సార్ సీపీలో చ‌ర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం 151 మంది ఎమ్మెల్యేల‌తో ఘ‌న‌మైన మెజారిటీ సాధించి దేశంలో మ‌రే రాష్ట్రంలోనూ ఇంత బ‌ల‌మైన ప్రభుత్వం లేదు.. అనే రీతిలో జ‌గ‌న్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ప్రత్యర్థి పార్టీని…..

అయితే, ఏడాది కాలంగా ఆయ‌న అనుస‌రిస్తున్న రాజ‌కీయ వ్యూహం పార్టీలోను, బ‌య‌టా కూడా చ‌ర్చనీయాంశంగా మారుతోంది. త‌న‌కు అవ‌స‌రం లేకున్నా.. ప్రత్యర్థి పార్టీ టీడీపీని బ‌ల‌హీన ప‌రిచేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌నేది ప్రధాన వివాదం. ఆ పార్టీ త‌ర‌ఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో స‌గానికిపైగా త‌న ప‌క్షానికి లాగేయాల‌నేది జ‌గ‌న్ వ్యూహం. ఈ క్రమంలోనే ఆయ‌న ఇప్పటికి ముగ్గురు కీల‌క ఎమ్మెల్యేల‌ను టీడీపీ నుంచి వేరు చేశారు. ఇక‌, ఇప్పుడు మ‌రో మాజీ మంత్రి, కీల‌క నేత గంటా శ్రీనివాస‌రావును కూడా త‌న పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నార‌నే వార్తలు వ‌స్తున్నాయి. ఇప్పటి వ‌ర‌కు గంటా చేరిక‌కు త‌న పార్టీలోనే ఉన్న అడ్డంకుల‌ను తొల‌గించుకున్న జ‌గ‌న్‌.. ఎప్పుడైనా వ‌చ్చి కండువా క‌ప్పుకోవ‌చ్చని గంటాకు సందేశం పంపార‌ని తెలిసింది.

సభ్యులు వెళ్లినా….

గ‌తంలో తాము ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు త‌మ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను చంద్రబాబు త‌న పార్టీలో చేర్చుకుని కండువా క‌ప్పడంతోపాటు కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చారనే ఆగ్రహం, ఆక్రోశం జ‌గ‌న్‌ను ఇంకా వెంటాడుతోంది. ఈ క్రమంలోనే టీడీపీని తుత్తునియ‌లు చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ తొలి అసెంబ్లీ స‌మావేశాల్లో పార్టీలు మారేవారిని ప్రోత్సహించ‌న‌ని, ఇలాంటి వారిపై వేటు వేస్తామ‌ని సంక‌ల్పం చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు దీనికి విరుద్ధంగా టీడీపీ నుంచి స‌భ్యుల‌ను త‌న పార్టీలోకి చేర్చుకుని.. ఆ పార్టీకి ఉన్న ప్రధాన ప్రతిప‌క్షం హోదానే పెరికేయాల‌ని చూస్తున్నారు. వాస్తవానికి స‌భ్యులు త‌గ్గిపోయినా.. కోర్టుల జోక్యంతో ప్రధాన ప్రతిప‌క్షం హోదాను తెచ్చుకున్న ప‌రిస్థితి పక్కరాష్ట్రం తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌ల్ల తెలుస్తూనే ఉంది.

పంతాన్ని కొనసాగిస్తూ….

అయిన‌ప్పటికీ.. జ‌గ‌న్ త‌న పంతాన్ని కొన‌సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొంద‌రు మ‌న‌సు చంపుకోలేక మేం రాజీనామాలు చేసి వ‌స్తా.. అవ‌స‌ర‌మైతే.. ఉప ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం. అని జ‌గ‌న్ కు చెబుతున్నార‌ట‌. అయితే, రాజీనామాలు వ‌ద్దు.. అలా చేస్తే.. చంద్రబాబును మాన‌సికంగా ఇబ్బంది పెట్టిన‌ట్టు కాదు. ఆయ‌న పార్టీ స‌భ్యులుగానే ఉంటూ.. ఆయ‌న‌కు వ్యతిరేకంగా స‌భ‌లో చ‌క్రం తిప్పాల‌ని జ‌గ‌న్ హిత‌బోధ చేస్తున్నార‌ని తాజాగా తెలిసింది. కానీ, ఈ వ్యూహం స‌రైందేనా? నాడు ఏ సెంటిమెంటు ప్రకారం జ‌గ‌న్ జ‌నాల్లోకి వెళ్లారో.. రేపు చంద్రబాబు కూడా అదే సెంటిమెంటుతో(నా పార్టీలో గెలిచిన వారిని జ‌గ‌న్ లాగేసుకున్నారు) ప్రజ‌ల్లోకి వెళ్తే.. జ‌గ‌న్ ప‌రువు ఏమ‌వుతుంది? అనే ప్రశ్నకు ఆయ‌న స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. దీనిని ఆలోచించుకుంటే.. మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాట త‌ప్పాడు అనే మాట నుంచి జ‌గ‌న్ బ‌య‌ట‌ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. అంటున్నారు పార్టీ సీనియ‌ర్లు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News