లాస్ట్ మినిట్‌ అయితేనేంటట

అదృష్టం ఉండాలే.. కానీ వ‌డ్డించేవాడు క‌రుణిస్తే.. చివ‌రి పంక్తిలో ఉంటే ఏంటి? అన్నట్టుగా ఉన్నాయి.. మ‌హమ్మద్ ఇక్బాల్‌, చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి రాజ‌కీయాలు. వీరిద్దరికీ ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ [more]

Update: 2019-08-13 12:30 GMT

అదృష్టం ఉండాలే.. కానీ వ‌డ్డించేవాడు క‌రుణిస్తే.. చివ‌రి పంక్తిలో ఉంటే ఏంటి? అన్నట్టుగా ఉన్నాయి.. మ‌హమ్మద్ ఇక్బాల్‌, చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి రాజ‌కీయాలు. వీరిద్దరికీ ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ కీల‌క ప‌దవులు క‌ట్టబెట్టారు. దీంతో వీరు ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బవుతున్నారు. మాజీ ఐపీఎస్ ఇక్బాల్ ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఆరు నెల‌ల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌నకు అనంత‌పురం జిల్లా హిందూపురం టికెట్‌ను ఇచ్చారు. నిజానికి అక్కడ వైసీపీ నుంచి సీనియ‌ర్ నేత‌ న‌వీన్ నిశ్చల్ ఉన్నప్పటికీ.. ఆయ‌న‌ను ప‌క్కకు పెట్టి మ‌రీ.. ఇక్బాల్‌కు వైఎస్ జ‌గ‌న్ టికెట్ ఇవ్వడం అప్పట్లోనే సంచ‌ల‌నం సృష్టించింది.

మైనారిటీల కోసం….

2014 ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ జిల్లాలో మైనార్టీలు ఎక్కువుగా ఉన్న క‌దిరి సీటును మైనార్టీల‌కు ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో అదే సీటును రెడ్డి వ‌ర్గానికి చెందిన సిద్ధారెడ్డికి ఇవ్వడంతో హిందూపురంను త‌ప్పనిస‌రిగా మైనార్టీల‌కు ఇవ్వాల్సి రావ‌డంతో ఇక్బాల్‌కు పార్టీలో చేరిన వెంట‌నే జాక్‌పాట్ కొట్టిన‌ట్లయ్యింది. అయితే, ఎన్నిక‌ల్లో ఎంత వైఎస్ జ‌గ‌న్ సునామీ క‌నిపించినా.. హిందూపురంలో మాత్రం టీడీపీ నేత బాల‌య్య గెలిచారు. దీంతో ఇక్బాల్ ప‌రిస్థితి ఏంట‌నే ప్రశ్న తెర‌మీదికి వ‌చ్చింది.

ఎన్నికల ముందు వరకూ టీడీపీలోనే…

ఇక‌, వైఎస్ జ‌గ‌న్ త‌న ప్రభుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత‌.. హోం శాఖ గౌరవ స‌ల‌హాదారుగా కీల‌క పోస్టులో నియ‌మించారు. దీంతో ఆయ‌న సంతృప్తి చెందారు. అయితే, ఇప్పుడు మ‌రో కీల‌క ప‌ద‌వి ఎమ్మెల్సీని కూడా ఆయ‌న‌కే ఇవ్వడంలో ఇక్బాల్ వ‌ర్గంలో ఆనందం పెల్లుబికింది. అదికూడా ప‌విత్ర బ‌క్రీద్ రోజే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప్రక‌టించ‌డంతో మ‌రింత ఆనందంలో మునిగిపోయారు. అదే విధంగా చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా టీడీపీలోనే ఉన్నారు. అంతేకాదు, టీడీపీ ప్రభుత్వంలోనే ఆయ‌న పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ చైర్మన్‌గా చ‌క్రం తిప్పారు.

లక్కీగా తగిలినట్లే…..

అయితే, ఎన్నిక‌ల‌కు కొన్నివారాల ముందు ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే త‌న‌కు టికెట్‌ లేక పోయినా.. వైసీపీ విజ‌యానికి కృషి చేస్తానంటూ.. బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డికి సాయం చేసి, ఆయ‌న గెలిచేలా కృషి చేశారు. దీంతో ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ ఈయ‌న‌కు కూడా ఎమ్మెల్సీ ప‌ద‌విని అప్పగించారు. ఇలా మొత్తంగా త‌న‌ను న‌మ్ముకుని వ‌చ్చి, పార్టీ కోసం ప‌నిచేసిన వారికి న్యాయం చేయడంతో అటు ఇక్బాల్‌, ఇటు చ‌ల్లా వ‌ర్గాలు సంతృప్తిగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇలానే వ‌చ్చే కొద్ది కాలంలోనే మ‌రింత మంది పార్టీని న‌మ్ముకున్న వారికి వైఎస్ జ‌గ‌న్ న్యాయం చేస్తాడ‌ని వైసీపీ వ‌ర్గాలు చెపుతున్నాయి. ట్విస్ట్ ఏంటంటే పార్టీలో రెండు మూడేళ్లకు ముందే వైఎస్ జ‌గ‌న్ ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చిన నేత‌ల‌కు రాని ప‌ద‌వులు ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో చేరిన వాళ్లకు ల‌క్కీగా చిక్కేశాయి.

Tags:    

Similar News