జగన్ గట్స్ కి జోహార్ చెప్పాల్సిందే కదా?

జగన్ అంటేనే దమ్మున్న నేత అంటారు. అది పదేళ్ళుగా రుజువు అవుతూనే ఉంది. ఆయన ప్రతిపక్ష నేతగా ఎంత దూకుడుగా ఉన్నారో అధికారంలోకి వచ్చాక అంతకు మించి [more]

Update: 2020-07-14 14:30 GMT

జగన్ అంటేనే దమ్మున్న నేత అంటారు. అది పదేళ్ళుగా రుజువు అవుతూనే ఉంది. ఆయన ప్రతిపక్ష నేతగా ఎంత దూకుడుగా ఉన్నారో అధికారంలోకి వచ్చాక అంతకు మించి ఉన్నారు. అయితే అన్నీ సైలెంట్ గానే చేస్తున్నారు. తన పేరు కోసం ఎక్కడా పాకులాడడంలేదు. ఇది నేను చేశాను అని చెప్పుకోవడంలేదు. ఇక విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజ్ దుర్ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. మే 7న అర్ధరాత్రి తరువాత ఒక ట్యాంక్ నుంచి స్టెరీన్ గ్యాస్ లీక్ అవడంతో ఎల్జీ పాలిమర్స్ ని అంటిపెట్టుకున్న అయిదు గ్రామాల ప్రజలు వణికిపోయారు. ఎక్కడివారు అక్కడ పరుగులు తీశారు. ఇక పదిహేను మంది దాకా దారుణంగా చనిపోయారు. ఈ దుర్ఘటన తరువాత జగన్ స్పందించిన తీరు దేశంలోనే ఒక స్పూర్తిగా ఉందని అంటున్నారు. ఏపీలోని విపక్షాల విమర్శలు పక్కన పెడితే బాధితుల పట్ల జగన్ ఉదారతతో తక్షణ సాయంగా భారీ ఎత్తున కోటి రూపాయలు ఒక్కో మృతుని కుటుంబానికి ఇచ్చారు. అలాగే తాను స్వయంగా అందరికీ పరామర్శించి ధైర్యం చెప్పారు.

దేశంలోనే ఫస్ట్….

ఇక ఆనాడు జగన్ ఎంత చేసినా కూడా విపక్షాలు ఒక ఘాటు విమర్శ చేశాయి. ఎల్జీ పాలిమర్స్ తో కుమ్మక్కు అయ్యారని, ఎయిర్ పోర్టులో మేనేజ్మెంట్ తో సీక్రేట్ గా చర్చలు జరిపారని, అందుకే అరెస్టులు లేవని అంటూ వచ్చారు. భాధితులను కూడా ఎగదోసి శవాలతోనే ఎల్జీ పాలిమర్స్ గేటు వద్ద ఊరేగింపు తీయించారు. అయితే జగన్ మాత్రం ఒకే మాట చెప్పారు. విచారణ‌ జరిపిస్తున్నాం, నివేదిక వచ్చాక చర్యలు ఉంటాయని, అదే విధంగా హై పవర్ కమిటీతో విచారణకు ఆదేశించారు. ఆ నివేదిక రెండు నెలల తరువాత ఇటీవలే వచ్చింది. అది ముఖ్యమంత్రి చేతుల్లోకి ఇలా రాగానే అలా ఎల్జీ పాలిమర్స్ మీద జగన్ మూడవ కన్నే తెరిచారు. ఉక్కుపాదం మోపి ఏకంగా విదేశీయుడైన సీఈవో కమ్ మేనేజింగ్ డైరెక్టర్ సుంకీ జియోంగ్ తో సహా 12 మంది పెద్ద తలకాయలనే కటకటాల వెనక్కి నెట్టారు.

డేరింగ్ స్టెప్…..

నిజానికి ఎల్జీ పాలిమర్స్ విదేశీయులది, సౌత్ కొరియా వారిది. కేవలం రాష్ట్ర పరిధిలోనే కాదు, కేంద్రంతోనూ అన్నీ వ్యవహారాలు ముడిపడిఉంటాయి. ఇటువంటి సంస్థ పెద్దను ఒక విదేశీయ సీఈవోను అరెస్ట్ చేయాలంటే డేరింగ్ ఉండాలి. పైగా సౌత్ కొరియాతో భారత్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. రేపటి రోజున పెట్టుబడులు రాకపోతే జగన్ ఇలా చేశాడు అని కూడా ఇవే ప్రతిపక్షాలు అంటాయి. కానీ జగన్ మాత్రం అన్ని విషయాలు ఆలోచించారు. తన మీద బురద జల్లినా పట్టించుకోలేదు. పూర్తి విచారణకు ఆదేశించారు. నివేదికను దగ్గర పెట్టుకుని అంతా చట్టబద్ధంగానే చేస్తూ విదేశీ సీఈవోను జైలుకు పంపించారు.

భేష్ అంటున్నారా…?

ఇక జగన్ ఎల్జీ పాలిమర్స్ విషయంలో రెండు రకాలుగా పాలకుడిగా మెప్పు పొందుతున్నారు. ఒకటి బాధితుల పట్ల ఆయన చూపిన ఉదారత కరుణ అన్నది దేశమంతా చూసింది. తక్షణ సాయంగా పెద్ద మొత్తం ఇచ్చి ఆదుకున్నారు. దీని మీద హైకోర్టు కూడా ఏపీ సర్కార్ మానవత్వాన్ని కొనియాడింది. అదే సమయంలో బాధ్యులైనవారు ఎంతటి పెద్ద వారు అయినా ఉక్కుపాదం మోపుతామని ఆచరణలో చెప్పి మరీ జగన్ కాఠిన్యం చూపించారు. దానికి నిదర్శనమే పెద్ద తలకాయల అరెస్టులు. అంతే కాదు, విశాఖ సహా రాష్ట్రంలో ఉన్న ప్రమాదకర పరిశ్రమల విషయంలో జగన్ ఒక పాలసీని తెస్తున్నారు. వాటిని జనవాసాలకు దూరంగా తరలిస్తున్నారు. కొత్తవాటికి కూడా అనుమతులు అక్కడే ఇస్తారు.

నాడు అలా …

నిజానికి ఎల్జీ పాలిమర్స్ ఘటనను భోపాల్ గ్యాస్ ప్రమాదంతో చాలా మంది పోల్చి చూశారు. నాడు ఏకంగా అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పోరేషన్ సీఈవో వారెన్ ఆండెర్సన్ ని వచ్చిన విమానంలోనే వెనక్కి పంపించారు నాటి పాలకులు అంటారు. కేసులు పెద్దగా లేవు. కటకటాల వెనక్కి పెద్దవాళ్ళు పోలేదు. కానీ ఏపీ లో మాత్రం జగన్ ఈనాడు చేసింది నాడే చేసి ఉంటే విదేశీ పారిశ్రామికవేత్తలకు భయం భక్తి ఉండి ఇలాంటి ప్రమాదాలు దేశంలో మళ్లీ ఎక్కడా జరిగిఉండేవి కావని పర్యావరణ వేత్తలు కూడా అంటున్నారంటే జగన్ ఏ విధంగా గట్స్ చూపించారో అర్ధమవుతుంది.

Similar News