వారికి గుర్తింపు లేదట.. అందుకే గుర్రుగా ఉన్నారట

అధికారంలో లేక తెలుగుదేశం పార్టీ క్యాడర్, లీడర్లు నిస్తేజంగా ఉన్నారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఓటమి నుంచి తేరుకుని యాక్టివ్ అవ్వడానికి కొంత సమయం [more]

Update: 2020-07-08 03:30 GMT

అధికారంలో లేక తెలుగుదేశం పార్టీ క్యాడర్, లీడర్లు నిస్తేజంగా ఉన్నారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఓటమి నుంచి తేరుకుని యాక్టివ్ అవ్వడానికి కొంత సమయం పట్టే వీలుంది. అయితే అధికార వైసీపీలోనూ ఇన్ యాక్టివ్ గా అనేక మంది నేతలు ఉండటం విశేషం. ఏపీలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కొందరు సీనియర్ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇది దేనికి సంకేతమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

వైసీపీలోనూ యాక్టివ్ గా లేక….

తెలుగుదేశమైనా, వైసీపీ అయినా ఒక్క వ్యక్తి చేతుల మీదుగానే నడుస్తుంది. టీడీపీ లో చంద్రబాబు, వైసీపీలో జగన్ మాట ఫైనల్. వారి నిర్ణయమే అంతిమం. ప్రాంతీయ పార్టీల్లో ఇది కామన్. అయితే వారు తీసుకున్న నిర్ణయాలపైనే అంతిమంగా నేతలు పార్టీలో కొనసాగుతారన్నది వాస్తవం. తమకు పార్టీలో భవిష్యత్ ఉందనుకుంటేనే ఉంటారు. లేకుంటే మొహం చాటేస్తారు. వైసీపీలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది.

అధికారంలోకి రాగానే….

వైసీపీ అధికారంలోకి రాగానే తమకు మంచి పదవులు వస్తాయని సీనియర్ నేతలు ఆశించారు. ఎన్నికలకు ముందు తాము పడ్డ కష్టాన్ని జగన్ గుర్తిస్తారనుకున్నారు. అయితే ఫ్యూచర్ వారికి కనపడటం లేదు. ఉన్న శాసనమండలిని రద్దు చేయడాన్ని అనేక మంది సీనియర్ నేతలు ఆంతరింగక సంభాషణల్లో తప్పుపడుతున్నారు. దాడి వీరభద్రరావు, సి.రామచంద్రయ్య, మర్రి రాజశేఖర్, కిల్లి కృపారాణి వంటి నేతలు ఎమ్మెల్సీ పోస్టులను ఆశిస్తున్నారు.

పదవులు రావని…..

అయినా జగన్ శాసనమండలి రద్దుకే మొగ్గు చూపారు. దీంతో గత కొన్నాళ్లుగా సీనియర్ నేతలు ఎవరూ బయటకు వచ్చి మాట్లాడటం లేదు. ప్రతి పథకంలో తెలుగుదేశం పార్టీ అవినీతి ఉందని ఎలుగెత్తి చాటుతున్నప్పటికీ వారు మాత్రం నోరుమొదపడం లేదు. వైసీపీలో కొద్ది మంది మాత్రమే విపక్షాల విమర్శలను ఖండిస్తున్నారు. ఇలా జగన్ తాను మాట ఇచ్చిన వారికి భవిష్యత్తులో ఎలాంటి పదవులు ఇచ్చే అవకాశం లేదన్న స్పష్టత రావడంతో వారి గొంతులు మూగబోయాయన్న టాక్ వైసీపీలో బలంగా విన్పిస్తుంది. మరి వైసీపీలో కూడా నేతలు యాక్టివ్ కావాల్సిందేనా? అంటే అవుననే అంటున్నారు.

Tags:    

Similar News