రాజమార్గాన వచ్చేందుకు స్కెచ్ వేస్తున్నారా?

ఏపీ శాసనమండలి కధ ఇప్పట్లో తెమిలేలా కనిపించడం లేదు. కేంద్ర వద్ద రద్దు తీర్మానం పెండింగులో ఉంది. మరో వైపు దేశవ్యాప్తంగా మండలి ఉండాలా? లేదా? అన్న [more]

Update: 2020-06-30 02:00 GMT

ఏపీ శాసనమండలి కధ ఇప్పట్లో తెమిలేలా కనిపించడం లేదు. కేంద్ర వద్ద రద్దు తీర్మానం పెండింగులో ఉంది. మరో వైపు దేశవ్యాప్తంగా మండలి ఉండాలా? లేదా? అన్న దాని మీద ఒకే విధానం ఉండాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. దాని కోసం ఒక కమిటీని నియమించి మొత్తం అధ్యయం చేస్తారట. అంటే ఏపీ అసెంబ్లీ చేసిన మండలి రద్దు తీర్మానం తరువాత కేంద్రానికి ఇపుడు తెలివిడి వచ్చినట్లుంది. దేశంలో అయిదు రాష్ట్రాల్లోనే ఇపుడు మండలి ఉంది. ఇక మరోవైపు గతంలో రద్దు చేసిన రాష్ట్రాలు మళ్ళీ పునరుధ్ధరణ కోరుతున్నాయి. ఏపీ రద్దు అంటోంది. ఇలా ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం రాగానే రాజకీయ ద్వేషాలకు మండలి బలి అవుతోందన్న ఎరుక కేంద్రానికి ఇపుడు వచ్చిందట. దాంతో జాతీయ విధానం ఒకటి రూపొందించి మండలిని కూడా రాజ్యసభ మాదిరిగా శాశ్వత సభ చేయాలా లేక ఏకంగా మెజారిటీ రాష్ట్రాల అభిప్రాయంతో దేశంలో ఎక్కడా లేకుండా రద్దు చేయాలా అన్నది ప్రస్తుతం కేంద్రం ఆలోచనలో ఉందిట. దాంతో ఏపీలో మండలి రద్దు ఇప్పట్లో కుదిరేది కాదు అంటున్నారు.

మెజారిటీ అలా…

దాంతో జగన్ కూడా పరిస్థితులు అర్ధం చేసుకుని మండలిలో మెజారిటీ కోసం అడుగులు వేస్తున్నారు అంటున్నారు. నిజానికి 2021 వరకూ ఆగితే మరిన్ని సీట్లు వైసీపీకి వస్తాయి. ఆ తరువాత మరో రెండేళ్ళకు పూర్తి మెజారిటీ వస్తుంది. అయితే ఈ లోగా టీడీపీ రాజకీయ రచ్చ చేస్తూ వైసీపీకి ఊపిరి తీసుకోనీయడంలేదు. మండలిలో చర్చలు జరగడం లేదు, రచ్చలేనని తాజా పరిణామాలు మరోమారు నిరూపించాయి. దీంతో మండలిలో పట్టు సాధించాల‌ని జగన్ గట్టిగానే ఆలోచిస్తున్నారు.

పన్నెండు మందా….?

వైసీపీ సై అంటే టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరేందుకు పన్నెండు మంది ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే టీడీపీ మాదిరిగా వారిని నేరుగా చేర్చుకోవడానికి జగన్ ఇష్టపడడంలేదని అంటున్నారు. దానికి తోవ కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్ చూపించాని అంటున్నారు. అంటే ఉన్న పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ పదవి వదులుకుని వస్తే తిరిగి వారికే వైసీపీ టికెట్ ఇచ్చి రాజమార్గాన వారిని సభలోకి గెలిపించుకుని తేవాలని వైసీపీ స్కెచ్ వేస్తోందిట. ఇప్పటికే కడపకు చెందిన శివారెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత వైసీపీ గూట్లో ఉన్నారు. వారి మీద అనర్హత వేటు పడినా కూడా వైసీపీ తరఫున మళ్ళీ నెగ్గుతారు. అదే విధమైన భరోసాతో మరో పన్నెండు మంది టీడీపీ ఎమ్మెల్సీలను లాగేస్తే వైసీపీకి ఉన్న పూర్తి బలం తో గెలిపించుకోవడం సులువు అని జగన్ భావిస్తున్నారుట. ఆ విధంగా తొందరలోనే మండలిలో మెజారిటీ సంపాదించుకోవచ్చునని వ్యూహం రూపొందిస్తున్నారుట.

వారు తప్ప ….

మొత్తానికి మండలిలో యనమల రామక్రిష్ణుడు, లోకేష్ తో పాటు ఒకరిద్దరు కరడు కట్టిన టీడీపీ ఎమ్మెల్సీలు తప్ప మొత్తానికి మొత్తం అక్కడ కూడా చాప చుట్టించేయాలని వైసీపీ గట్టి పధకమే వేస్తోంది. నిజానికి దేశంలో ఎక్కడైనా పెద్దల సభల్లో విపక్షాలను చీల్చేసి అధికార పక్షం బలం తెచ్చుకుంటోంది. కేంద్రంలో మోడీ కూడా రాజ్యసభలో అదే చేస్తున్నారు. నీతికి మారు పేరుగా ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ తాజాగా ఆర్జేడీ నుంచి అయిదుగురు ఎమ్మెల్సీలను లాగేశారు. జగన్ కూడా మార‌కపోతే ఈ తలనొప్పి ఇలాగే ఉంటుందని అంటున్నారు. దీనికి పొరుగుతున ఉన్న కేసీఆర్ ని కూడా ఉదాహరణగా చూపుతున్నారు. మండలిలో బలాన్ని రాజకీయంగా పెంచుకోవడం మానేసి జగన్ ఏకంగా మండలి రద్దు అంటూ పెద్ద నిర్ణయం తీసుకోవడం పట్ల ఇప్పటికీ పార్టీలో అసంత్రుప్తి ఉంది. ఇపుడు ఎటూ రద్దు అన్నది లేట్ అవుతున్నందువల్ల జగన్ సరైన రూట్లోకి వచ్చారని వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News