జగన్ కోరి కోరి కంపు చేసుకుంటున్నాడా ?

జగన్ కి ఎంతో మంది సలహాదారులు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గరనుంచి ఎంతో మంది పక్కన ఉన్నారు. చెవిలో చెబుతూనే ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి అయిన తరువాత [more]

Update: 2020-05-06 02:00 GMT

జగన్ కి ఎంతో మంది సలహాదారులు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గరనుంచి ఎంతో మంది పక్కన ఉన్నారు. చెవిలో చెబుతూనే ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ పదుల సంఖ్యలో సలహాదారులను నియమించుకున్నారు. మరి ఇంతమంది ఉండి కూడా జగన్ ప్రతీ విషయంలోనూ దొరికిపోతున్నారు. కోరి మరీ కంపు చేసుకుంటున్నారు. లాక్ డౌన్ సడలింపులు ఇలా ప్రకటించారో లేదో కానీ అలా ఏపీలో మద్యం దుకాణాలు తెరిచేసి జగన్ అల్లరిపాలు అయ్యారు. సంపూర్ణ మద్యపాన నిషేధంపైన తన చిత్తశుధ్ధినే ఆయన జనంలో ప్రశ్నార్ధకం చేసుకున్నారు.

ఎంగిలి కూడు….

ఈ దేశంలో మద్యపాన నిషేధం అమలు చాలా కష్టం. అయినా ప్రస్తుతం బీహార్ లో నితీష్ కుమార్ దాన్ని అమలు చేసి చూపిస్తున్నారు. ఏపీలో చూసుకుంటే నాడు అన్న ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు జరిపారు. ఇపుడు మళ్ళీ జగన్ అదే తన నినాదం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. జగన్ దశలవారీగా మద్య నిషేధం అమలుచేస్తున్నారు. సరే ఏదోనాటికి దార్లో పడుతుంది రాష్ట్రం అనుకుంటున్న వేళ ఈ కరోనా వైరస్ రావడం లాక్ డౌన్ తో ఆదాయ‌ మార్గాలు మొత్తం మూసుకుపోవడంతో తక్షణం ఖజానాను నింపుకోవడానికి మద్యమే గతి అయిందని అంటున్నారు. అందుకే ఎంగిలి కూడు కోసమే ఇలా ఉన్నఫళంగా మద్యం అమ్మకాలను తెర తీశారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఓటు బ్యాంక్ కి గండి…?

దేశంలో మిగిలిన రాష్ట్రాల సీఎంలు వేరు, ఏపీలో జగన్ తీరు వేరు. ఆయన హడావుడిగా మద్యం అమ్మకాలు ఈ సంక్షోభ వేళలో తొలి ప్రయారిటీగా చేయడం అసలు కూడని పని. ఎందుకంటే జగన్ కి ఉన్న ఇమేజ్ అలాంటిది. ఆయన తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారని పేరు. అంతే కాదు. జగన్ మహిళల కోసం మద్య నిషేధం అన్నారు. బాబు హయాంలో ఉన్న బెల్ట్ షాపులను రద్దు చేసి కొత్త పాలసీ పెట్టారు. మరో వైపు పెద్ద ఎత్తున మహిళా ఓటు బ్యాంక్ జగన్ సొంతంగా ఉంది. ఇపుడు మద్యం అమ్మకాలకు బార్లా తలుపులు తెరవడంతో వారే ఎదురుతిరుగుతున్నారు. ఎక్కడికక్కడ మద్యం దుకాణాలను అడ్డుకుంటున్నారు. జగన్ సర్కార్ మీద మండిపడుతున్నారు. ఓ విధంగా జగన్ సర్కార్ ఇది చెడ్డపేరు తెచ్దేలా ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

మంచి పేరు అలా……

కరోనా వేళలో పేదలను ఆదుకునేందుకు జగన్ ముందుకు వచ్చారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చారు. పూర్తి ఫీజు రీఎంబర్స్ మెంట్ ని ప్రవేశపెట్టి తల్లుల ఖాతాల్లో సొమ్ము వేస్తున్నారు. ప్రతీ గడపకు వేయి రూపాయల నగదు ఇచ్చారు. ఇప్పటికి మూడు సార్లు రేషన్ సరుకు ఇచ్చారు. ఇలా ఓ వైపు మంచిపేరు తెచ్చుకున్న జగన్ హఠాత్తుగా మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతించడంతో ఉన్నదంతా పోతోందని వైసీపీలోనే మధనం మొదలైంది. మరో వైపు ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఖండిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో మద్యం దుకాణాలు తెరవడం వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరుగుతుందని, పైగా డబ్బులు లేక పేదలు పస్తులు ఉంటే ఆ ఇళ్ళలోని సామాన్లు కూడా అమ్మేసి మరీ తాగుబోతులు మందు తాగుతారాని అంటున్నారు. దీంతో పేదల ఇళ్ళు గుల్ల అవుతాయని కూడా హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News