న్యాయం దక్కడంలేదా? అందడం లేదా? జాతకమే అంతేనా?

జగన్ కి న్యాయస్థానాల్లో ఎపుడూ చుక్కెదురే. ఆయన పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నపుడూ ఇదే కధ. అసలు జగన్ మీద సీబీఐ కేసులు, పదహారు నెలల జైలు ఇవన్నీ [more]

Update: 2020-04-16 02:00 GMT

జగన్ కి న్యాయస్థానాల్లో ఎపుడూ చుక్కెదురే. ఆయన పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నపుడూ ఇదే కధ. అసలు జగన్ మీద సీబీఐ కేసులు, పదహారు నెలల జైలు ఇవన్నీ చూసినపుడు ఆయన జాతకమే అలా అనుకోవాలేమో. ఆఖరుకు ముఖ్యమంత్రి హోదాలో కూడా జగన్ సీబీఐ కోర్టు ముందు నిలబడాల్సివచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పదినెలల పాలనలో జగన్ జారీ చేసిన ప్రతీ జీవోనూ కోర్టులు కొట్టేస్తున్నాయి. దీనికి తప్పు బాగా కసరత్తు చేయకుండా జీవోలు ఇవ్వడమేనన్న మాట కూడా ఉంది.

ఆప్షన్ ఇస్తే…?

ఇక జగన్ సర్కార్ పేదలకు ఆంగ్ల బోధన ఉచితంగా ప్రభుత్వ బడులలో ఇవ్వాలనుకుంది. అది మంచి ఆలోచనే. అయితే ఇక్కడ ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాల్సిందేమో. అంతే కాకుండా మేధావులు, విద్యావేత్తలు సూచించినట్లుగా ఆప్షన్ గా పెట్టాల్సిందేమో. ఇపుడు కోర్టు కూడా జీవోలు కొట్టేస్తూ అదే చెప్పుకొచ్చింది. ఇకపైన ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు తో పాటు, ఇంగ్లీష్ మీడియం ఉంచాలి. విధ్యార్ధి తనకు నచ్చిన మీడియంలో చదువుకుంటాడు. అలా కనుక చేసినట్లైతే కోర్టులు జీవోలు కొట్టేసే పరిస్థితి రాదుగా.

మొట్టికాయలతో :

ఇలా వరసగా కోర్టులు మొట్టికాయలు వేయడం, వేయించుకోవడం దేశంలో ఏ ప్రభుత్వంలోనూ జరగలేదనే చెప్పాలేమో. ఒకసారి కోర్టులో బ్రేక్ పడితే జాగ్రత్తగా ముందుకెళ్ళడానికి పాలకులు చూస్తారు. కానీ ఇక్కడ పదే పదే తొందరపాటుతో జీవోలు జారీ చేయడం కనిపిస్తోందనిపిస్తోంది. దానికి తోడు ప్రభుత్వ పక్షాన వాదనలు కూడా బలహీనంగా ఉంటున్నాయన్న విమర్శలు ఉంటున్నాయి. డిఫెండ్ చేసుకోవడంలో సర్కార్ న్యాయవాదులు వెనకబడుతున్నారన్న డౌట్లు వస్తున్నాయి. దీంతో కోర్టుల ద్వారా మొట్టికాయలు తింటూ ప్రభుత్వం అప్రతిష్టపాలు అయితే విపక్షాలకు తరచుగా జగన్ దొరికిపోతున్నారు.

అన్యాయమేనా…?

కోర్టులు స్వంతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. అక్కడకు వచ్చిన వాదనల్లో బలమైనది తీసుకుని విచక్షణతో తీర్పులు వస్తూంటాయి. అటువంటి వేళ కోర్టులు చెప్పే పాఠాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తేనే ఇలాంటి ఇబ్బందులు అధిగమిస్తారు. లేకపోతే అన్యాయంగా సర్కార్ పరువు పోతుంది. ప్రతీ దాన్ని రాజకీయం చేసేందుకు టీడీపీ తయారుగా ఉన్న వేళ జగన్ తగిన జాగ్రత్తలతో ముందుకు అడుగు వేయకపోతే ఆయన దూకుడుకు బ్రేకులు వేసే రాజ్యాంగ బద్ద సంస్థగా కోర్టులు ఎపుడూ ఉంటాయని మరచిపోరాదు. న్యాయ వ్యవస్థ ఎవరికైనా ఒక్కటే మరి. న్యాయంగా న్యాయం దక్కే మార్గాలేవో జగన్ సర్కార్ ఈ దశలో ఆలోచించాలి.

Tags:    

Similar News