వెనక్కి వెళ్లిపోతున్నారా?

ఇంట గెలిచి.. ర‌చ్చ గెల‌వాలి..! – ఇది సామెత‌. అయితే, ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యంలో ఇది సరిపోతుందా ? రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను, ప్రజ‌ల‌ను త‌న‌వైపు [more]

Update: 2019-10-22 06:30 GMT

ఇంట గెలిచి.. ర‌చ్చ గెల‌వాలి..! – ఇది సామెత‌. అయితే, ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యంలో ఇది సరిపోతుందా ? రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను, ప్రజ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో స‌క్సెస్ అయిన ఆయ‌న‌.. బ‌య‌ట నుంచి రాష్ట్రానికి చేకూరాల్సిన ప‌నుల విష‌యంలోను, నిధుల విష‌యంలోనూ ఆయ‌న దూకుడు ప్రద‌ర్శిస్తారా ? ముఖ్యంగా అటు జాతీయ స్థాయిలోనూ, అంత‌ర్జాతీయ స్థాయిలోనూ రాష్ట్రాన్ని ఇనుమ‌డింప చేస్తారా ? మేధావుల నుంచి మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర‌కు, పారిశ్రామిక వేత్తల నుంచి సామాన్యుల వ‌ర‌కు కూడా ఇవే ప్రశ్నలు వేధిస్తున్నాయి.

మార్పు కోసమే…

రాష్ట్రంలో తన‌దైన శైలిలో ప్రజ‌ల‌ను మెప్పించిన జ‌గ‌న్‌.. అధికారాన్ని కైవ‌సం చేసుకున్నారు. అయితే, కొంద‌రు చెప్పిన‌ట్టో.. లేక ప్ర‌తప‌క్షం టీడీపీ ఆరోపిస్తున్నట్టు.. ప్రజ‌లే మీ జ‌గ‌న్‌పై జాలితోనో.. సానుభూతితోనో అధికారం అప్పగించార‌ని చెప్పడానికి వీల్లేదు. ఒక మార్పును కోరుకున్నారు. రాష్ట్రాన్ని మ‌రింత దూకుడుగా ముందుకు తీసుకు వెళ్లగ‌లిగే నాయ‌కుడి కోసం త‌పించారు. ఈ క్రమంలోనే ఆల్టర్‌నేట్‌గా ఉన్న జ‌గ‌న్ కోసం వారు ఓటు వేశారు. ఇప్పుడు ఆయ‌న‌పై ఎన‌లేని బాధ్యత ఉంది. అది కేవ‌లం రాష్ట్రంలో ప్రజ‌ల సంక్షేమానికి పూచీ ప‌డ‌డంతోనే స‌రిపెడితే.. త‌క్కువే అవుతుంది.

నీతి ఆయోగ్ నివేదికతో…

రాష్ట్రాన్ని జాతీయంగా అంత‌ర్జాతీయంగా కూడా ముందుకు న‌డిపించాల్సిన అవ‌స‌రం గురుత‌ర బాధ్యత కూడా జగన్ పై ఉంది. ఇప్పుడు ఇంత‌గా ఈ చ‌ర్చ జ‌ర‌గ‌డానికి కార‌ణం ఏంటంటే.. తాజాగా నీతి ఆయోగ్ సంస్థ ఏపీకి సంబంధించి అభివృద్ధి సూచీని ప్రక‌టించింది. గ‌డిచిన ఆరు మాసాల్లో రాష్ట్రం ఒకింత వెనుక బ‌డింద‌ని సునిశితంగానే హెచ్చరించింది. పెట్టుబ‌డులు, రాష్ట్ర ఆర్థిక వృద్ధి అనే రెండు అంశాల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకున్నప్పుడు రాష్ట్రం 10పాయింట్ల వెన‌క్కి వెళ్లిపోయింద‌నే వాస్తవం అంటోంది నీతి ఆయోగ్‌. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ పాల‌న విష‌యంపై చ‌ర్చ ప్రారంభ‌మైంది.

సంక్షేమంపైనే….

గ‌డిచిన ఐదు నెల‌ల కాలంలో జ‌గ‌న్‌ను త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం ఏమీ క‌నిపించ‌డం లేదు. ఆయ‌న ప్రజ‌ల సంక్షేమానికి నిర‌ధికంగా కృషి చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ప్రజ‌ల ఆర్థిక ప‌రిస్థితిని మెరుగు ప‌రిచేందుకు పింఛ‌న్లు పెంచుతున్నారు. నిరుద్యోగంపై యుద్దం ప్రక‌టించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు త‌న‌దైన వ్యూహాన్ని ప్రక‌టించారు. రాజ‌ధాని అభివృద్ధి, పోల‌వ‌రం ప్రాజెక్టు లాంటి విష‌యాల్లో జ‌గ‌న్ ఆచితూచి అడుగులు వేస్తుండ‌డంతో చాలా మందిలో సందేహాలు ఉన్నాయి.అయితే, ఇవి ఎలా ఉన్నప్పటికీ.. జాతీయంగా, అంత‌ర్జాతీయంగా రాష్ట్రానికి మంచి పేరు రావాలంటే.. ప‌క్క రాష్ట్రాల‌తో పోటీ ప‌డాలంటే .. ఖ‌చ్చితంగా మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంది. అది కూడా ర‌చ్చ గెలిచేందుకు ఆయ‌న వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంది. లేక పోతే.. ఐదేళ్లు గిర్రున తిరిగిపోయాక చేతులు కాల్చుకున్నట్టే ప‌రిస్థితి మారిపోవ‌డం ఖాయం.

Tags:    

Similar News