చెప్పేందుకు జగన్ సిద్ధమేనా?

జగన్ ఆలోచనలు విచిత్రంగా ఉంటాయి. తనకు నచ్చని వాటిపైన ఆయన కచ్చితంగా ఉంటారు. నచ్చిన వాటి విషయంలో ఎవరేమన్నా పట్టించుకోరు. శాసనమండలి రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం [more]

Update: 2020-03-07 00:30 GMT

జగన్ ఆలోచనలు విచిత్రంగా ఉంటాయి. తనకు నచ్చని వాటిపైన ఆయన కచ్చితంగా ఉంటారు. నచ్చిన వాటి విషయంలో ఎవరేమన్నా పట్టించుకోరు. శాసనమండలి రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో జగన్ అన్న మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. శాసనమండలి ఎందుకు? అది ఉత్త దండుగ. ఏడాదికి 60 కోట్ల ఖర్చు. ఇదంతా వృధా ఖర్చు అంటూ గట్టిగా చెప్పుకొచ్చారు. నిజమే దండుగమారి వ్యవస్థలు ఉంటే రద్దు చేయాల్సిందే. పైగా పేద ప్రజల పన్నుల నుంచి కడుతున్న సొమ్ము, వారి రక్తం నుంచి పిండి వసూలు చేస్తున్న డబ్బులతో దాన‌ధర్మాలు, విలాసాలకు వెచ్చించడం ధర్మకర్తలుగా ఉన్న పాలకులకు న్యాయం కాదు. దాంతో జగన్ చెప్పిన మాటలను మెజారిటీ ప్రజలు, మేధావులు అంగీకరిస్తున్నారు.

వారి మాటేంటి…?

అదే సమయంలో వైసీపీ సర్కార్ చేస్తున్న మరో రకం దండుగ ఖర్చుల గురించి కూడా జనం ప్రశ్నిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక సలహాదారుల వ్యవస్థ బాగా పటిష్టమైంది ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ముప్పయి మందికి పైగా జగన్ కొలువులో సలహాదారులు ఉన్నారని భోగట్టా. వీరందరికీ క్యాబినెట్ ర్యాంకు హోదాలు, నెలకు లక్షల్లో జీత భత్యాలు చూసుకుంటే వెరసి తడిసిమోపెడవుతుంది. మరి ఈ సలహాదారులు ఇంత ఆర్ధిక భారంగా ఉన్నపుడు వరసపెట్టి ఎందుకు పెట్టుకోవడం అన్నది విపక్షాలతో సహా అందరి నుంచి వస్తున్న ప్రశ్న.

మరో నియామకం….

జగన్ తాజాగా రాజస్థాన్ కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ ని తన ముఖ్య ఆర్ధిక సలహాదారుగా నియమించుకున్నారు. ఆయనకు క్యాబినెట్ హోదాని కల్పించి మంచి జీతభత్యాలు కూడా సమకూర్చారు. ఇప్పటికే జగన్ కి పాలనా, రాజకీయ సలహాదారులు బోలెడు మంది ఉన్నారు. వీరితో పాటు మీడియా సలహాదారులుగా పెద్దలు ఉన్నారు. వారంతా ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. కనీసం వారి సలహాలు జగన్ కి చెబుతున్నారా అన్నది కూడా తెలియదు. చెబితే ఆయన విని ఎంతవరకూ ఆచరిస్తున్నారన్నదీ అసలు తెలియదు. ఇప్పటికి తొమ్మిది నెలలుగా సాగిస్తున్న పాలనలో సలహాదారుల నియామకాలు అదే పనిగా పెరిగిపోతున్నాయి, తప్ప వారి వల్ల ఒనగూడిన ప్రయోజనం పెద్దగా కనిపించడంలేదన్న విమర్శలూ ఉన్నాయి.

దండుగమారి అట…..

దీనిమీద విపక్ష నేత యనమల రామకృష్ణుడు తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. దండుగమారి వ్యవస్థగా సలహాదారులను పదుల సంఖ్యలో జగన్ వరసగా నియ‌మించుకుంటూ పోతున్నారని ఆయన అంటున్నారు. ఖజానాకు భారం తప్ప వారి వల్ల రాష్ట్ర‌ప్రభుత్వానికి కలసివచ్చేది లేదని కూడా అంటున్నారు. నిజమే యనమల అన్నారని కాదు కానీ జగన్ కూడా ఈ విషయంలో ఆలోచన చేసుకోవాలి. శాసనమండలి నిరుపయోగం, రాజకీయ పునరావాసకేంద్రం అని అన్న జగన్ ఇపుడు తాను స్వయంగా ఎంతోమంది రాజకీయ నిరుద్యోగులను తెచ్చి సలహాదారులుగా పెడుతున్నారని అంటున్నారు. అసలే ఖజానాకు చిల్లు పడింది. పైసా కొత్త ఆదాయం లేదు. మరి ఉన్నంతలో జాగ్రత్తగా నడుపుకోవాలి. దాన్ని విస్మరించి జగన్ చేస్తున్న ఈ వృధా ఖర్చులకు ఏదో రోజు జనం కూడా జవాబు అడుగుతారు. మరి చెప్పేందుకు సిధ్ధమేనా…?

Tags:    

Similar News