జగన్ వెనుక ఉన్నవారే ఇలా చేయిస్తున్నారా?

ప్రజలకు – ప్రభుత్వానికి వారధి మీడియా. ఇప్పుడు పార్టీ ల మీడియా రన్ అవుతున్న రోజులు కావడంతో ప్రధాన మీడియా కు అటు జనం లోనే కాదు [more]

Update: 2020-02-10 05:00 GMT

ప్రజలకు – ప్రభుత్వానికి వారధి మీడియా. ఇప్పుడు పార్టీ ల మీడియా రన్ అవుతున్న రోజులు కావడంతో ప్రధాన మీడియా కు అటు జనం లోనే కాదు ప్రభుత్వం దగ్గరా గుర్తింపు లేకుండా పోతూ వస్తుంది. సోషల్ మీడియా వచ్చాక ఛానెల్స్ కి, పత్రికలకు మరింత ప్రాధాన్యతను సర్కారీ వ్యవస్థలు తగ్గిస్తూ చిన్నచూపు చూస్తున్నాయి. తమ వ్యతిరేక పార్టీ మీడియా హాజరు కావడం వల్ల మైనస్ లే తప్ప ప్లస్ లు ఏమి ఉండవని నేరుగా మీడియా ను బహిష్కరించే చర్యలకే యంత్రాంగం దిగిపోతూ అధినేతల మనసు దోచేందుకు ప్రయత్నాలు చేయడం ప్రభుత్వ ప్రతిష్టను అల్లరి పాలు చేస్తుంది.

ఎన్టీఆర్, వైఎస్ఆర్ అలా …

ఒక పార్టీని భుజాన మోయడం ఎన్టీఆర్ టిడిపి స్థాపించిన కాలంలోనే ఈనాడు మొదలు పెట్టింది. అయితే ఆ సమయంలో ఉదయం పత్రిక ఈనాడుకు ధీటుగా రంగంలో ఉండటంతో ప్రజల్లో నిజా నిజాలు తెలుసుకునే అవకాశం ఏర్పడేది. తనకు అడ్డువస్తున్న ఉదయాన్ని తొలగించడానికి మద్యనిషేధ ఉద్యమంతో తెలివిగా ఆ పత్రిక ఆర్ధిక మూలాలలను ఎన్టీఆర్ ను అడ్డుపెట్టుకుని రామోజీ కత్తిరించగలిగారు. ఆ తరువాత మీడియా టైగర్ గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఈనాడుకు మరో పత్రిక ఆంధ్రజ్యోతి రూపంలో కలిసి వచ్చింది. ఇది ఆయన బినామీ పేపర్ అనే ప్రచారంలో నిజం ఎంత ఉన్నా లేకపోయినా ఈనాడు రాయలేని స్థాయిలో పచ్చిగా బాబుకు అడ్డొచ్చిన వారిపై బురద జల్లడమే అజండాగా మొదలైపోయింది. అయితే నాడు ఎన్టీఆర్ కానీ, వైఎస్ ఆర్ కానీ అధికారంలో వున్నా విపక్షంలో వున్నా పత్రికల అధినేతలపై విమర్శలు చేసే వారే కానీ కింది స్థాయిలో పాత్రికేయులకు ఇచ్చే గౌరవ మర్యాదలకు ఏనాడు లోటు చేయలేదు.

ట్రెండ్ మార్చిన బాబు, జగన్ …

చంద్రబాబు తొలిదఫా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అప్పుడప్పుడే రంగప్రవేశం చేస్తున్న రోజులు ఈటివి, జెమిని మాత్రమే ఆయన జమానాలో ఛానెల్స్ గా ఉండేవి. ఉదయం అప్పటికే మూత పడటంతో అటు ఈనాడు ఇటు జ్యోతి పత్రికలు బాబు అడుగేస్తే మాస్ అంటూ పతాక శీర్షికల్లో కీర్తిస్తూ ఆయనకు బ్రాండ్ కు ఇమేజ్ తెచ్చి పెట్టాయి. ఆ తరువాత ఆయన వైఎస్ చేతిలో పరాజయం చెందడానికి ముందు టివి 9 రంగంలోకి దిగడం ఆ ఛానెల్ సక్సెస్ తో ఎన్టీవీ, టివి 5, ఐ న్యూస్ అంటూ పోలోమని కొత్త సాంకేతిక ప్రభంజనం మొదలైంది. వీటిలో కూడా చంద్రబాబు తమ పార్టీ సానుభూతి పరులతో ఛానెల్స్ పెట్టించడంతో వైఎస్ ఆర్ సైతం సొంత మీడియా ఒకటి లేకపోతే బాబు చెప్పిందే నిజమని ప్రజలు భ్రమ పడతారని గుర్తించి సాక్షి మీడియా ను ప్రారంభించారు. ఎప్పుడైతే సాక్షి మొదలైందో టిడిపి చేసే ప్రచారాలకు అడుగడుగునా అవరోధాలు ఏర్పడ్డాయి. అయినా కానీ సాక్షి మీడియా ను బాబు అండ్ కో విమర్శించే వారే కానీ ముఖ్యమంత్రి పర్యటనలకు నో చెప్పింది లేదు. వైఎస్ సైతం అసెంబ్లీలోనూ, బయట కూడా బాబు మీడియా పై విమర్శలు చేసే వారే కానీ ఆ సంస్థల మీడియా ప్రతినిధులతో సఖ్యతగానే ఉండేవారు. అయితే 2014 తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ట్రెండ్ మార్చారు. తన అనుకూల మీడియా కు అసెంబ్లీ సమావేశాలవంటివి కోట్ల రూపాయల ప్రజల డబ్బు ఇచ్చి పనికి ఆహారపథకం అమలు చేశారు. ఇది తీవ్ర విమర్శలకు తెరతీసింది. ప్రభుత్వ మీడియా తో ప్రచారం చేయాలిసిన అసెంబ్లీ కార్యక్రమాలవంటివి ప్రయివేట్ వారికి ధారాదత్తం చేయడాన్ని అంతా తప్పుపట్టినా బాబు నిర్ణయమే ఫైనల్ అయ్యింది . ఆయన ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. 2019 లో అధికారం చేపట్టి ప్రస్తుతం కొనసాగుతున్న వైఎస్ జగన్ మీడియా పై మరింతగా కఠిన వైఖరి అవలంబించడం చర్చకు దారి తీస్తుంది.

వారికోసం అందరికి కట్ …

వైసిపి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి మీడియా ను వీలైనంత దూరంగానే పెడుతుంది. తెలుగుదేశం మీడియా తమ కార్యక్రమాలకు రావడం వల్ల ఒరిగే ప్రయోజనం కన్నా నష్టమే అధికమని అధినేత జగన్ కి కొందరు నూరి పోయడంతో ఆయన మీడియా తో సంబంధం లేనట్లు వ్యవహారం సాగిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. ప్రభుత్వం మీడియాపై పెడుతున్న ఆంక్షలకు ఇటీవల రాజమహేంద్రిలో జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలో గోదావరిలో కచ్చులూరు దగ్గర బోటు ప్రమాదం జరిగిన అనంతరం ముఖ్యమంత్రి రాజమండ్రి చేరుకొని రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆ కీలక సమావేశానికి మీడియా కు అనుమతి లేదని అయితే మీటింగ్ అనంతరం సిఎం మాట్లాడతారని సమాచార శాఖ అధికారులతో ప్రకటింప చేశారు. కానీ సిఎం సమావేశాన్ని ముగించి నేరుగా అమరావతి వెళ్లిపోవడంతో మీడియా వర్గాలు అవాక్కయ్యాయి. ఆయన బదులు మంత్రులు అవంతి శ్రీనివాస్,పిల్లి బోస్, కన్నబాబు తదితరులు ప్రెస్ మీట్ పెట్టి మమ అనిపించారు. నాడు ప్రమాదంపై ప్రశ్నలు ఎదుర్కొలేకే ముఖ్యమంత్రి పలాయనం అని రొటీన్ గానే టిడిపి మీడియా కు జగన్ ఐటెం గా మారిపోయారు.

కీలకమైన కార్యక్రమంలో కూడా …

దిశ పై ఎపి సర్కార్ ప్రత్యేక చట్టం రూపొందించింది. అలాగే దిశా పోలీస్ స్టేషన్ తొలిసారి రాజమండ్రిలో శ్రీకారం చుట్టింది. ఈ ప్రతిష్టాకరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి యధావిధిగా మీడియాపై ఆంక్షలు పెట్టడం అందరిని ఆక్శ్ర్యానికి గురిచేసింది. ఇక చిన్న పత్రికలు అయితే జగన్ ధోరణికి విస్తుపోయి అధికారపార్టీ అహంకారాన్ని కడిగిపారేశాయి. కొన్ని పత్రికలు అయితే ఎంట్రీ కి నో అన్నందున వార్తలు ప్రచురించడం లేదంటూ పతాక శీర్షికలు పెట్టి జగన్ గాలి తీసేశాయి. ఏవో కొన్ని పత్రికలు, ఛానెల్స్ తమకు వ్యతిరేకం అని మొత్తం వ్యవస్థపైనే కక్ష సాధింపు ధోరణి ఏమిటని ఈ వ్యవహారాలపై ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నిస్తున్నారు. జగన్ వెనుక వున్న కోటరీ ఆయన్ను తప్పుదారి పట్టిస్తుందా? లేక ముఖ్యమంత్రే తన భజన మీడియా తనకు ఉన్నందున వేరేవారు అవసరం లేదని నిర్ణయించారా? అన్నది తేలాలి. జగన్ పాదయాత్రలో లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారన్న విమర్శలు నేడు మీడియా లో మిన్నంటాయి. ఈ ధోరణి వైసిపి అధినేత మార్చుకోకపోతే ఆయనకే ఇబ్బంది అంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News