Ys jagan : అలెర్ట్ జగన్… ఇదీ గ్రౌండ్ లెవెల్ లో సీన్ పార్ట్ – 2

వైఎస్సార్ చేయలేకపోయింది జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. అదేమిటో తెలుసా? బీసీల మనసు గెలవడం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో వైఎస్సార్ బీసీల మద్దతు కూడగట్టలేకపోయినా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ [more]

Update: 2021-10-14 06:30 GMT

వైఎస్సార్ చేయలేకపోయింది జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. అదేమిటో తెలుసా? బీసీల మనసు గెలవడం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో వైఎస్సార్ బీసీల మద్దతు కూడగట్టలేకపోయినా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయగలిగారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలు తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా వారు చంద్రబాబు వెనకే నడిచారు. 2014-19 మధ్య స్వీయ రాజకీయ అస్తిత్వం కోసమో, ఆత్మ గౌరవం కోసమో, టీడీపీని మించి మేలు చేస్తాడనో …. బీసీలు జగన్ వెనుక నిలబడ్డారు. “కాపులు, బీసీల కోసమే పార్టీ పెట్టాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ను కూడా వారు నమ్మలేదు. చంద్రబాబు కి మించి మేలు చేస్తాడనే నమ్మకంతో బీసీలు వైఎస్సార్సీపీ కి ఓట్లు వేశారు. కానీ ఆ తర్వాత జరిగింది ఏమిటి?

నిధులు లేని కార్పొరేషన్లు….

నిధులు, విధులు లేని 56 కార్పొరేషన్ల ఏర్పాటు తప్ప బీసీల సామాజిక, ఆర్థిక పురోగతి కోసం ప్రభుత్వం ఏమి చేసిందనే సందేహం ఇప్పుడు బీసీలకు పట్టుకుంది. గ్రామాల్లో ఆర్థికంగా కాస్త బలంగా ఉండే యాదవులు, గౌడ్లు, పద్మశాలీలు పునరాలోచన చేస్తే.., జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని తప్పు చేశామని అయా కులాలు భావించే పరిస్థితి పార్టీ కల్పిస్తోంది. ప్రభుత్వ కులమో, ఆధిపత్య కులానికి సంబంధించిన వారికి తప్ప మిగిలిన వారికి కనీస గౌరవం, నిర్ణయాధికారం లేకపోతే చంద్రబాబుకి పట్టిన గతే పడుతుంది.

కమ్మ సామాజికవర్గం చేసిన తప్పునే….

ఓ రాష్ట్రంలో ప్రజలు, అన్ని సామాజిక వర్గాలు ముఖ్యమంత్రిగా ఓ వ్యక్తిని ఆమోదించడం అంటే, ఆ కులం పెత్తనాన్ని అంగీకరించినట్టు కాదనే సత్యాన్ని అధికార పక్షం విస్మరించింది. కమ్మ సామాజిక వర్గం చేసిన తప్పుల్ని, 35ఏళ్లుగా సమాజంలో పెంచుకున్న వ్యతిరేకతను రెడ్డి సామాజిక వర్గం అతి తక్కువ కాలంలో మూటగట్టుకుంది. ఏళ్ల తరబడి పాదయాత్ర చేసి, ప్రజల్లో తిరిగిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జనానికి దూరం అయిపోయారు.

కులాలు కొత్తేమీ కాకపోయినా?

ఆంధ్రప్రదేశ్ లో కులం ఆధారంగా రాజకీయాలు కొత్త కాదు. ఆధిపత్య కులాల నుంచి రాజకీయ నాయకులని ఆమోదించడం అనివార్యత అయ్యింది. రెండు కులాల చేతుల్లోనే సంపద పోగుబడి ఉండటం దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం కాపులు కూడా కలిసికట్టుగా పోరాడాలని భావిస్తున్నారు. ఇవి ఫలిస్తాయో లేదో పక్కన పెడితే., చంద్రబాబు తన వల్ల, తన సామాజిక వర్గం వల్ల జరిగిన పొరపాటులు మరోమారు జరగవని చెబితే, గతంలో జరిగిన వాటికి విచారం వ్యక్తం చేస్తే ఏమవుతుంది. అందరికీ అవకాశాలు, ప్రాధాన్యత ఇస్తామని చెబితే ఆ ప్రభావం జనంలో ఖచ్చితంగా ఉంటుంది.

మతంపై జరుగుతున్న….

జగన్మోహన్ రెడ్డి అమలు చేసే పథకాలు అన్నింటికి ప్రజామోదం లేదు. ఆంధ్రప్రదేశ్ లో విద్యా బోధన-మతం విషయాల్లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాల నుంచి అందుతోన్న సహకారం అడ్డగోలుగా నిలిచిపోయింది. విద్యా రంగంలో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు సాధించిన అభివృద్ధికి ఎయిడెడ్ సంస్థల సహకారం గణనీయమైనది. తాజాగా ఆంద్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను అవి మతంపై జరుగుతున్న దాడులుగానే భావిస్తున్నాయి. ఇందుకు వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు.

బందీ అయిపోయి…

జనానికి కాదు ఉద్యోగులకు, అధికారులకు కూడా జగన్ దూరం అయ్యారు. చుట్టూ ఉండే ఐదారుగురి చేతిలో ముఖ్యమంత్రి కార్యాలయం బందీ అయిపోయింది. బహిరంగ సభల్లో ఏ విషయం మీదైనా అలవోకగా స్పందించే నేర్పున్న ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు మైక్ చెక్ చేయడానికి కూడా సందేహిస్తున్నారు ఎందుకు. చేసింది ఏమిటో జనానికి చూపించిన తర్వాతే జనంలోకి రావాలి అనుకోవడం బాగానే ఉన్నా, ఇప్పుడు జనానికి చెప్పాల్సిన సమాధానాలు చాలా ఉన్నాయి.

ఆ భరోసా ఉందా?

కోటి కుటుంబాలకు ఐదేళ్లలో కనీసం లక్ష రూపాయల నగదు బదిలీ అవుతుంది. ఒక్కో కుటుంబంలో నాలుగైదు ఓట్లు లెక్కన 60-70శాతం ఓట్లు అయినా ఖచ్చితంగా వైఎస్సార్ సీపీకే దక్కుతాయి అనే భరోసా ఉందా? సహజమైన వ్యతిరేకత కారణంగా కొన్ని సీట్లు తగ్గుతాయి అనుకున్నా అవి ఎన్నో ఖచ్చితంగా చెప్పే పరిస్థితి ఉందా? ఇవన్నీ ఆలోచించుకోకుండా ముందుకు సాగితే అంతే సంగతులు.

 

– సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ

Tags:    

Similar News