Ys jagan : వాళ్లు వ్యతిరేకమయితే… కష్టాన్ని కొని తెచ్చుకున్నట్లే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు రానున్న రోజులు ఇబ్బంది కలిగించేవే. ఎన్నికల సమయం కావడంతో అన్ని రకాల డిమాండ్లు ముందుకు వస్తాయి. ప్రతి వర్గం నుంచి ఏదో [more]

Update: 2021-10-13 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు రానున్న రోజులు ఇబ్బంది కలిగించేవే. ఎన్నికల సమయం కావడంతో అన్ని రకాల డిమాండ్లు ముందుకు వస్తాయి. ప్రతి వర్గం నుంచి ఏదో ఒక డిమాండ్ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఎన్నికల సీజన్ కాబట్టి వారిని సంతృప్తి పర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కాపు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమ కార్యాచరణను కాపు సంక్షేమ సేన సిద్ధం చేసింది. దీంతో పాటు ఉద్యోగులు కూడా కదం తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు.

ఎన్నికల్లో కీలకంగా….

ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో కీలకంగా మారతారు. వారి మౌత్ పబ్లిసిటీతో అధికారంలోకి తేగల సత్తా ఉద్యోగులకు ఉంది. లక్షల సంఖ్యలో ఉన్న ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల ప్రభావం కూడా ఎన్నికల ఫలితాలపై కన్పిస్తుంది. గత ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉద్యోగులు పనిచేశారు. పని వత్తిడి, బదిలీలు వంటివి సాధారణంగా వారిలో అసంతృప్తిని రేకెత్తిస్తాయి. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనాతో పెద్దగా పనిలేదనే చెప్పాలి.

జీతాలు సకాలంలో రాక…

ఇక సచివాలయానికి కూడా మంత్రులు, ముఖ్యమంత్రి రాకపోవడంతో పని భారం కూడా తగ్గింది. అయితే ఉద్యోగులు ఎన్నికల వేళ తమ డిమాండ్లను సాధించేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా ఉద్యోగుల్లో జీతాల చెల్లింపుపై అసహనంతో ఉన్నారు. ఏ నెల ఒకటో తేదీన జీతాలు అందిన పాపాన పోలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వోద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపులు ఏపీలో ఆలస్యంగా జరుగుతున్నాయి.

ఆర్థిక ఇబ్బందులు ….?

వీరి ప్రధాన డిమాండ్ జీతాలు, పింఛన్లు సకాలంలో చెల్లించాలని. 11వ పీఆర్సీనీ వెంటనే ప్రకటించాలని కోరుతున్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్టు సిబ్బందిని పర్మినెంట్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. వీరితో ప్రభుత్వం చర్చలను ప్రారంభించింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులను సంతృప్తిపర్చేలా వారి డిమాండ్లను నెరవేర్చడం సాధ్యమయ్యే పనికాదు. ఖజానాకు భారం పడే ఏ పనినీ ప్రస్తుతం ప్రభుత్వం చేయలేని స్థితిలో ఉంది. మరి ఉద్యోగుల సమస్యలను జగన్ ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.

Tags:    

Similar News