Ys jagan : ఈ కాంబినేషన్ తో ఈక్వేషన్ మారుతుందట

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇక రోజురోజుకూ హీట్ గానే ఉంటాయి. వచ్చే ఎన్నికలకు జగన్ అంతా ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు. మరోసారి గెలుపునకు అందరిని ఒంటిచేత్తో ఎదుర్కొనేందుకు [more]

Update: 2021-10-16 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇక రోజురోజుకూ హీట్ గానే ఉంటాయి. వచ్చే ఎన్నికలకు జగన్ అంతా ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు. మరోసారి గెలుపునకు అందరిని ఒంటిచేత్తో ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. తాను ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఈసారి కూడా సంకేతాలు ఇచ్చారు. విపక్షాలు ఎన్ని కలసి వచ్చినా తనకు భయం ఎంతమాత్రం లేదని ఆయన చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి 2019 ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారాన్ని జనంలోకి పంపనున్నారు.

రహస్య ఒప్పందం…

తొలి నుంచి పవన్ కల్యాణ‌్, చంద్రబాబు మధ్య రహస్య ఒప్పందం ఉందని వైసీపీ ప్రచారం చేస్తూనే ఉంది. పవన్ ను బాబు రహస్య మిత్రుడిగా 2019 ఎన్నికలకు ముందు జోరుగా ప్రచారం చేసింది. వైసీపీ సోషల్ మీడియాతో పాటు జగన్ తన పాదయాత్రలోనూ పదే పదే ఇదే చెప్పారు. మరో వైపు ప్రశాంత్ కిషోర్ టీం కూడా సోషల్ మీడియాలో దీనిని బాగానే ప్రచారం చేసింది. పవన్ కు ప్యాకేజీ అందిందని కూడా వైరల్ చేసింది. దీంతో పవన్ కల్యాణ‌ టీడీపీతో కలసి పోటీ చేయకున్నా జనం దానినే నమ్మారు. ఫలితంగా మిగిలిన సామాజికవర్గాలన్నీ ఏకమై జగన్ కు అండగా నిలిచాయి.

బీసీ ఓటు బ్యాంకును…

పవన్ కల్యాణ్ కారణంగానే బీసీలు తమకు దూరమయ్యారన్న ప్రచారం టీడీపీలో జోరుగా జరుగుతోంది. కాపు, కమ్మ కాంబినేషన్ గత ఎన్నికల్లో వర్క్ అవుట్ కాలేదనే నేతలు కూడా ఉన్నారు. అందుకే ఇటు పవన్, అటు చంద్రబాబు ఇద్దరూ రాజకీయంగా నష్టపోవాల్సి వచ్చిందని, కాపు, కమ్మలకు వ్యతిరేకంగా ఉన్న బీసీలందరూ గంపగుత్తగా వైసీపీకి అండగా నిలిచారంటున్నారు. ఈసారి ఆ తప్పు చేయవద్దని చంద్రబాబుకు కొందరు నేతలు సూచించినట్లు తెలిసింది. అయినా చంద్రబాబుకు మాత్రం ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. ఈసారి పొత్తులతోనే వెళతారంటున్నారు.

బీసీలకు మరింత ప్రాధాన్యత….

ఇప్పుడు జగన్ తన వైపు ఉన్న బీసీ ఓటు బ్యాంకును చెక్కు చెదరకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కంటే బీసీలకు ప్రాధాన్యత ఇస్తునారన్న ముద్ర జగన్ పై పడింది. దానిని మరింత స్థిరంగా చేసుకోవాలి. ఈసారి జనసేన, టీడీపీ కలిసినా పెద్దగా ఇబ్బంది ఉండబోదన్న క్యాలిక్యులేషన్ లో వైసీపీ నేతలు ఉన్నారు. కేవలం పది నుంచి పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వాటి ప్రభావం ఉంటుందట. ఎటూ మళ్లీ ప్రశాంత్ కిషోర్ టీం ఉండనే ఉంది. అందుకే బీసీ కార్డును జగన్ మంత్రివర్గ విస్తరణలోనూ, రానున్న ఏపదవుల్లోనైనా ఉపయోగిస్తారంటున్నారు.

Tags:    

Similar News