మొత్తానికి జగన్ ని విలన్ని చేశారు… ?

జగన్.. ది హీరో అని నీరాజనాలు పట్టింది ఒకనాడు తెలుగు జనం. ఆయన అడుగులకు మడుగులు ఒత్తింది ఉమ్మడి రాష్ట్ర ప్రజానీకం. జగన్ నుదుటిన కుంకుమ బొట్టు [more]

Update: 2021-09-15 14:30 GMT

జగన్.. ది హీరో అని నీరాజనాలు పట్టింది ఒకనాడు తెలుగు జనం. ఆయన అడుగులకు మడుగులు ఒత్తింది ఉమ్మడి రాష్ట్ర ప్రజానీకం. జగన్ నుదుటిన కుంకుమ బొట్టు దిద్ది చెల్లెలు మంగళ హారతులు పడితే తల్లి విజయమ్మ విజయీభవ అని దీవించింది. అలా కుడి ఎడమలుగా ఇంటి ఆడ‌వారు అండగా ఉండగా రచ్చ గెలిచారు జగన్. అంతా కోరుకున్నదే జరిగింది. జగన్ కి అధికారం చేతిలోకి వచ్చింది. మరి అంతా కలసి విజయ దరహాసాలతో కులాసా చేయవచ్చు కదా. కానీ ఇపుడు ఇంట రచ్చ సాగుతోంది. జగన్ రచ్చ గెలిచేశారు కానీ ఇంట గెలవలేకున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వైఎస్ ఇంటి లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక కానీ ఉన్న మగ దిక్కు జగన్ వేరుపడిపోయారు అని మాత్రం జనాలకు అర్ధమయ్యేలా తల్లీ చెల్లెళ్ళ రాజకీయం సాగుతోంది.

విపక్షాలకు ఎలాగూ…?

జగన్ ఏపీలోని విపక్షాలకు ఎలాగూ విలనే. ఆయన్ని వారు ఎపుడూ మెచ్చరు. వీలుంటే గిచ్చుతారు కూడా. కానీ ఇంటి ఆడవాళ్ళకు కూడా జగన్ విలన్ అయిపోయాడా అన్నదే చర్చగా ఉంది. జగన్ విజయమ్మ, షర్మిలమ్మ గ్రూప్ ఫోటోని చాన్నాళ్ళకు ఇడుపులపాయ వద్ద పెద్దాయన‌ సమాధి వద్ద అంతా చూశారు కానీ తేడా బాగానే కనిపిస్తోంది. అన్నా చెల్లెళ్ళ మధ్య అగాధం ఏర్పడింది అనడానికి బలమైన సంకేతాలు అక్కడే కనిపించాయి. ఆ మీదట విజయమ్మ షర్మిలమ్మ కలసి హైదరాబాద్ లో వైఎస్సార్ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడికి వచ్చి మాట్లాడిన వారిలో అత్యధికులు నిత్యం జగన్ తో పేచీలు పడుతున్న వారే ఉన్నారు. వారంతా వైఎస్సార్ ని ఆహా ఓహో అంటున్నారు. అదే సమయంలో ఆయన ఆశయాలు నెరవేర్చుతున్నానని చెప్పుకుంటున్న జగన్ మాత్రం వారికి విలన్ గానే కనిపిస్తున్నారుగా.

జగన్ మీద యుద్ధమే…

ఇలాంటి సన్నివేశాలు చూసిన మీదటనే కాబోలు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఒక పిలుపు ఇచ్చేశారు. జగన్ మీద తల్లీ చెల్లి యుద్ధం చేయాలని ఆయన గట్టిగా కోరుకున్నారు. జగన్ ఏపీ జనాలతో పాటు ఇంటి ఆడవాళ్ళకు కూడా అన్యాయం చేశాడు కాబట్టి ఆయన అరాచక పాలనకు స్వస్తివాచకం పలకడానికి విజయమ్మ, షర్మిలమ్మ నడుం కట్టాలని, ఏపీ వీధుల్లో కదం తొక్కాలని వర్ల రామయ్య కోరుకుంటున్నారు. ఆనాడు జగన్ మంచి చేస్తాడు అని ఊరూరా తిరిగి గెలిపించిన ఈ ఇద్దరే ఇపుడు ఆయన ఏమీ చేయలేదు అని చెబితే జనాలకు బాగా అర్ధమవుతుందని కూడా వర్ల అంటున్నారు.

ఇబ్బందికర‌మే…?

అటు చూస్తే జగన్ అధికారంలో ఉన్నారు. మరో వైపు ఆయనే వైఎస్సార్ తరువాత ఆయన కుటుంబానికి పెద్ద. అటువంటి జగన్ ఒక వైపు ఉంటే తల్లీ చెల్లి మరో చోట ఉన్నారు. సాదా సీదా జనాలకు ఈ సన్నివేశం ఏమని సందేశం ఇస్తుందో అంతా ఇట్టే ఊహించుకోగలరు. జగన్ తన ఇంటి వాళ్ళను కరివేపాకుల మాదిరిగా పక్కన పడేశారు అన్నదే అంతా అనుకుంటారు. జగన్ కూడా తన పంతం అనుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ ఇక్కడ సింపతీ యాంగిల్ ఒకటి ఉంటుంది. అది కచ్చితంగా విజయమ్మ, షర్మిలమ్మ వైపే ఉంటుంది. వారు ఆడవారు, పైగా వైఎస్సార్ లో సగమైన విజయమ్మ, ముద్దుల తనయ షర్మిలమ్మ కంట కన్నీరు ఒలుకుతూంటే జగన్ మాత్ర అధికార విలాసాలతో కులాసా చేస్తున్నారు అని జనం ఆడిపోసుకుంటే తప్పేంటి. మొత్తానికి జగన్ ని జనంలో విలన్ చేద్దామనుకున్న విపక్షాల యత్నాలు ఎంతవరకు ఫలించాయో తెలియదు కానీ వైఎస్సార్ ఇంటి ఇంతులే తమదైన రాజకీయంతో ఒక్క దెబ్బకు విలన్ని చేసి పారేశారు అనుకోవాల్సిందే.

Tags:    

Similar News