జగన్ అలా ప్రకటించారో? లేదో?

విశాఖ రాజధాని అని ఎపుడైతే జగన్ ప్రకటించారో నాటి నుంచి ఒక్కలా టీడీపీ తమ్ముళ్ళు తమదైన విష ప్రచారం చేస్తున్నారు. విశాఖలో విలువైన భూములు ఉన్నాయని, వాటిని [more]

Update: 2020-01-19 03:30 GMT

విశాఖ రాజధాని అని ఎపుడైతే జగన్ ప్రకటించారో నాటి నుంచి ఒక్కలా టీడీపీ తమ్ముళ్ళు తమదైన విష ప్రచారం చేస్తున్నారు. విశాఖలో విలువైన భూములు ఉన్నాయని, వాటిని కొట్టేయడానికే ఇలా రాజధానిని అటు వైపు తీసుకుపోతున్నారని గోల గోల చేస్తున్నారు. నిజానికి విశాఖలో ఉన్న భూములు ఎన్ని, కబ్జాలు జరిగాయి? నిజంగా భూదందా అక్కడ జరుగుతుందా? అసలు ఆ అవకాశాన్ని టీడీపీ తమ్ముళ్ళు వైసీపీకి ఇచ్చారా అన్నది దాని మీద వాడి వేడిగా చర్చ సాగుతోంది. కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, హుదూద్ తుఫాన్ 2014లో విశాఖను ముంచేసింది. తీరానికి ఆనుకుని ఉన్న నగరం కావడంతో చిగురుటాకులా వణికిపోయింది. కొండలు ఉండబట్టి రాక్షల గాలులను తట్టుకుని నగరం నిలబడిందని అంటారు. హుదూద్ ని విశాఖ జనం ఒక శాపంగా పరిగణిస్తే అప్పటి అధికార పార్టీకి చెందిన కొందరు పసుపు తమ్ముళ్ళు మాత్రం వరంగా భావించారు.

మొత్తం హాంఫట్…

అంతే మొత్తం భూములను ఎక్కడికక్కడ చెరపట్టారు. ఇందులో ప్రభుత్వం, ప్రైవేట్, అసైన్డ్ భూములు అన్న తేడా లేదు, పేదలు, స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన భూములు అన్న భేదం అంతకంటే లేదు. భూములను యధేచ్చగా దోచుకుని ఆ పాపం మాత్రం హుదూద్ మీదకు నెట్టేశారు. హుదూద్ తుఫాన్ వల్ల మొత్తం భూముల రికార్డులన్నీ గల్లంతు అయ్యాయని తెలివిగా నాటి రెవిన్యూ అధికారుల చేత చెప్పించారు హుదూద్ వల్ల చెట్లు కూలడం, విద్యుత్ స్థంభాలు పడిపోవడం వంటివి మాత్రేమే జరిగాయి. కానీ ఒక్క భూముల రికార్డులు తప్ప అంతా భద్రంగానే ఉందని అంటేనే నమ్మబుద్ధి కావడంలేదు. అప్పటికి సరిగ్గా ఆరునెలలు అయింది టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి. అయినా సరే హుదూద్ పేరు చెప్పి భూమిని చాపలా చుట్టేసి పట్టేసే భూదందాలకు తెరలేచిపోయింది. ఏపీలోనే అతి పెద్ద భూ స్కాంగా ఇప్పటికీ అది ఉంది. వేలాది ఎకరాలు, వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది.

వాళ్ళే చెబుతున్నారుగా….

దీని మీద సిట్ విచారణ నాడు టీడీపీ హయాంలో జరిగింది, నివేదిక లేదు, నేడు వైసీపీ వచ్చాక మరో విచారణ జరుగుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ రాజధాని కనుక వస్తే భూదందా జరుగుతుందట, మొత్తం భూములు పోతాయట. ఈ మాటలు అంటున్నది ఎమ్మెల్సీగా ఉన్న టీడీపీ నేత దువ్వారపు రామారావు, ఇక నాటి సొంత సర్కార్లోని సిట్ వేసినపుడే విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సైతం రాజధాని వస్తే విశాఖ భూములన్నీ కొల్లగొడతారని అంటున్నారు.

ఎక్కడ ఉన్నాయి స్వామీ….

నిజమే భూములు ఉంటే కొల్లగొట్టేవారో, ఏమైనా కట్టేవారో. అసలు భూములు ఎక్కడ ఉన్నాయి స్వామీ అంటున్నారు వైసీపీ నేతలు, మొత్తం కాజేశారుగా, భూ దందాల పేరిట నొక్కేశారుగా అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. సెంటు జాగా కూడా మిగల్చకుండా మింగేశారని, ఇపుడు తగుదునమ్మా అని తమ్ముళ్ళు కబుర్లు చెబుతూ రాజధానిని అడ్డుకోవడానికి చూస్తున్నారని వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు లాంటి వారు అంటున్నారు. మొత్తానికి తమ్ముళ్ళ లాజిక్ భలేగా ఉంది. నాడు భూ దందాకు హుదూద్ పనికివచ్చింది. ఇపుడు రాజధానిని అడ్డుకోవడానికి ఇదే భూ దందా పనికివస్తోంది.

Tags:    

Similar News