జగన్ గేర్ మార్చింది అందుకేనా… ?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అన్నది తెలిసిందే. మోడీ సర్కార్ కి అన్ని విధాలుగా సహకరించిన జగన్ నుంచి ఒక ఘాటు లేఖ వస్తుందని బహుశా [more]

Update: 2021-06-05 08:00 GMT

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అన్నది తెలిసిందే. మోడీ సర్కార్ కి అన్ని విధాలుగా సహకరించిన జగన్ నుంచి ఒక ఘాటు లేఖ వస్తుందని బహుశా ఎన్డీయే పెద్దలు కూడా ఊహించి ఉండరు. జగన్ కొత్త సీఎం, పైగా ఏపీ కొత్త రాష్ట్రం, నిధులు లేని రాష్ట్రం, అందువల్ల జగన్ అన్ని విధాలుగా తమతో కలసి రావాల్సిందే అన్న లెక్కలు మోడీ షాలకు ఉన్నాయి. పైగా ఏపీలో రాజకీయ గండరగండడుగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి జగన్ కచ్చితంగా తమ వైపే ఉంటారని కూడా బీజేపీ పెద్దలు అంచనాలు వేసుకున్నారు. కానీ కధ మొత్తం అడ్డం తిప్పేసేలా జగన్ ఇపుడు గేర్ మార్చేశారు.

లేఖ మాటున…?

వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం పెత్తనం చేస్తూ అన్ని రాష్ట్రాలకు తీరని అన్యాయమే చేస్తోంది అన్నది విపక్ష సీఎం ల మాట. జగన్ మాత్రం ఇంతవరకూ దాని మీద ఎక్కడా పెదవి విప్పలేదు. పైగా ఆయన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని మోడీ మీద ఈ మధ్యనే కొన్ని హాట్ కామెంట్స్ చేస్తే వద్దు అని చెప్పిన పెద్ద మనిషి. హఠాత్తుగా జగనే కేంద్రం విధానాలను ప్రశ్నించేందుకు విపక్ష సీఎంలు అంతా ఏకం కావాలని పిలుపు ఇవ్వడం వెనక రాజకీయం ఏంటన్నది ఎవరికీ అంతు పట్టడంలేదు. దాంతో అంతా జుట్టు పీక్కుంటున్నారు.

ఇదీ వ్యూహం…..?

కేంద్రంలోని బీజేపీ సర్కార్ కి కొన్ని అంశాల్లో మద్దతు ఇచ్చిన జగన్ ఆ పార్టీతో ఎపుడూ కలసి సాగలేదు. అలా సాగలేరు కూడా. ఆయన ఓటు బ్యాంక్ వేరు, బీజేపీ పొలిటికల్ ఫిలాసఫీ వేరు. పైగా బీజేపీకి ఏపీలో టీడీపీ అంటే మోజు ఉన్న మాట వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా కూడా వచ్చే ఎన్నికలకు ముందు ఏపీలో బీజేపీ టీడీపీ కలవడం ఖాయం. ఈ విషయంలో ఏపీ బీజేపీ నేతలు చేయాల్సింది అంతా చేస్తారు. అందుకే ముందే ఆ ముసుగుని తొలగించాలని జగన్ ఇలా లేఖ రూపంలో దూసుకువచ్చారని అంటున్నారు. గుడ్డి కన్ను తెరచినా మూసినా ఒక్కటే అన్న తీరునా కేంద్రంలోని మోడీ సర్కార్ కి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏపీ గతి ఏ మాత్రం మారలేదు అన్నది వాస్తవం. అందుకే జగన్ డేరింగ్ గానే ఈ స్టెప్ తీసుకున్నారు అంటున్నారు.

బండ వారి మీదే …?

అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎటూ మెజారిటీ రాదు అని జగన్ కి లెక్కలేవో ఉండి తీరాలన్న మాట. అలాగే జాతీయ స్థాయిలో విపక్ష కూటమి వైపుగా ఆయన అడుగులు పడుతున్నాయి అనుకోవాలేమో. ఇక మరో వైపు చూసుకుంటే వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలకు పంపిణీ బాధ్యతలు అప్పగించి వారిని జనంలో దోషులుగా బీజేపీ నిలబెడుతోంది. దాంతో తమ చేతిలో లేని వ్యవహారానికి తాము ఎందుకు బలి అవ్వాలన్న ఆలోచనతోనే జగన్ తెలివిగా ఈ వ్యాక్సినేషన్ మీద తలెత్తుతున్న జనాల అసహనాన్ని కేంద్రం మీదకు మళ్ళించేందుకే లేఖ రాశారని అంటున్నారు. మొత్తానికి మోడీ సర్కార్ కి జగన్ మద్దతు అన్నది ఇక మీదట ఉంటుందా లేదా అన్నది భవిష్యత్తులో జరిగే పరిణామాలే చెప్పాలి. ఏది ఏమైనా మోడీకి, బాబుకూ ఒకేసారి జగన్ షాక్ ఇచ్చేశారు అంటున్నారు.

Tags:    

Similar News