స్టాలిన్ వచ్చి జగన్ ను దెబ్బతీశాడే?

తమిళనాడు రాజకీయాలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఇబ్బందిగా మారనున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమిళ నేతలు తమ రాష్ట్రంలో తీసుకు వచ్చారు. [more]

Update: 2021-05-28 06:30 GMT

తమిళనాడు రాజకీయాలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఇబ్బందిగా మారనున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమిళ నేతలు తమ రాష్ట్రంలో తీసుకు వచ్చారు. అయితే స్టాలిన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన అమలు పర్చే విధానాలు జగన్ పాలనను ప్రశ్నించే విధంగా ఉన్నాయి. అంబులెన్స్ లు, వాలంటీర్ల వ్యవస్థ, ఇంటికే రేషన్ వంటి పథకాలు జగన్ ఇమేజ్ ను పెంచాయి.

అమ్మ క్యాంటిన్లు….

అయితే స్టాలిన్ వచ్చిన తర్వాత అమ్మ క్యాంటిన్లను కంటిన్యూ చేస్తామని చెప్పడం, జయలలిత ఫొటోలను ధ్వంసం చేసిన తమ పార్టీ వారిపై నే చర్యలు తీసుకోవడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలోని ప్రతిపక్ష టీడీపీకి స్టాలిన్ అస్త్రాలు సమకూర్చినట్లయింది. ఏపీలోనూ అన్న క్యాంటిన్లు చంద్రబాబు హయాంలో ఉన్నాయి. ఐదు రూపాయలకే భోజనంతో పేదల కడుపు నిండేది.

టీడీపీకి వాయిస్….

కానీ జగన్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటిన్లను మూసివేశారు. దీనిపై విపక్ష తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేసినా జగన్ వెనకడుగు వేయలేదు. తమిళనాడులో స్టాలిన్ అమ్మ క్యాంటిన్లను కొనసాగిస్తానని చెప్పడంతో టీడీపీ జగన్ పై ధ్వజమెత్తుతోంది. పేదల కడుపు నింపే అన్నా క్యాంటిన్లను తిరిగి తెరవాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. కక్ష పూరితంగానే అన్నా క్యాంటిన్లను జగన్ మూసివేశారని టీడీపీ ఆరోపిస్తుంది.

అఖిలపక్ష సమావేశం కూడా…?

ఇక స్టాలిన్ విపక్ష పార్టీలను కూడా కలుపుకుని వెళుతున్నారు. కరోనా నియంత్రణ కోసం అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. ఇది కూడా జగన్ కు ఇబ్బందికరంగా మారింది. ఏపీలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని అన్ని విపక్షాలు కోరుతున్నా జగన్ పట్టించుకోవడం లేదని టీడీపీ విమర్శలు చేస్తుంది. ఇలా పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు జగన్ కు ఇబ్బందికరంగా మారాయి. స్టాలిన్ ఇమేజ్ పెరగిందని, జగన్ చరిష్మా తగ్గిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News