జగన్ చిత్తశుద్ధి గంగపాలవుతోందా?

నాయకుడిని జనం నమ్ముతారు అంటే నోటి మాట మీదనే. అలా విశ్వసనీయత పెంచుకున్న వారే పది కాలాల పాటు ప్రజా నాయకులుగా వెలుగొందుతారు. జగన్ పదేళ్ల పాటు [more]

Update: 2021-06-03 15:30 GMT

నాయకుడిని జనం నమ్ముతారు అంటే నోటి మాట మీదనే. అలా విశ్వసనీయత పెంచుకున్న వారే పది కాలాల పాటు ప్రజా నాయకులుగా వెలుగొందుతారు. జగన్ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన పదే పదే విశ్వసనీయత అన్న పదం వాడుతూ ఉండేవారు. రాజకీయాల్లో కావాల్సిన ముడి సరకు కూడా అదే అని కూడా చెప్పుతూ ఉండేవారు. ఇక జగన్ సీఎం అయి రెండేళ్ళు అవుతోంది. మరి ఆయన ఎంత వరకూ తన కమిట్ మెంట్ ని రుజువు చేసుకుంటున్నారు అన్నదే చర్చ.

ఒక వైపు అలా…?

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దు అని జగన్ గట్టిగానే నినదిస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు ప్రధానికి ఆయన దీని మీద లేఖ కూడా రాశారు. అవకాశం ఇస్తే అఖిలపక్షంతో వచ్చి కలుస్తాను అని కూడా ప్రధానికి రాసిన లేఖలో పేర్కోన్నారు. సరే జగన్ తప్పు లేకుండా ఆ విషయంలో చూసుకున్నారు, పైగా ఉక్కు కార్మికులతో ఆయన స్వయంగా మాట్లాడి కొంత భరోసాను ఊరటను ఇచ్చారు. అంతా బాగానే ఉన్న నేపధ్యంలో మధ్యలో ఆదానీ సడెన్ గా దూసుకుని వచ్చేశారు. ఆయన రాకతోనే మళ్లీ కొత్త తికమక వస్తోంది.

పక్కనే కుంపటి ….

నిజానికి ఆదానీ ఇంతింతై వటుడు ఇంతై అన్నట్లుగా గంగవరం పోర్టులో మొత్తం వాటాలను కొనేసి అది తనదే అనిపించేసుకున్నారు. ఈ గంగవరం ప్రైవేట్ పోర్టుకి బీజం వేసింది కూడా నాడు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లోనే. అప్పట్లోనే స్టీల్ ప్లాంట్ భూముల్లో కొంత ఇచ్చి మరీ పోర్టు కు సహకరించారు. మరి ఈ జల రవాణా విషయంలో ఉక్కుకు ఆ మేరకు రాయితీ ఉండాలిగా. అంటే లేదు కానీ ఇంకా ఎక్కువగానే వసూల్ చేస్తున్నారు. అది అలా ఉంచితే గంగవరం పోర్టుతోనే కధ ముగిసిపోలేదు, ఏకంగా ఉక్కు కర్మాగారాన్నే ఎగరేసుకుపోతాను అని అదానీ గ్రూప్ అంటోంది. దానికి తగినట్లుగా కేంద్రం పావులు కదుపుతూంటే ఇపుడు జగన్ సర్కార్ కూడా అదే అదానీకి హెల్ప్ చేస్తున్నారు అంటూ భగ్గుమంటోంది ఉక్కు కార్మిక లోకం.

సెంట్ పర్సెంట్ గా ….

ఇక గంగవరం పోర్టులో మిగిలింది కేవలం రాష్ట్ర ప్రభుత్వం పది శాతం వాటానే. దాన్ని కూదా అదానికి తెగనమ్మి సెంట్ పర్సెంట్ ప్రైవేట్ పోర్టు గా దాన్ని తయారు చేస్తున్నారు అని కార్మిక నాయకులు మండిపోతున్నారు. ఒక వైపు జగన్ స్టీల్ ని ప్రైవేట్ పరం కానివ్వమని చెబుతూ ఆదానికి సాయం చేయడం లో అర్ధమేంటని కూడా వారు నిలదీస్తున్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వ వాటా అయినా ఉంచితే కొంతలో కొంత గంగవరం పోర్టు మీద ఆశలు కలుగుతాయని అంటున్నారు. అయితే ఆదానీ గ్రూప్ తక్కువ తినలేదు, పైగా దేశంలోని పాలకులు అంతా అదానీకి రెడ్ కార్పెట్ పరుస్తున్న నేపధ్యంలో జగన్ సర్కార్ కూడా జై అనే అంటోంది. ఇలాగైతే విశాఖ ఉక్కు దక్కినట్లే అని కూడా ఫైర్ అవుతున్నారు. మరి ఇక్కడే జగన్ చిత్తశుద్ధి సందేహాస్పదం అవుతోంది. ఇదేనా జగన్ మార్క్ విశ్వసనీయత అంటే సమాధానం ఏంటో చూడాలి.

Tags:    

Similar News