లొకేషన్ ఛేంజ్ చేస్తారా ?

రాజకీయాల్లో సాగినంతసేపే మిత్రులు. అంతవరకే సైలెంట్ గా ఉంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా లోకేషన్ చేంజ్ అనేస్తారు. ఏపీలో రాజకీయాలు చూసుకుంటే రెండు బలమైన ప్రాంతీయ [more]

Update: 2021-05-15 00:30 GMT

రాజకీయాల్లో సాగినంతసేపే మిత్రులు. అంతవరకే సైలెంట్ గా ఉంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా లోకేషన్ చేంజ్ అనేస్తారు. ఏపీలో రాజకీయాలు చూసుకుంటే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతానికి మోడీకి జై కొడుతున్నాయి. అయితే ఇందులో ఉండ్రాళ్ల మీద భక్తి తప్ప మోడీ సార్ మీద ఎవరికీ అసలైన భక్తి లేదూ అనే అంటారు. మోడీకి ఎదురు చెప్పకపోవడం వెనక చంద్రబాబు, జగన్ లకు ఎవరి రీజన్లు వారికి ఉన్నాయి. అయితే ఇలాగే ఎల్లకాలమూ ఉంటుందని ఎవరూ చెప్పలేరు. మోడీ కి దేశంలో క్రేజ్ తగ్గుతోంది అని జనం నాడి బయటపడిన నాడు అర్జంటుగా క్యాంపులు కూడా మారిపోతాయనే అంటున్నారు.

వెయిట్ చేస్తున్నారు….

అటు చంద్రబాబు గురించి ముందుగా చెప్పుకుంటే ఆయనకు జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు చాలానే ఉన్నాయి. 2019 ఎన్నికల వేళ విపక్ష నేతలను అందరినీ కలిపే అనుసంధానంగా ఆయన నిలిచారు. అంతకు రెండు దశాబ్దాల ముందు కూడా దేశ రాజకీయాలను మలుపు తిప్పిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. అలా కనుక చూస్తే బాబు ఇపుడు దేశ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నారు అని చెప్పాలి. ఆయనది ఏపీలో ఒంటరి పోరుగా ఉంది. జగన్ ని బలంగా ఢీ కొట్టాలంటే అటు బీజేపీ దారిలోకైనా వెళ్ళాలి, లేదా ఆయనకు వ్యతిరేకత ఎక్కువగా ఉంటే యాంటీ మోడీ క్యాంప్ లో మళ్ళీ యాక్టివ్ కావాలి అన్నదే బాబు ఆలోచనగా ఉంది. తాజాగా క‌రోనా విషయంలో బాబు మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరూ జాతి ప్రయోజనాలకు తాకట్టుపెట్టకూడదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ని విమర్శించాలి అనుకుంటే బాబు నేరుగా ఆయన పేరు వాడేస్తారు. కానీ ఆయన ఈ మాట అంటూ జాతి అన్నారు. మరి ఆ విధంగా చూస్తే మోడీ మీద ఇండైరెక్ట్ కామెంట్ అనే పరిశీలకులు అంటున్నారు.

వెయిట్ ఇస్తారా…?

ఇక జగన్ ని దేశంలో ఎదుగుతున్న నేతగా జాతీయ స్థాయిలో విపక్ష నేతలు చూస్తున్నారు. ఆయన మరిన్ని సార్లు సీఎం గా కూడా ఏపీకి ఉంటారు అని కూడా అంచనా వేస్తున్నారు. పైగా ఆయనకు ఏపీ తప్ప జాతీయ రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేదు అన్నది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లాంటి వారు గమనించారు. అందుకే రేపటి రోజున తాము ప్రధాని పీఠానికి పోటీ పడితే జగన్ మద్దతు అవసరం అనే ఆమె ఆ మధ్యన జగన్ కి లేఖ రాశారు అని అంటారు. ఇక అనేక మంది ఇతర విపక్ష నేతలకు కూడా జగన్ కచ్చితమైన రాజకీయ విధానాల పట్ల నమ్మకం ఉంది అని చెబుతారు. దాంతో జగన్ కి యాంటీ మోడీ క్యాంప్ లో వెయిట్ ఇస్తారు అని ప్రచారం అవుతోంది.

జగన్ రూట్ అదేనా…?

ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఒక మీడియా చర్చా గోష్టిలో వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ యాంటీ బీజేపీ శిబిరం ఏర్పాటు అయ్యే అవకాశాలు దేశంలో ఉన్నాయని అభిప్రాయపడడం విశేషం. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తాయి అని కూడా ఆయన అంచనా వేస్తున్నారు. మరి ఆయన జగన్ మనసెరిగిన నేతగా కూడా చెబుతారు. ఆ విధంగా ఆలోచిస్తే బీజేపీ నుంచి యాంటీ మోడీ క్యాంప్ వైపుగా వైసీపీ ఆలోచనలు సాగుతున్నాయా అన్న చర్చ కూడా వస్తోంది. ఈ మధ్యన తరచుగా బీజేపీ మీద వైసీపీ మంత్రులు కూడా బాణాలు ఎక్కుపెడుతున్నారు. గట్టిగా కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ కనుక ఆలోచిస్తే వైసీపీ కూడా జాతీయ రాజకీయాల్లో తనదైన రూట్ తీసుకుంటుంది అన్న చర్చ అయితే ఉంది మరి.

Tags:    

Similar News