జగన్ మార్క్ సర్పయాగం…?

జగన్ అన్న క్యారక్టర్ ఇప్పటిదాకా టీడీపీకి ఎక్కడా తగిలి ఉండదు. జగన్ కంటే ముందు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసిన తెలుగుదేశం నాయకులు జగన్ తోనూ అదే [more]

Update: 2021-04-24 02:00 GMT

జగన్ అన్న క్యారక్టర్ ఇప్పటిదాకా టీడీపీకి ఎక్కడా తగిలి ఉండదు. జగన్ కంటే ముందు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసిన తెలుగుదేశం నాయకులు జగన్ తోనూ అదే గేమ్ ఆడుతున్నారు. కంప్లీట్ ట్రెడిషనల్ పాలిటిక్స్ నే వారు ఫాలో అవుతున్నారు. కానీ అక్కడ ఉన్నది జగన్. ఆయనకు ఎలాంటి మొహమాటాలూ లేవు, అంతే కాదు, ఆయన తలచుకుంటే ఎవరైనా జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందే. తెలుగుదేశంలో ఉన్న బిగ్ షాట్స్ ని లెక్క పెట్టి మరీ లెక్క తేల్చేసే పనిలో జగన్ ఉన్నారు. టీడీపీ మాత్రం రొటీన్ పాలిటిక్స్ చేస్తూ జగన్ దూకుడు ముందు చేతులెత్తేస్తోంది.

లిస్ట్ ఇంకా ఉంది….

తాజాగా సంగం డైరీ చైర్మన్, అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ళ నరేంద్ర చౌదరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. యధా ప్రకారం టీడీపీ దాని అనుకూల మీడియా కక్ష సాధింపు అంటూ విమర్శలు మొదలెట్టాయి. మా మీద పగ పట్టారంటూ పసుపు తమ్ముళ్ళు సెంటిమెంట్ ని పండించే ప్రయత్నం చేస్తున్నాయి. నిజానికి జగన్ సర్కార్ ఏ ఆధారమూ లేకుండా ఊరికే అరెస్టులు చేయడంలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పైగా అవినీతి అక్రమాలు చేస్తూంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ గట్టిగానే వైసీపీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. టీడీపీ ఇంతలోనే ఇలా పరేషాన్ అయితే ఎలా అంటున్నారు. ఇంకా పెద్ద లిస్టే తమ వద్ద ఉందని వైసీపీ నేతలు హడలకొడుతున్నారు.

అదే వ్యూహం …?

మరో వైపు టీడీపీ సానుభూతిపరులు అయితే అరెస్టుల వరకూ ఓకే కానీ వారు చేసిన నేరాలు ఏంటో ఎస్టాబ్లిష్ చేయడమో ప్రభుత్వం విఫలమైందని అంటున్నారు. దాంతో ఇవి కేవలం రాజకీయ అరెస్టులు గానే చూడాల్సి ఉంటుందని కూడా అంటున్నారు. కానీ ఇక్కడ జగన్ ఎంచుకున్న వ్యూహమే వేరు. అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం ద్వారా టీడీపీ పెద్ద లీడర్లను జనాల్లో పలుచన చేస్తున్నారు. వారు అధికారంలో ఉన్నపుడు ఏమేం చేశారు అన్నది ప్రజా కోర్టు ముందు పెడుతున్నారు. దానికి తోడు టీడీపీ నేతలు కూడా కేసు పూర్వపరాలు తెలియనీయకుండా స్టేలు తెచ్చుకోవడం కూడా జగన్ సర్కార్ చెప్పేవి జనాలు నమ్మేలా చేస్తోంది అంటున్నారు.

ఇంకా మూడేళ్ళు …?

అపుడే ఏమైంది ముందుంది ముసళ్ళ పండుగ అని వైసీపీ నేతలు హింట్ ఇస్తున్నారు. పదమూడు జిల్లాల్లోని బడా నాయకులు, టీడీపీకి అన్ని విధాలుగా దన్నుగా ఉన్న వారిని ఏరివేసే భారీ సర్పయాగమే ఇపుడు జరుగుతోంది. ఒక విధంగా టీడీపీ కూశాలు కదిలించాలన్నదే జగన్ ఎత్తుగడ. ఈ సర్పయాగం లో పాములన్నీ కూడా ఎక్కడ చేరి ఎవరి సింహాసన్నాన్ని అల్లుకుని ఉన్నాయో ఆ మూలపురుషుడిని కూడా వాటితో పాటే బయటకు తీసుకురావాలన్నదే అతి పెద్ద టార్గెట్. చూడబోతే ఈ కధ ఇంతటితో ఆగేలా లేదు. మరో మూడేళ్ళ పాటు జగన్ కి అధికారం ఉంది. అందువల్ల ఇంకా ఎంత మంది పెద్ద నాయకుల అరెస్టులు ఉంటాయో, మరెంతమంది కీలక నేతల మీద కేసులు నమోదు చేస్తారో ఏపీ రాజకీయ తెర మీద చూడాల్సిందే.

Tags:    

Similar News