జగన్… ఏక్ నిరంజన్…?

ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. ఆయన అటు పార్టీకి పెద్ద, ఇటు ప్రభుత్వానికి సారధి కూడా ఆయనే. ఇలా ఎంతో గురుతరమైన బాధ్యతలను మోస్తున్న జగన్ తానే [more]

Update: 2021-05-07 08:00 GMT

ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. ఆయన అటు పార్టీకి పెద్ద, ఇటు ప్రభుత్వానికి సారధి కూడా ఆయనే. ఇలా ఎంతో గురుతరమైన బాధ్యతలను మోస్తున్న జగన్ తానే సర్వం సహా అన్నట్లుగా ప్రభుత్వాన్ని మార్చేశారు. జగన్ అధికారం చేపట్టాక కొన్ని విషయాలను గమనిస్తే ఆయన అనుసరిస్తున్న తీరు పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. జగన్ సీఎం అయ్యాక అసెంబ్లీ సమావేశాలు జరిగింది చాలా చాలా తక్కువ. అదే విధంగా జగన్ హయాంలో మంత్రి వర్గ సమావేశాలు కూడా చాలా తక్కువగా జరిగాయని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో జగన్ మీడియా సమావేశాలకు బహు దూరం. మొత్తానికి పూర్తి ప్రత్యేకతలతోనే జగన్ రెండేళ్ల ఏలుబడి సాగిందనే చెప్పాలి.

నాడు అలా డిమాండ్….

ఇదిలా ఉంటే విపక్షంలో ఉన్నపుడు అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని జగన్ గట్టిగా డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే జగన్ సర్కార్ తో పోలిస్తే నాటి టీడీపీ సర్కార్ నెల రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించేది. అలాగే వర్షాకాల, శీతాకాల సమావేశాలు కూడా ఠంచనుగా అయిదేళ్ళూ సాగాయి. మొత్తానికి కనీసంగా అయినా నలభై రోజూలకు పైగా అసెంబ్లీ పనిదినాలు నాడు నమోదు అయ్యాయి. ఇక జగన్ విపక్ష నేతగా చివరి రెండేళ్ళ కాలం అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. ఆయన పాదయాత్ర పేరిట జనాల్లో ఉండడం వల్ల అసెంబ్లీకి హాజరు కాలేదు.

రివర్స్ గేర్ లో…?

ఇక జగన్ సీఎం అయ్యాక అసెంబ్లీ పనిదినాలు బొత్తిగా తగ్గిపోయాయి అన్న విమర్శ అయితే ఉంది. ఆయన 2019 మే 30న సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత జూన్ లో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నిర్వహించారు. అదొక్కటే ఈ రెండేళ్ల కాలంలో ఎక్కువ రోజులు జరిగిన సమావేశాలుగా చెప్పుకోవాలి. ఇక అదే ఏడాది శీతాకాల సమావేశాలు కూడా వారం రోజులకు పైగా సాగాయి. 2020లో అయితే బడ్జెట్ సమావేశాలు కరోనా వల్ల రద్దు అయ్యాయి. జూన్ లో కేవలం రెండు రోజులు మాత్రమే జరిగాయి. ఇక శీతాకాల సమావేశాలు కూడా పెద్దగా జరగలేదు. ఇక 2021లో చూసుకుంటే మరో మారు బడ్జెట్ సమావేశాలు రద్దు అయ్యాయి. జూన్ లో ద్రవ్య బిల్లుల ఆమోదానికి మమ అనిపించేస్తారు అంటున్నారు. మొత్తానికి జగన్ హయాంలో అసెంబ్లీ సెషన్ అన్నది పెద్దగా సాగడంలేదని విపక్షాలు అంటున్నారు.

అతి తక్కువగానే…?

జగన్ సీఎం అయిన కొత్తలో నెలలో రెండు సార్లు మంత్రి వర్గం సమావేశం కావాలని నిర్ణయించారు. కొన్నాళ్ళు అలా సాగినా తరువాత మాత్రం ఎందుకో ఆగిపోయింది. ఇక కరోనా ఎఫెక్ట్ తరువాత పూర్తిగా ఆ నియమం దారి తప్పేసింది. మంత్రి వర్గ సమావేశాలు తరచూ నిర్వహించడం ద్వారా రాష్ట్రంలోని కీలకమైన అంశాల మీద కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది. అలాగే ఎంత గోల అని అనుకున్నా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వల్ల ప్రజా సమస్యలు ఏదో రూపంలో వెలుగు చూస్తాయి. జగన్ మీడియాకు దూరం కావడం వల్ల జనం గొంతుక ఏంటి అన్నది ఆయనకు డైరెక్ట్ గా తెలిసే అవకాశం లేకుండా పోతోంది అంటున్నారు. మొత్తానికి ఎటువంటి పెను విపత్తులు ఏపీలో వచ్చినా జగన్ తాను ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న అపప్రధ అయితే ఉంది.

Tags:    

Similar News