ఏమీ లేని విశాఖ దేనికి జగన్ ?

విశాఖ సుందర నగరమని ప్రశాంత నగరమని అభివృద్ధికి సంకేతమని నేతలు ప్రసంగాలు చేస్తూంటారు. కానీ ఆచరణలో మాత్రం విశాఖకు పెద్దగా చేసింది ఏదీ లేదు. పోనీ చేయకపోతే [more]

Update: 2021-05-06 08:00 GMT

విశాఖ సుందర నగరమని ప్రశాంత నగరమని అభివృద్ధికి సంకేతమని నేతలు ప్రసంగాలు చేస్తూంటారు. కానీ ఆచరణలో మాత్రం విశాఖకు పెద్దగా చేసింది ఏదీ లేదు. పోనీ చేయకపోతే పోయే. కనీసం ఉన్న వాటినైనా కాపాడితే అదే పదివేలు అంటున్నారు విశాఖ జనం. చంద్రబాబు తప్పు చేశాడని చెప్పిన జగన్ తానూ అదే తప్పులు చేస్తే ఎలా అంటోంది మేధావి వర్గం. బంగారం లాంటి ప్రభుత్వ భూములు తెగనమ్మడమేంటని కూడా ప్రశ్నిస్తోంది.

నాడు వైఎస్ కూడా…?

వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు విశాఖలో విలువైన వందల ఎకరాల ప్రభుత్వ భూములను వుడా సహకారంతో వేలం వేసి దాంతో ఉమ్మడి ఏపీలో పలు కార్యక్రమాలు చేపట్టారు. విశాఖకు అందులో ఫలితం ఎంత దక్కిందో తెలియదు కానీ సర్కార్ భూములు మాత్రం ప్రైవేట్ పరం అయిపోయాయి. ఇక ఇపుదు జగన్ సైతం తండ్రి బాటలోనే వెళ్తున్నారు అంటున్నారు. జగన్ విశాఖలో భూములను అమ్మకానికి పెట్టడం ద్వారా ఏం సాధిస్తారు అన్న మాట కూడా సగటు జనం నుంచి వస్తోంది.

లిస్ట్ చాలా పెద్దదే …?

విశాఖలో లూలూ గ్రూపు భూములతో పాటు దాదాపు రెండు వందల ఎకరాలను తొలి విడతగా అమ్మకానికి పెట్టారు. అయితే దీని తరువాత సింహాచలం భూములతో పాటు మాన్సాస్ భూములు, ఇంకా వివిధ ట్రస్ట్ ల కింద ఉన్న భూములను ప్రభుత్వం వేలం వేస్తుంది అంటున్నారు. ఈ జాబితాను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు బయటపెట్టారు. జగన్ విశాఖలో భూములను తెగనమ్ముతూంటే మేధావులు ఎందుకు నోరు మెదపరు అంటూ ఆయన గట్టిగానే నిలదీస్తున్నారు. పాలన చేతగాక ఖజనాను ఖాళీ చేశాడని, ఇపుడు భూములు అమ్మి ఖజానాను నింపుకోవాలని చూడడం దారుణమని కూడా అయ్యన్న అంటున్నారు.

వ్యతిరేకత ఖాయం …

నిన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని పెద్ద మెజారిటీ ఏమీ రాలేదు. అధికారంలో ఉండడంతో పాటు అనేక రకాలుగా అండదండలు కలసి వచ్చి మేయర్ పీఠం బొటాబొటీ మెజారిటీతో దక్కింది. ఇపుడు స్టీల్ ప్లాంట్ ని కేంద్రం ప్రైవేట్ పరం చేస్తోంది. దానిని ఆపే ప్రయత్నం ఏదీ జగన్ చేయడంలేదు. అదే సమయంలో జగన్ కూడా తానూ రెడీ అంటూ భూములను అమ్మకానికి పెట్టడం వల్ల విశాఖ వాసుల్లో వైసీపీ సర్కార్ మీద వ్యతిరేకత పెరుగుతోంది. విశాఖను పాలనా రాజధాని జగన్ ప్రకటించారు. మరి విశాఖ అభివృద్ధి కోసం ప్రభుత్వం వద్ద ఉన్న కార్యాచరణ ఏంటని కూడా చర్చకు వస్తోంది. అన్నీ అమ్మేశాక, సర్వం ప్రైవేట్ పరం అయ్యాక జగన్ ముఖ్యమంత్రిగా విశాఖ వచ్చి కూర్చున్నా ఉపయోగం ఏంటని కూడా అంటున్నారు.

Tags:    

Similar News