జగన్ విజన్ అంతా అదేనట.. విపక్షానికి చెమటలే

విశ్వ నగరం అంటే యావత్తు ప్రపంచానికి తెలిసిన నగరం. అక్కడ అందరూ వచ్చే పోయే నగరం. అన్ని కాలాలూ అందరికీ అనువుగా ఉండే మెగా సిటీ. మత [more]

Update: 2021-04-08 14:30 GMT

విశ్వ నగరం అంటే యావత్తు ప్రపంచానికి తెలిసిన నగరం. అక్కడ అందరూ వచ్చే పోయే నగరం. అన్ని కాలాలూ అందరికీ అనువుగా ఉండే మెగా సిటీ. మత సామరస్యంతో పాటు సకల జనాలు కలసి మెలసి ఉండే నగరం. ఇన్ని అర్హతలు ఉన్న నగరాలను వరల్డ్ క్లాస్ సిటీస్ అంటారు. ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో విశ్వ నగరం అన్న మాట చాలా ఎక్కువగా వినిపిస్తోంది. విడిపోయిన తరువాత తెలంగాణాకు హైదరాబాద్ రాజధాని అయింది. దాంతో భాగ్యనగరాన్ని విశ్వనగరం చేస్తామని అధికారంలో ఉన్న టీయారెస్ ప్రభుత్వం పదే పదే అంటోంది.

విశాఖ సైతం…..

ఇక ఉమ్మడి ఏపీలో చూసుకున్నా విభజన నవ్యాంధ్రలో చూసుకున్నా హైదరాబాద్ తరువాత ఠక్కున అందరికీ గుర్తుకు వచ్చే నగరం విశాఖ మాత్రమే. అందుకే విశాఖను ఆర్ధిక రాజధాని అని గత చంద్రబాబు అంటే ఏకంగా పాలనా రాజధాని అని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు. విశాఖ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులూ సరిగ్గానే ఆలోచించారు. అయితే హోదా ఇచ్చే విషయంలో మాత్రం జగన్ ముందున్నారు. విశాఖ మన పరిపాలనా రాజధాని అని ఆయన ఏ జంకూ గొంకూ లేకుండా చెబుతున్నారు.

మినీ భారతమే ….?

విశాఖ సిటీ అంటే పాతిక లక్షల పైబడిన జనాభా కలిగిన మహా నగరం. ఇక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వారూ ఉంటారు. అలాగే ఇతర దేశాలకు చెందిన వారు సైతం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. విశాఖ ఆసియా ఖండంలోనే వేగంగా విస్తరిస్తున్న సిటీ. దాంతో ఈ నగరానికి మరింత ప్రగతిని చూపిస్తే ప్రపంచాన్ని ఆకట్టుకుంటుందని ముఖ్యమంత్రి జగన్ ఆలోచన చేస్తున్నారు. ఇక విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ ఇచ్చిన నినాదం విశ్వనగరమనే. విశాఖ పాలనను మాకు అప్పగించండి, వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దుతామని వైసీపీ గట్టి హామీనే ఇచ్చింది. ఇపుడు విశాఖ కార్పొరేషన్ మీద వైసీపీ జెండా ఎగురుతోంది.

టార్గెట్ అదే …?

చంద్రబాబు విజన్ అప్పట్లో 2020 అయితే ఇపుడు జగన్ విజన్ 2050. అది కూడా విశాఖ గురించే. మరో ముప్పయేళ్ల నాటికి విశాఖ కచ్చితంగా ప్రపంచంలో టాప్ సిటీస్ లో ఒకటిగా ఉంటుందని, ఉండాలని జగన్ ఆకాక్షిస్తున్నారు. దానికి తగినట్లుగానే ఆయన యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 43 మండలాలు ఉంటే అందులో ఏజెన్సీలోని 11 మండలాలు తప్ప మిగిలినవి అన్నీ కూడా విశాఖ మెట్రో డెవలప్మెంట్ అధారిటీ పరిధిలోకి తెస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక విశాఖ సిటీలో మౌలిక సదుపాయల కల్పన మీద దృష్టి పెడుతున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తని విధంగా మరో నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. ఎనిమిది లైన్ల రోడ్లు, టూరిజం కారిడార్లు. ఐటీ సర్క్యూట్స్ వంటివి విశాఖ అభివృద్ధిని ఎక్కడికో తీసుకుపోతాయని జగన్ భావిస్తున్నారు. ఆ దిశగా అటు వీఎమ్మార్డీయేకు, ఇటు జీవీఎంసీకి కూడా భారీ టార్గెట్లను జగన్ ఇచ్చేశారు. రానున్న రోజులలో పాలనా రాజధానిగా విశాఖను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. మొత్తానికి చూస్తే అటు హైదరాబాద్, ఇటు విశాఖపట్నం కూడా విశ్వనగరాలుగా వెలుగొందితే ప్రతీ తెలుగువాడూ గర్విస్తాడు కదా.

Tags:    

Similar News