పార్టీలో చేరినా గుర్తింపులేదా? ఇదేంది జగన్?

వైఎస్ జగన్ పాలన పట్ల ఆకర్షితులై నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోయారు. అంటే అధికారికంగా వారు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే. కేవలం వైసీపీ మద్దతుదారులు. పార్టీలో [more]

Update: 2021-03-18 02:00 GMT

వైఎస్ జగన్ పాలన పట్ల ఆకర్షితులై నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోయారు. అంటే అధికారికంగా వారు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే. కేవలం వైసీపీ మద్దతుదారులు. పార్టీలో నేరుగా వారిని చేర్చుకునేందుకు జగన్ ఇష్పపడలేదు. పార్టీలో నేరుగా చేరాలనుకుంటే పదవికి రాజీనామా చేసి రావాలని జగన్ శాసనసభ సాక్షిగా చెప్పడంతో రాజీనామా చేయడానికి ఎవరూ సిద్ధపడలేదు. అందుకే వారి కుటుంబ సభ్యులకు మాత్రం వైసీపీ కండువా కప్పారు.

నలుగురు మద్దతుదారులుగా….

తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ లు వైసీపీ మద్దతుదారులుగా మారిపోయారు. పార్టీకి రాజీనామా చేసినా, ఎమ్మెల్యే పదవులకు మాత్రం వీరు రాజీనామాలు చేయలేదు. వీరిపై టీడీపీ కూడా అనర్హత వేటు వేయమని కూడా కోరలేదు. శాసనసభలో స్పీకర్ వీరికి ప్రత్యేక సీట్లు కేటాయించారు. అయితే ఈ నలుగురు మాత్రం టీడీపీని వీడి వచ్చినా హ్యాపీగా లేరు.

ప్రయారిటీ లేక…

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వీరికి పెద్దగా ప్రయారిటీ లేకపోవడమే కారణమంటున్నారు. గత ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయిన వైసీపీ నేతలకు, వీరికి పొసగడం లేదు. వీరిమధ్య సయోధ్యకు అధినాయకత్వం ప్రయత్నించినా ఫలితం లేదు. రాను రాను విభేదాలు తీవ్రమవుతున్నాయి తప్పించి చల్లారేలా లేవు. ఈ నలుగురి పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్ప పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వీలు లేదు. ఇది మరింత ఇబ్బందికరంగా మారింది. పార్టీ క్యాడర్ కూడా వీరిని తమ నేతలుగా గుర్తించడం లేదు.

వ్యూహం వికటించిందా?

కానీ చంద్రబాబు ఇతర పార్టీల నేతలను నేరుగా తన పార్టీలోకి చేర్చుకున్నారు. వారు నాడు టీడీపీ ఎమ్మెల్యేలుగా మారిపోయారు. స్థానికంగా పార్టీ నేతలు వారిని కలుపుకోక పోయినా వారు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. క్యాడర్ కూడా వారిని తమ పార్టీ నేతలుగానే గుర్తించింది. కానీ జగన్ నేరుగా పార్టీ కండువా కప్పకపోవడం వల్లనే ఎమ్మెల్యేలు అధికారికంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారు. అందుకే మిగిలిన ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుదారులుగా మారేందుకు ఇష్టపడటం లేదు. అందుకే వలసలు ఆగిపోయాయంటున్నారు. మొత్తం మీద ఆపరేష్ ఆకర్ష్ విష‍యంలో జగన్ వ్యూహం వికటించిందంటున్నారు.

Tags:    

Similar News