ఏపీ సోమరిపోతుల సత్రమా…?

ఏపీలో కష్టపడిన వారు పన్నుల రూపంలో కప్పం కడుతున్నారు. తీరుబాటుగా ఇంటి పట్టున ఉన్న వారికి మాత్రం నగదు బదిలీ పధకం రూపేణా దోచిపెడుతున్నారు. దీని కోసం [more]

Update: 2021-03-08 06:30 GMT

ఏపీలో కష్టపడిన వారు పన్నుల రూపంలో కప్పం కడుతున్నారు. తీరుబాటుగా ఇంటి పట్టున ఉన్న వారికి మాత్రం నగదు బదిలీ పధకం రూపేణా దోచిపెడుతున్నారు. దీని కోసం నడ్డి విరిగేలా పన్నులు వడ్డిస్తున్నారు. ఇదేం పాలన జగనూ అంటూ మధ్యతరగతి తో పాటు వేతన జీవులు, చిన్న ఉద్యోగులూ గగ్గోలు పెడుతున్నారు. జగన్ తాను సంక్షేమ రాజ్యాన్ని తెచ్చి దేశంలోనే నంబర్ వన్ గా నిలిపాను అనుకుంటున్నారు. కానీ బయట విమర్శలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఏపీని సోమరుపోతుల సత్రంగా వైసీపీ పెద్దలు మార్చేశారు అని నిందిస్తున్నారు.

ఓవర్ అవుతోందిగా….?

ఏది అయినా అతి చేస్తే కష్టమే. ఏపీలో సంక్షేమం ఇపుడు దారి తప్పింది. ప్రజలను ఏ పనీ చేయకుండా తానున్నాను అంటూ జగన్ సర్కార్ పోషిస్తోంది అన్న చర్చ అయితే సాగుతోంది. కనీసం దగ్గర‌లోని రేషన్ దుకాణానికి నడచి వెళ్ళి సరకులు తెచ్చుకోకుండా హాయిగా ఇంటివద్దకే రేషన్ అంటూ జగన్ పెట్టిన స్కీం మీద కూడా హాట్ హాట్ కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. దీని వల్ల వేల కోట్లు ఖజానాకు ఖర్చు తప్ప మరేమీ ఒరిగేది ఏముంది అని కూడా అంటున్నారు. అలాగే అనేక పధకాల పేరిట జగన్ ఊరికే డబ్బులు కుమ్మరిస్తున్నారు అన్న మాట ఉంది.

అక్కడ సెంచరీ …

క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ సెంచరీ కొడితే జనాలకు ఆనందమే. వీధులోకి వచ్చి డ్యాన్స్ చేస్తారు. కానీ పెట్రోల్ లీటర్ వంద అంటే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు దారుణంగా పెరిగిపోవడంతో మధ్యతరగతి వర్గాలు నానా బాధలు పడుతున్నాయి. కేంద్రం మాత్రం పెట్రో ధరలు తగ్గించుకోవాలనుకుంటే రాష్ట్రం చేతిలోనే ఆ వీలు ఉంది అంటోంది. అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయన్ని కట్ చేసుకుని జగనే జనాలకు ఉపశమనం ఇవ్వాలని చెబుతున్నారు. మరి ఆ ఆదాయన్ని చూసుకునే జగన్ ఇన్ని రకాలైన స్కీములకు శ్రీకారం చుడుతున్నారు. అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టడం అంటే ఇదేనా అని జనం మండుతున్నారు.

కష్టమేనా ..?

ఖజనాకు చిల్లు పడింది అని నికరంగానే తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మధ్య దాకా ఠంచనుగా నెలకు జీతం పడడంలేదు. ఇపుడు అది కాస్తా రిటైర్ ఉద్యోగుల మీద పడింది. అంటే విశ్రాంత ఉద్యోగులు ఖాళీగా ఉన్నారు. వారికి ఎపుడు పెన్షన్ ఇచ్చినా ఫరవాలేదు అని ప్రభుత్వం అనుకుందేమో కానీ వారికి పదవ తేదీ దాటినా పెన్షన్ దక్కడంలేదు. ఇంకో వైపు పప్పు దినుసులు నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. కూరగాయాలు చేసే గాయాలు దానికి అదనం. మరి ఇన్ని రకాలుగా జనం బాధలు పడుతూంటే వాటికి పరిష్కారం చూపకుండా తెల్లకార్డుదారుల సంక్షేమం అంటూ జగన్ సర్కార్ చేస్తున్న ఫీట్లు, పడుతున్న పాట్లూ తేడా కొట్టేలాగానే ఉన్నాయని అంటున్నారు. ఇలా సీన్ రివర్స్ అయితే జగన్ అనుకున్నది నెరవేరకపోగా మొత్తానికే మోసం వస్తుందని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News