జగన్ కి ఆ పది శాతం మంది రివర్స్ అవుతారా?

జగన్ రాజకీయం చిత్రంగా ఉంది. ఆయన పూర్తిగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు అని ప్రత్యర్ధుల విమర్శలు పక్కన పెడితే పోకడలు కూడా అలాగే ఉన్నాయని అంటున్నారు. [more]

Update: 2020-12-31 14:30 GMT

జగన్ రాజకీయం చిత్రంగా ఉంది. ఆయన పూర్తిగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు అని ప్రత్యర్ధుల విమర్శలు పక్కన పెడితే పోకడలు కూడా అలాగే ఉన్నాయని అంటున్నారు. బీసీలు ఎస్సీ ఎస్టీలు, ఇతర సామాజిక వర్గాల చుట్టూనే జగన్ రాజకీయమంతా తిరుగుతోంది. వారు ఉంటే చాలు ఎవరూ తనకు అవసరం లేదన్నది ఆయన మార్క్ పాలిటిక్స్ లా కనిపిస్తోంది. దాంతో ఓసీలు జగన్ కి అసలు అవసరం లేదా అన్న మాట ఇపుడు ఏపీలో గట్టిగా వినిపిస్తోంది.

కీలకమే సుమా …?

ఏపీలో ఓసీలు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. బ్రాహ్మణులు మూడు నుంచి నాలుగు శాతం ఉంటే క్షత్రియులు రెండు శాతం ఉన్నారని చెబుతారు. అలాగే వైశ్యులు కూడా నాలుగైదు శాతంగా ఉన్నారు. మొత్తానికి పది శాతం తగ్గకుండా అగ్ర కుల జనాభా ఉంది. వీరిలో వైశ్యులకు, రాజులకు మంత్రి పదవులు అయినా దక్కాయి కానీ బ్రాహ్మణులకు అదీ లేదు. ఇక ఈ కులాలకు చెందిన వారు నూటికి ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారే. వారి విషయంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న చర్యలు పెద్దగా లేవని అంటున్నారు. ఇక ఎలైట్ పీపుల్ గా ఈ వర్గాలను సమాజంలో చూస్తారు. వీరు చెప్పిన మాటలు పది మందీ ఆలకిస్తారు. దాంతో జగన్ సర్కార్ మీద వ్యతిరేకత రాజేయడానికి వీరు సరిపోతారు అని కూడా విశ్లేషణ ఉంది.

దెబ్బ పడుతోందిగా…?

చంద్రబాబుకు బ్రాహ్మణులు గిట్టరు, వారికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవ్వలేదని గతంలో ప్రచారం చేసేవారు. కానీ బాబు దేశంలోనే తొలిసారి బ్రాహ్మణ కార్పొరేషన్ ని ఏపీలో ఏర్పాటు చేసి బ్రాహ్మణుల మనసు దోచుకున్నారు. గత ఎన్నికల్లో కూడా మెజారిటీ బ్రాహ్మణులు ఆయనకే ఓటు వేశారు ఇక జగన్ అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పోరేషన్ కి వేయి కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పినా చివరికి దానికి అతీ గతీ లేకుండా చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇపుడు బ్రాహ్మణ కార్పోరేషన్ ని పూర్తిగా లేకుండా చేశారు, అందులో పింఛన్ దారులను సామాజిక పించన్ల జాబితాలోకి మార్చడంతో అక్కడ అర్హతలు వారికి సరిపోక చాలా మందికి పించన్లు ఎగిరిపోయాయి.

సంక్షేమంలోనూ భారీ కోత…..

ఇక రేషన్ కార్డులు ఎక్కువగా తొలగించిన జాబితాలో బ్రాహ్మణులు ఇతర అగ్ర వర్ణాల వారే ఉన్నారు. వారంతా జగన్ సర్కార్ మీద ఇపుడు గుర్రుగా ఉన్నారు. రేషన్ కార్డు కోసం జగన్ సర్కార్ మార్చిన నిబంధనలు వాస్తవంగా పేదలు అయినప్పటికీ ఈ అగ్ర సామాజిక‌ వర్గాలకు గుదిబండగా మారాయి. దాంతో తెల్ల రేషన్ కార్డ్ దక్కకుండా పోయింది. ఆ కార్డు లేకపోవడంతో మొత్తం సంక్షేమ పధకాలకే వీరు దూరం అయ్యారు. దాంతో వీరంతా జగన్ సర్కార్ మీద పూర్తి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.

సొంత కులంలోనూ ….

ఇక రెడ్లు అని గట్టిగా గర్వంగా చెబుతారు కానీ వారి పరిస్థితి ఇపుడు ఉన్న సమాజంలో కడు దుర్బరంగా ఉంది. కూటికి గటి లేని వారు అక్కడా ఉన్నారు. జగన్ మాత్రం బీసీ మంత్రంలో అగ్ర కులాలను అసలు ఖాతరు చేయకపోవడం పట్ల సొంత కులంలోనూ అగ్గి రాజుకుంటోంది. నిజానికి బడుగులను చూడవద్దు అని ఎవరూ అనరు. అదే సమయంలో అగ్ర కులాలను కూడా అక్కున చేర్చుకునేలా ప్రణాళికలను రూపొందించుకుంటేనే సామాజిక సమతూకం సాధ్యపడుతుంది. జగన్ ఆ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. ముంద చెప్పుకున్నట్లుగా ఎలైట్ పీపుల్ గా ఉన్న ఈ పది శాతం జగన్ కి వ్యతిరేకంగా మారితే మాత్రం వైసీపీకి రాజకీయంగా అది చిక్కులు తెచ్చేదే అని అంటున్నారు.

Tags:    

Similar News