మాట నిలబెట్టుకున్న జగన్

దాదాపు మూడేళ్ళ క్రితం ఉద్ధానం అన్న మాట తరచూ వినిపించేది. దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ తన పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా [more]

Update: 2020-12-24 00:30 GMT

దాదాపు మూడేళ్ళ క్రితం ఉద్ధానం అన్న మాట తరచూ వినిపించేది. దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ తన పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం వెళ్లడం, అక్కడి కిడ్నీ వ్యాధుల బారిన పడిన వారి కష్టాలను చూసి ఆదుకోవాలంటూ నాటి సీఎం చంద్రబాబుకు వినతి చేయడం జరిగింది. అయితే నాడు సరేనన్నా కూడా బాబు సర్కార్ మాత్రం ఏం చేసింది లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆ తరువాత జగన్ పాదయాత్ర అదే ఉద్ధానం మీదుగా సాగడంతో ఆయన వారి బాధలు చూసి చలించిపోయి నాడే ఒక భారీ హామీ ఇచ్చారు దాని ఫలితాన్ని ఇపుడు వారు చూస్తున్నారు.

భారీ వాటర్ గ్రిడ్…..

జగన్ సీఎం అయిన ఏడాదిన్నర కాలంలోనే ఉధ్దానానికి ఉచ్చ దశ పట్టింది. ఏడు వందల కోట్లతో భారీ వాటర్ గ్రిడ్ పధకాన్ని జగన్ ఈ ప్రాంతానికి మంజూరు చేశారు. తాజాగా దానికి ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ శంఖుస్థాపన చేయడంతో ఉద్ధానం జనానికి మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. ఇప్పటిదాకా భూగర్భ జలాల నీరు తరాలుగా తాగుతూ ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారన్నది లోకానికి తెలిసినా సురక్షితమైన నీటిని ఇంతదాకా ఏపీని ఏలిన పాలకులు ఎవరూ అందించ లేకపోయారు. కానీ జగన్ మాత్రం ఇపుడు ఆ భగీరధ ప్రయత్నాన్ని సాకారం చేసి చూపిస్తున్నారు. హీరమండలంలోని గొట్టా బ్యారేజ్ నుంచి వంశధార నీటిని తీసుకువచ్చి వాటర్ గ్రిడ్ కి అనుసంధానం చేయయడం ద్వారా దాదాపు వేయి గ్రామాల ప్రజలకు సురక్షితమైన నీటిని అందించే ప్రాజెక్ట్ ని వైసీపీ సర్కార్ చేపట్టింది.

రెండు నియోజకవర్గాలకు….

శ్రీకాకుళం జిల్లాలోని పలాసా, ఇచ్చాపురం నియోజకవర్గాలకు దీని వల్ల రక్షిత తాగు నీరు లభిస్తుంది. దాంతో లక్షలాది ప్రజలకు, పేదలకు స్వాంతన లభిస్తుంది. ఇంతకాలం తాగేందుకు ఏ మాత్రం యోగ్యం కాని నీటిని తాగి కిడ్నీ వ్యాధులతో తమ బతుకులు అర్ధాంతరంగా చాలించుకున్న వారికి జగన్ సర్కార్ భారీ ఊరటని ఇచ్చేలా ఈ పధకాన్ని రూపొందించింది. హామీ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం అమలులోకి తీసుకురావడం ద్వారా ఈ ప్రాంతీయుల అభిమానాన్ని కూడా చూరగొంది.

జిల్లా కేంద్రంగా….

ఇక ఇంతటితో ఉద్ధానం వైభోగం ఆగదు అంటున్నారు. పలాసను జిల్లాగా చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. దాంతో వీరంతా ఉపాధికి కూడా నోచుకుంటారు. అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది. పలాస జీడిపప్పుకు, ఉద్ధానం కొబ్బరికి అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది. దాంతో పాటుగా భావనపాడు పోర్టుని కూడా నిర్మిస్తే ఈ ప్రాంతాలన్నీ కూడా భవిష్యత్తులో ఎన్నడూ చూడని అభివృద్ధిని చూస్తాయని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే జగన్ సర్కార్ కదలికతో దశాబ్దాల‌ ఉద్ధానం బాధలకు మోక్షం కలిగింది అంటున్నారు. దాంతో ఉద్ధానం గురించి ఎవరెన్ని మాట్లాడినా ఉద్ధరించించి మాత్రం జగనేనని వైసీపీ నేతలు గొప్పగా చెబుతున్నారు.

Tags:    

Similar News